Powered By Blogger

Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం గమ్మత్తు గమనించారా... మొదటి రోజే 1 . 1 . 11 .
సరదాగా ఉంది కదూ.
కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభప్రదం కావాలని ఆశిస్తూ... 


~శశిధర్ సంగరాజు. 

Friday, December 24, 2010

క్రిస్మస్ శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 
 
~శశిధర్ సంగరాజు. 

చంద్రబాబు...జగన్.. ఓ పేదరైతు

ఎలాగైతేనేం, మొత్తానికి, రాష్ట్ర ప్రభుత్వం,  చంద్రబాబు దీక్ష భగ్నం చెయ్యగలిగింది. విజయవాడలో జగన్ చేపట్టిన దీక్ష 48 గంటలు మాత్రమే అని ముందుగానే చెప్పడం వల్ల అక్కడ అరెస్టులు లాంటి హడావిడి ఏమి లేకుండానే, ఆయనే దీక్ష ముగించేసారు. ఈ మొత్తం దీక్షా కార్యక్రమాలను, అమెరికాలో నాకు వీలున్నంతవరకు పేపర్లు, టీవీ ల ద్వారా ఫాలో అయ్యే ప్రయత్నం చేసాను .నాకొక విషయం అర్థం కాలేదు. నాయకుల దీక్షలు, వాటికైయ్యే బందోబస్తు, రక్షణకు వచ్చే పొలీసుల జీతభత్యాలు, ఈ నాయకులు, వారి అనుచరగణం చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, మళ్లీ వాటిని బాగు చెయ్యడానికయ్యే  ఖర్చు. ఇదంతా కలసి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. వీళ్ళంతా చేసే దీక్షలు రైతులకోసమే అయినప్పుడు, ఆ డబ్బేదో రైతులకిచ్చే ప్యాకేజ్ లోనే కలిపి ఇస్తే, పాపం రైతులకు కొంతైనా ప్రయోజనం ఉంటుంది కదా అనిపించింది. సరే, ఈ దీక్షలవల్ల రైతులకు ఏం ఒరిగింది అనే విషయం పక్కనపెడితే, రాజకీయ నాయకులకు ఎవరికెంత లాభమొచ్చిందో చూద్దాం. 


చంద్రబాబు (ఎంతైనా సీనియర్ కదా, ముందు ఆయన గురించే చెప్పుకుందాం): తెలంగాణా, సీమాంధ్ర రెండూ, రెండు కళ్ళు అనిచెప్పి దాదాపు చూపు పోగొట్టుకుంటున్న తరుణంలో, చంద్రబాబుకు ఈ దీక్ష భలే ఉపయోగపడింది. జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్, జాతీయ నాయకుల పలకరింపులు మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల్లో కూడా సానుభూతి కూడా పెరిగింది. దీనికి అధిష్టానం నిర్లక్ష్య, నిరంకుశ ధోరణి కూడా తోడైంది. అది వేరే విషయం. చంద్రబాబు పేరు చెపితే చిందులేసే అమెరికాలోని తెలుగు మిత్రుడు కూడా "పాపం, అరవై ఏళ్ళ వయసులో, బాగానే కష్టపడ్డాడు" అనేసాడు. సాక్షాత్తు, అధికార పార్టీ ఆరోగ్య మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి, జగన్ పెట్టబోయే పార్టీ కన్నా, తెలుగుదేశం వందరెట్లు మేలు అన్నాడంటే, బాబు దీక్ష ఫలప్రదమైనట్లే. మన టైంబాలేక మధ్యంతరం వస్తే, బాబును రైతు జనభాంధవుడు గా ప్రొజెక్ట్ చెయ్యడానికి తెదేపా శ్రేణులు కదం తొక్కుతాయి. సందేహం లేదు. 

జగన్: ప్రత్యక్ష రాజకీయాల్లో, నిండా రెండు సంవత్సరాల సీనియారిటీ కూడా లేని బుడ్డోడు, 125  సంవత్సరాల (వాళ్ళే చెప్పుకున్నారు) వయసున్న కాంగ్రెస్ పార్టీ కి సినిమా చూపించేసాడు. అంతవరకూ, "అబ్బే, ఇప్పుడు జగన్ వెనకాల పదిమంది కంటే ఎక్కువమంది లేరని" చప్పరించేసిన సీనియర్లకు, దాదాపు పాతిక పైచిలుకు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు, వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను చూసి పొలమారి ఉంటుంది. ఇంతవరకూ అటూ, ఇటూ గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఈ దీక్ష పుణ్యమా అని తెరముందుకొచ్చి తొడలు కొట్టేస్తున్నారు. జీవిత, రాజశేఖర్ లాంటి పక్క వాయిద్యాలు మామూలే. ఈ సారి తానుకూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానని రాజశేఖర్ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు. ఇక మీ ఇష్టం. ఈ లెక్కన దీక్ష, జగన్ కు కూడా బ్రంహాండంగా కలిసొచ్చింది.


పేదరైతు: ఆంబోతుల కుమ్ములాటలో నలిగిపోయిన లేగదూడలా, పాపం, ఒకవైపు పంట నష్టం, మరోవైపు కౌలుదారుల ఒత్తిడి, కోతకొచ్చిన పంట పొలంలోనే కుళ్ళిపోతూఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ మొత్తం ప్రహసనం లో పూర్తిగా నష్టపోయింది రైతే. ఈ పరిస్థితే కొనసాగితే, ఇక ముందు ముందు, నాట్లు వెయ్యడానికికూడా ఎవరూ ముందుకు రారేమో.


అదేదో సినిమాలో సాయికుమార్ డైలాగు చెప్పినట్లు, ప్రస్తుతం రాష్ట్రం లో కనపడని నాలుగో సింహం ఒకటి తిరుగుతోంది. అదే, చిరంజీవి..రంజీవి..జీవి..వి..(ఇక్కడ కావాలంటే, మీరు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ వేసుకోవచ్చు) .తాజా రాజకీయ పరిణామాలవల్ల ఈయనకు కూడా ఒక లాభం జరిగింది. అదెలాగంటే, ఇంతకుముందు, ప్రెస్ మీట్లలో విలేఖర్లు "ఫలానా వారు మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారట కదా?" అని అడిగితే , "అవునా?" అంటూ అముల్ బేబీ పేస్ పెట్టేవాడు. ఇంక లెక్క చూసుకోక తప్పేట్లు లేదు. ముగ్గురు బహిరంగంగానే జగన్ దీక్షలో పాల్గొని మద్దతిచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎప్పుడు జంప్ జిలాని అవుదామా అని ఎదురుచూస్తున్నారు. పోన్లెండి, ఈ రకంగానైనా తనవాళ్ళెవరో , పైవాళ్ళెవరో తెలిసొస్తుంది.


~శశిధర్ సంగరాజు.

Saturday, December 18, 2010

కృష్ణ భగవాన్ - నీకిదేం బుద్ది?

నిన్న సాయంత్రం టీవిలో చూసాను, సినీ  హాస్యనటుడు కృష్ణ భగవాన్ పిచ్చి చేష్టలు. "ఏప్రిల్ ఒకటి విడుదల"
సినిమాతో నటుడిగా లైంలైట్ లో కొచ్చిన ఈయన, గోదావరి జిల్లాల యాసతో డైలాగులు చెప్పడంలో ప్రసిద్ధుడు. అంతవరకూ బాగానే ఉంది. 

ఇటీవల, నరసాపురం లో ఒక విద్యాసంస్థ, వాళ్ళ కాలేజి "ఫ్రెషర్స్ డే"  కార్యక్రమానికి ఈ ప్రభుద్దుడిని పిలిచారు, ఇంకెవరూ లేనట్లు. సరే, వచ్చినవాడు సక్రమంగా రావచ్చు కదా? తప్పతాగి మరీ వచ్చాడు. ఆ తాగి తగలడేదేదో కార్యక్రమం అయ్యాక, అఘోరించొచ్చు కదా.నాలుగు గోడల మధ్య మీరు ఎలా ఏడిస్తే ఎవరు చూడొచ్చారు గనుక. 


ముఖం ఉబ్బిపోయి, మాట తడబడుతూ, ఎబ్బెట్టుగా కనిపించే బాడీ లాంగ్వేజ్ తో మనోడు స్టేజి మీద దిష్టిబొమ్మలా తయారైయాడు.  తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే, నోరుమూసుకుని కూర్చున్నట్లయితే "ఆయన అంతే, మితభాషి" అని నిర్వాహకులు సరిపెట్టుకునేవాళ్ళేమో. సమయం, సందర్భం లేని వ్యాఖ్యానాలతో పాపం పిల్లలను హడలగొట్టి పారేశాడు. ఈ వికారం అక్కడితో ఆగలేదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారిని వెటకారం చెయ్యడం మొదలెట్టాడు.


కేవలం, తెలుగు భాష కు మాత్రమే సొంతమైన అవధాన ప్రక్రియ లో, అందులోనూ ఉన్నకొద్ది మంది ప్రముఖుల్లో గరికపాటి వారు విశిష్ట స్థానాన్నిసుస్థిరం చేసుకున్న ప్రజ్ఘ్నావంతులు. ఆయనను, ఆయన విద్వత్తును వెటకారం చేసే స్థాయి, ఎవరో రాసి పెట్టిన డైలాగ్ లను చెప్పుకుని బతికే కృష్ణ భగవాన్ కు లేదు. "ఆయన ఏదో చెప్పాడు, ఎవరికి అర్థమవుతున్దీ?" అని తనదైన శైలిలో విమర్శలకు దిగాడు. గరికపాటి వారి పాండిత్యం అర్థం కావాలంటే ఒక స్థాయి ఉండాలి, కనీసం ఆస్వాదించే హృదయమైనా ఉండాలి. వాక్చాతుర్యానికీ, వాగడానికీ మధ్య అంతరం తెలియని కృష్ణ భగవాన్ కు అర్థం కాకపోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. 

సినిమా నటుల్లో హుందాగా ప్రవర్తించేవాళ్ళు  చాలా మందే ఉన్నారు, కనీసం పబ్లిక్ లోనైనా. ముఖ్య అతిధిగా వెళ్ళే సభకు తాగి వెళ్ళాలనే దిక్కుమాలిన ఆలోచన వచ్చినందుకు కృష్ణ భగవాన్ ను అభినందించాల్సిందే. అసలే, సినిమా వాళ్ళంటే జనాలకున్న చులకన భావం ఇలాంటి వ్యక్తుల చర్యల మూలంగా ఇంకా బలపడతాయి. సినిమా వాళ్ళు ఆడవాళ్ళైతే సెక్స్ రాకేట్లలోనూ, మగవాళ్ళు డ్రగ్స్ రాకేట్లలోనూ, కొంతమంది, భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఇప్పటికే పరువు పోగొట్టుకుంటున్నారు (అందరూ కాకపోయినా). ఇంకా ఇలాంటి చిల్లర చేష్టలు చేసి ప్రజల్లో పలుచన కాకండి. 


అకారణంగా, గరికపాటి నరసింహారావు గారి పట్ల అవాకులు చెవాకులు పేలిన కృష్ణ భగవాన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని సాహితీ అభిమానులందరి తరుపునా ఈ బ్లాగ్ ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ, క్షమాపణ చెబితే, "ఏదో తాగిన మత్తులో వాగినా, కృష్ణ భగవాన్ చేసిన తప్పుకు పశ్చాత్తాపం వెలిబుచ్చాడు, సంస్కారవంతుడే!" అని అనుకుంటాం. చెప్పకపోతే, "గరికపాటి వారి వంటి గజరాజు వెళుతూ ఉంటే, కృష్ణ భగవాన్ లాంటి గ్రామ సింహాలు మొరగడం సహజమే" అని సర్ది చెప్పుకుంటాం.  ఏ కోవలోకి చెందాలనుకుంటున్నారో మీ ఇష్టం. 


~ శశిధర్ సంగరాజు.

Thursday, December 16, 2010

దస్తగిరి పార్ట్ 3 : బ్లాక్ బోర్డ్

నేను దస్తగిరి పార్ట్ I , పార్ట్ II  రాసిన తర్వాత, మిత్రులనుంచి అందిన ప్రోత్సాహం, అభినందనలు మరువలేనివి.  9  వతరగతిలో జరిగిన మరో చిన్న జ్జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను. చదవండి మరి. 
****************************
9 వ తరగతిలో ఉన్నప్పుడు, మేము మహా సరదాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అంశం, బ్లాక్ బోర్డుకు ఆకు పూయడం. అదెలాగంటే, మా మునిసిపల్ హైస్కూల్ 1857 లో స్థాపించారు. బ్రిటిష్ కాలం లో కట్టిన బిల్డింగ్ అవ్వడం మూలాన తరగతి గదులు విశాలంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఉండేవి. మా క్లాసు లోకి ఎంటర్ అవ్వగానే, తలుపుకు ఎదురుగా, ఎత్తైన అరుగు (ప్లాట్ ఫాం) ,దానిపైన, టీచర్ కూర్చోడానికి ఒక చైర్, చైర్ కు ఎదురుగా ఒక టేబుల్ ఉండేవి. సరిగ్గా, టీచర్ కూర్చునే చైర్ కు వెనకాల బ్లాక్ బోర్డు ఉండేది. ప్లాట్ ఫాం కు ఎదురుగా, గదికి అటువైపున రెండు పెద్ద, పెద్ద కిటికీలు ఉండేవి. కిటికీల వల్ల మా కొచ్చిన నష్టం ఏమీ లేదుకానీ, కిటికీ లోంచి వచ్చే సూర్యరశ్మి, బోర్డు మీద పడి, పరావర్తనం చెంది, బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించేవి కావు. బోర్డు కూడా బాగా వాడడం వల్ల, నునుపుగా తయారై, దాదాపు, సగం బోర్డు మీద ఏమి రాస్తున్నారో కింద కూర్చున్న వాళ్లకు కనిపించేది కాదు.


నోట్స్ లు రాసుకోవడానికి బద్దకించేవాళ్ళు మాత్రం ఒకటి, రెండు సార్లు గట్టిగా "అక్షరాలు కనిపించడం లేదు సార్" అనేసి, తర్వాత నోట్స్ లు బ్యాగ్ లలో సర్దేసి కబుర్లు చెప్పుకునేవారు. ముందువరస లో కూర్చునే మాకు మాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. మా లెక్కల సార్, మా పుస్తకాల్లోకి తొంగి చూసి మరీ "రాసుకున్నారా?" అని రెట్టించి అడిగేవారు. కొంతమంది, బోర్డు మీద రాసింది సరిగ్గా కనపడక, నోట్స్ లు చేతిలో పట్టుకుని క్లాసు మొత్తం అటూ, ఇటూ తిరుగుతూ రాసుకునే వాళ్ళు. 


మా తిప్పలు గమనించిన మా లెక్కల సార్, "మీకు, SUPW కానీ, వీవింగ్ కానీ ఉన్నప్పుడు, కొంచెం బోర్డు కు ఆకు పుయ్యండ్రా, అక్షరాలు సరిగ్గా కనపడతాయి." అనే వారు. SUPW సెక్షన్ లో మాకు ఎప్పుడూ, ఏమీ చెప్పిన పాపాన పోలేదు. నోట్ పుస్తకాల్లో, పిచ్చి బొమ్మలు వేసుకోవడమో, సినిమా కథలు చెప్పుకోవడమో చేసేవాళ్ళం.అసలు, ఏమి నేర్పించే ఉద్దేశ్యం తో ఆ సెక్షన్ పెట్టారో, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు. వీవింగ్ క్లాసులు మాత్రం, మెయిన్ బిల్డింగ్ కు పక్కన ఉన్న ఇంకో చిన్న బిల్డింగ్ లో జరిగేవి. జరగడం అంటే, వీవింగ్ సార్ మమ్మల్ని వరండాలో కూర్చోపెట్టేవారు. లోపల గదిలో మగ్గాలు, వాటికి వేలాడుతూ రకరకాల దారాలు ఉండేవి. ఎందుకో తెలియదు కానీ, ఆ రూం కు తాళం కూడా ఉండేది. మమ్మల్ని ఒక్కరోజు కూడా మగ్గం ముట్టుకోనిచ్చేవాళ్ళు కాదు. మేము బయట వరండాలో కూర్చుని,  లోపల ఉన్న మగ్గాల్ని, బోనులో ఉన్న జంతువుల్ని చూసినట్లు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ రెండు క్లాస్సుల్లో మేము నేర్చుకుని ఉద్ధరించేది ఏమీ లేదు కాబట్టి, బోర్డు కు ఆకు పూసే కార్యక్రమం అప్పగించారు, మా లెక్కల సార్. 


బోర్డు కు ఆకు పూయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, బోర్డు ను నల్లగా, గరుకుగా తయారు చెయ్యడం. దీనికి కావాల్సిన ముడి పదార్థాలు - సుంకేసుల చెట్ల ఆకులు (ఏ చెట్టు ఆకు అయినా సరిపోతుందేమో, ఆ చెట్లు మా స్కూల్ కాంపౌండ్ లో ఉండడం వల్ల, ఆ ఆకులు వాడేవాళ్ళం.), బొగ్గులు. దస్తగిరి, దాదాపు తొమ్మిదో తరగతి మధ్యలో మా క్లాసు కు వచ్చాడు. అంతవరకూ, మేము బోర్డులో మూడొంతులు మాత్రమే నలుపు చెయ్యగలిగే వాళ్ళం. అందరికీ, చేతులు అంతవరకే అందేవి. దస్తగిరి పొడవు కాబట్టి మాకు ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇక రెండో సమస్య బొగ్గులు. 

ఈ కార్యక్రమానికి బొగ్గులు చాలానే కావలసి వచ్చేవి. బోర్డు కు నలుపు రంగు వచ్చేది బొగ్గుల వాడకం వల్లనే. ఆకు, కేవలం గరుకుదనానికి వాడేవాళ్ళం. స్కూల్ బయట మొక్కజొన్న పొత్తుల బండ్ల దగ్గర కొన్ని బొగ్గులు సంపాదించినా, ఇంకా కావాల్సి వచ్చేవి. దీనికీ, దస్తగిరి ఒక ఉపాయం చెప్పాడు. మా స్కూల్ వెనకవైపున (స్టేడియం దగ్గర) ఒక లాండ్రీ షాప్ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుదామని.అలాగే, కొంతమందిమి వెళ్లి అడిగాము కూడా. స్కూల్ పిల్లలు అడిగేసరికి వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేవాళ్ళు. 


సుంకేసుల చెట్లు మా స్కూల్ లోనే ఉండడం వల్ల వాటికేమి ఇబ్బంది లేదు. ఆ చెట్టు ఆకులు పలుచగా, చిన్నగా ఉండేవి. చెట్టుకు కాసే కాయలు (అవును, కాయలే) మాత్రం లోపల గింజలతో  మోచేతి పొడవు, రెండు, మూడు వేళ్ళ వెడల్పు ఉండేవి. ఎండి రాలిపోయిన కాయలు, అటూ, ఇటూ కదిపితే, ఎండిన గింజల వల్ల గల, గలా శభ్దం వచ్చేది. ఎన్టీఆర్, కాంతారావు జానపద సినిమాలు చూసిన ప్రభావంతో   ఇంటర్వల్ లో, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఈ కాయలతో మేము కత్తియుద్ధం చేసేవాళ్ళం. ఎవరి చేతిలోని కాయ విరిగిపోతే, వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క.


బోర్డు కు ఆకు పుయ్యాలంటే, కనీసం నలుగురైదుగురు కావాల్సి వచ్చేది. ఇది నాజూకుగా చేసే పని కాకపోవడం, పని పూర్తైన తర్వాత అందరి చేతులు నల్లగా, అసహ్యం గా తయారవడంతో ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అందరిని కూడగట్టే పని దస్తగిరికి అప్పగించేవాన్ని. ఏం మంత్రం వేసేవాడో కానీ, నేను పిలిస్తే మొహమాటానికైనా వస్తామని అనని వాళ్ళు, కనీసం ఇంకో నలుగురైనా వచ్చేవాళ్ళు. తర్వాత తెలిసింది, మర్యాదగా ఒప్పుకోని వాళ్ళను, దస్తగిరి బెదిరించేవాడట. "వచ్చి బోర్డుకు ఆకు పూస్తారా? లేకపోతే మీ సైకిల్ టైర్ లలో గాలి తీసేసి, వాల్ట్యూబ్ లు తీసుకెళ్ళాలా? అని". టైర్లలో గాలి పోతే, పదిపైసలిస్తే గాలికొడతారు కానీ, వాల్ట్యూబ్ పోతే మాత్రం అర్ధరూపాయి దాకా ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ హింస భరించలేక చచ్చినట్లు ఒప్పుకునేవాళ్ళు. 


బొగ్గులు, సుంకేసుల ఆకులు కలిపి ముద్దగా నూరి, ఆ ముద్దను, బోర్డు కు పూసే వాళ్ళం. మరుసటిరోజు ఉదయం స్కూల్ కు వచ్చేసరికి నిగ,నిగలాడుతూ బ్లాక్ బోర్డు రెడీ. నోట్స్ రాసుకోకుండా తిరిగే వాళ్లకు మాత్రం, తప్పించుకునేందుకు మరో సాకు దొరికేది కాదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం మాకు భలే సరదాగా ఉండేది. 


ఈమధ్యన మా ఆఫీసు లో మీటింగ్ లు, ప్రెజంటేషన్లు బాగా ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఆఫీసుల్లో వాడే వైట్ బోర్డులు, ప్రొజెక్టర్ లు, వాటి హడావిడి చూసినప్పుడు, మేము బ్లాకుబోర్డును నలుపు చెయ్యడానికి పడ్డ కష్టాలు గుర్తుకొస్తుంటాయి.





జూలై లో ఇండియాకు వెళ్ళినప్పుడు, మా స్కూల్ బోర్డు ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేర్చారట. కానీ, మా క్లాసురూంలన్నీ పడగొట్టి, కొత్త బిల్డింగ్లు కట్టించారు. పాత జ్జ్ఞాపకంగా   మిగిలింది ఈ బోర్డు ఒక్కటే.

~శశిధర్ సంగరాజు.

Sunday, December 12, 2010

నాగబాబు ఆవేదన - నిజమేనా?

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, సినీ రంగంలో నిర్మాతలకు విలువ లేదనీ, సినిమా నిర్మాణం లో తమ మాట చెల్లడం లేదనీ, అందరూ కలసి నిర్మాతను నాశనం చేస్తున్నారనీ ఆక్రోశం వెలిబుచ్చారు. కానీ, కొంచెం లోతుగా ఆలోచిస్తే, నాగాబాబుది నిజమైన ఆవేదనా?లేక మనసులో ఏదో పెట్టుకుని వెళ్ళగక్కిన కడుపు మంటా అన్న అనుమానం కలుగుతోంది. 

పెద్ద నిర్మాతలమైన తమ పరిస్థితే ఇలా ఉంటే, చిన్న నిర్మాతల గతి ఏమిటని ఆయన వాక్రుచ్చారు. కాకపోతే, ఒకటి ఆయన ఈమధ్యన తీసిన "ఆరంజ్" అనే కళాఖండం బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డం, తద్వారా కోట్ల రూపాయలు నష్టం రావడంతో, ఆ బాధ తట్టుకోలేక, ఇలా చిన్న నిర్మాతల సంక్షేమం అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారనేది నిర్వివాదాంశం.  

రాష్ట్రం లోని మెజారిటీ థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని, చిన్న సినిమాలను కనీసం విడుదల చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, చిన్న నిర్మాతల ఉసురు పోసుకుంటున్నది  ఈయన లాంటి పెద్దచేపలే అన్న విషయం మరచిపోయి ఎవరిమీదో అభాండాలు వెయ్యడం ఎంతవరకు సబబు?

నాగబాబు ఒక టివి ఛానల్ చర్చాకార్యక్రమం లో పాల్గొన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదంటూనే, టెక్నీషియన్ల వల్లనే సినిమా నిర్మాణం ఆలస్యం అవుతోందని, బడ్జెట్ అదుపు తప్పి పోతోందనీ చెప్పారు. అసలు క్రేజీ కాంబినేషన్ కోసం పాకులాడి (ఆంటే, ఎలక హీరో, పిలక హీరోయిన్, తోక డైరెక్టర్ ) అవసరం ఉన్నా, లేకున్నా కోట్లు కుమ్మరించి నిర్మాణ వ్యయం పెంచుకునేది వీళ్ళే. ఆ కార్యక్రమ చూసాక, "ఆరంజ్" సినిమా చూసాను. అంతవరకూ చూసే సాహసం చెయ్యలేదు. సినిమా చూసాక అనిపించింది, ఇది మామూలు మనుషులకు ఎక్కే సినిమా కాదని. ఇంతోటి సినిమా ఇందిరా పార్క్ లో తీసినా సరిపొయ్యేది. ఆస్ట్రేలియా కు వెళ్ళడం ఎందుకు? 


ఈ సినిమా అనేకాదు, విదేశాల్లో సినిమా షూటింగ్ చెయ్యడం ఒక అంటురోగంలా తయారైంది. కథకు సంబంధం ఉంటే అదో విషయం.హీరోయిన్ ముగ్గుపిండి, హీరో తాటిముంజెలు అమ్ముకుంటుంటారు. వీళ్ళిద్దరి డ్రీంసాంగ్ ఆల్ఫ్ పర్వతాల్లోనో, నయాగరా జలపాతం పక్కనో చిత్రీకరిస్తారు. పైగా జిగేల్మనే డ్రెస్సులు (ఇవి కేవలం హీరో కాస్ట్యుం లు మాత్రమే, హీరోయిన్ కు ఎప్పుడూ గుడ్డ పేలికలే, అదృష్టం బాగుండి, వీళ్ళ షూటింగ్ లు జరిగే ప్రదేశంలో కాస్త చలి ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని గుడ్డ పేలికలు చుట్టబెడతారు అంతే). కలలు గొప్పగా ఉండొచ్చు, తప్పు లేదు కానీ, మరి అన్ని కోట్లు ఖర్చు చేసి రిచ్ గా తియ్యాలనుకున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. కేవలం డైరెక్టర్ ను విమర్శించడం మంచిది కాదు. కథ అద్భుతం గా ఉంటే, విదేశాల్లో చిత్రీకరించే పాటలు అదనపు ఆకర్షణ అవుతాయి కానీ, అసలు కథ లో పట్టులేకపోతే ఆస్ట్రేలియా లో తీసినా, ఆముదాలవలస లో తీసినా ఒకటే.


అదే, "ఆరంజ్" ఘనవిజయం సాదించి ఉంటే అప్పుడు కూడా నిర్మాణ వ్యయం పెరిగిందనీ, ఆలస్యం చేసారనీ, అనేవాళ్ళా? మెగా పవర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయం అని విజయోత్సవాలు నిర్వహించే వాళ్ళేగా?మగధీర కూడా కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా.విజయం కూడా అదే స్థాయిలో దక్కింది కదా?


చిత్ర నిర్మాణం,  నిర్మాతగా మీకు నిజంగా సంత్రుప్తినివ్వకపోతే, ఆ డైరెక్టర్ ను మార్చడమో, అనవసరమైన ఖర్చును అదుపు చెయ్యడమో ఎంత పని?ఏమో, ఆడుతుందేమో అన్న ఆశ. ఫలితం మాడు పగిలేలా ఉంటే మాత్రం ఓర్చుకోలేరు.

మీరూ గాంబ్లింగ్ ఆడుతున్నారు, దానికి నిర్మాతలను బతకనివ్వడం లేదని మీడియా ముందు గొంతు చించుకోవడం దేనికి?

~శశిధర్ సంగరాజు. 

Friday, December 3, 2010

" ధర్నాంధ్ర" ప్రదేశ్

టైటిల్ చూసి కంగారు పడకండి, దేవుడి దయవల్ల ఆంధ్ర ప్రదేశ్ ఇంకా పేరు మార్చుకోలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు. 

అవును, ప్రస్తుతం రాష్ట్రం లో పలు సంఘాలు/గ్రూపులు/రాజకీయ పక్షాలు/జేఏసి లు కలసి గానీ, విడివిడిగా కానీ  ధర్నాలకు పిలుపునిచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ధర్నాలు దాదాపు 17 దాకా ఉన్నాయి. వాళ్ళు , వీళ్ళు అని తేడా లేకుండా, దాదాపు అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదే ఉన్నారు. అప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి (ప్రతిపక్షాల భాషలో మూడో కృష్ణుడు)ఉద్యోగసంఘాలను బతిమాలో, బామాలో కొంత (ఆంటే 15 రోజులు ) గడువు   పొందారు. కొత్త ప్రభుత్వం కాబట్టి సర్దుకోడానికి కాస్త టైం ఇస్తామనీ, తర్వాత కూడా డిమాండ్లు తీర్చక పొతే, మళ్లీ ధర్నాలు మొదలెట్టి ఇంకా ఉధృతం చేస్తామనీ ఉద్యోగ సంఘాలు ఆల్టిమేటం ఇచ్చాయి. 

సరే, ప్రజాస్వామ్యంలో తమ నిరసనలు తెలియ చేయడానికి ధర్నా చెయ్యడం ఒక విధానం. ఒప్పుకుంటాం. కానీ, ఈ మధ్య ధర్నాలు కొన్ని సందర్భాల్లో మరింత చికాకు కలిగిస్తున్నాయి. ధర్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నా, ఎవరికి చెప్పుకోవాలో తెలియని వర్గం ఒకటుంది. వాళ్ళే , స్కూల్ పిల్లలు.  

ఈ మధ్య టీవీ లో చూసాను.కొన్ని విద్యార్ధి సంఘాలు ధర్నాల పేరిట స్కూల్లకు వెళ్లి పిల్లలను క్లాసు లు బహిష్కరించమని ఇబ్బంది పెడుతున్నాయట. ఆ టీవీ వాళ్ళు, పిల్లల ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం చేసారు. ఆ పిల్లల తిప్పలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. 

ఒక అబ్బాయైతే, ఈ సంవత్సరం తనది పదో తరగతి అనీ, ఈ ధర్నాల మూలంగా క్లాసు లు సరిగ్గా జరగడం లేదనీ, ఇలాగైతే పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదనీ వాపోయాడు. ఇంకో అమ్మాయిది మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులట. ఉదయం పిల్లలను స్కూల్ల కు  పంపి వాళ్ళు ఇంటికి తాళం వేసేసి తమ ఉద్యోగ నిమిత్తం  బయటకు వెళ్లి పోతారట. మళ్లీ తిరిగిరావడం, పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి.ధర్నాల మూలంగా, స్కూల్ అర్ధాంతరంగా అయిపోవడంతో, ఇంటికి తిరిగి వెళ్ళే తాము ఒంటరిగా ఉండాల్సి వస్తోందనీ  తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నామనీ చెప్పింది. మహానగరాల్లో తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు వెంటనే పనులు మానుకుని ఇంటికి రావడం కూడా సాధ్యం అయ్యే పని కాదు. చాలామంది విద్యార్థులు, ఈ ధర్నాల మూలంగా విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది.


మా బంధువులబ్బాయి హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ విద్యా సంస్థలో చదువుతున్నాడు. అన్నివిద్యా సంస్థలలో ఉన్నట్లే, వాళ్ళ కాలేజ్ లో కూడా ఎక్కువగా యూనిట్ టెస్ట్ లు వగైరా జరుపుతుంటారు. కానీ, ఈ సారి మాత్రం, డిసెంబర్ 6  (బ్లాక్ ఫ్రైడే ) న  , డిసెంబర్ 31  (తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటి ప్రకటన) తర్వాత  జరిగే ఆందోళనల్లో క్లాసులు  ఎలాగూ జరగనివ్వరు కాబట్టి, ప్రస్తుతానికి టెస్ట్ లు పక్కన పెట్టి, హడావిడిగా సిలబస్ పూర్తి చెయ్యడం పై దృష్టి పెట్టారట. 

ధర్నాలు, రాస్తారోకోలవల్ల సామాన్య ప్రజానీకం ఎలాగూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం, స్కూల్ పిల్లలనైనా మినహాయించాలని నా అభిప్రాయం. 

మీరేమంటారు.

~ శశిధర్ సంగరాజు.

Sunday, November 28, 2010

కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చకండి...ప్లీజ్.

నా బ్లాగ్ లో ఒక పోల్ నిర్వహించాను. "కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం సమంజసమేనా?" అన్నది ప్రశ్న. పోల్ కు నేను పెట్టుకున్న గడువు దాదాపు 30 రోజులు. ఈ నెల రోజులుగా నా బ్లాగ్ ను సందర్శించిన మిత్రులు కొందరు ఆ పోల్ లో తమ ఓటు వేశారు. ఈ రోజు తో పోల్ గడవు ముగిసింది. ఫలితాలు మీ అందరితో పంచుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను. 
నా ప్రశ్నకు :

        కాదు:    42 ( 89 %) 
        అవును:   4  (8 %)
        చెప్పలేం :  1  ( 2  %) 


ఓట్లు వచ్చాయి. నా బ్లాగ్ కు ఉన్న రీడర్ షిప్ ఎంతో, ఇలాంటి పోల్ ఇక్కడ నిర్వహించడం వల్ల, నేను సాధించే ఫలితం ఏమిటో , నాకు స్పష్టం గా తెలుసు. ఈ పోల్ చూడగానే ఏదో అద్భుతం జరుగుతుందనే అపోహ కూడా నాకు లేదు. కానీ, తమ లాభాల కోసం, ఎంతో చరిత్ర ఉన్న ఒక జిల్లా పేరును, బలప్రయోగం తో  ఒక వ్యక్తి పేరుకు మార్చడం ఎంత వరకూ సబబు అన్నది నా ప్రశ్న.


కడప వాసిగా ,దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అంటే, నాకు వ్యక్తిగత వైరం గానీ, అయిష్టం గానీ ఏమీ లేవు కూడా.ముఖ్య మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన కొన్ని పథకాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగి ఉండొచ్చు. కాదనలేని వాస్తవం. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి ఉండొచ్చు.శుభం.ఆయన ఆకస్మిక దుర్మరణం.. అత్యంత విషాదకరం. కానీ, ఆయన హయాం లో జరిగిన అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. 

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును కూడా నెల్లూరు జిల్లా పేరుకు ముందు తగిలించారు కానీ, నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా చెరిపెయ్యలేదు. కేవలం కడప విషయం లోనే ఈ తొందరపాటు కనపడుతోంది.  మీడియా లో కూడా, కేవలం, రాజశేఖర్ రెడ్డి మానస పు(ప)త్రిక "సాక్షి" మాత్రమే కడప పేరు మార్చి వైఎస్ఆర్ అని జిల్లాల లిస్టులో రాస్తోంది. మిగతా పేపర్లు ఇంకా కడప అనే వాడుతున్నాయి.


ముఖ్యమంత్రి గా ఉన్న ఐదు సంవత్సరాల పైచిలుకు మాత్రమే, రాజశేఖర్ రెడ్డి శాంతంగా, ప్రజల మనిషిగా మెలిగారు గానీ, అంతకు ముందు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా అసమ్మతిమయమే.రాజశేఖర్ రెడ్డి ఆయన అభిమానులకు గొప్ప నాయకుడు అయితే అవ్వచ్చు గాక.
కలియుగ వైకుంఠం తిరుపతికి, గడప గా పేరు పొంది, బమ్మెర పోతన, వేమన, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు వంటి మహోన్నత వ్యక్తులు జన్మించి/జీవించిన కడప పేరును, పూర్తిగా మార్చేసి ఆయన పేరు మీద పిలవాలనేంత గొప్ప వ్యక్తి అయితే మాత్రం కాదు అన్నది నా అభిప్రాయం.

అయితే, ఆయనలో ఒక్క సుగుణం ఉంది. తనను కలవడానికి వచ్చే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళయినా, వారిని ఆప్యాయం గా పలకరించడం.వారి యోగక్షేమాలు విచారించడం. తన చిరునవ్వుతో, ఎదుటి వాళ్లకు నేనున్నాని భరోసా ఇవ్వడం. ఇలాంటి మానవీయ కోణం ఉన్న రాజకీయనాయకున్ని నా జీవితం లో ఇంతవరకు చూడలేదు.  అదే, మన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని చూడండి. ఆయన మొహం లో నవ్వు, తుమ్మల్లో  పొద్దు గ్రున్కినట్లు ఉంటుంది. నవ్వితే ఎక్కడ టాక్స్ కట్టాల్సి వస్తుందోనని భయమో ఏమిటో.

ప్రస్తుతం రాష్ట్రం లో అతి వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కడప పేరు మార్చరనే అనుకుంటాను. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యం లో,ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు జిల్లా పేరు మార్చాలని ఎగబడ్డ వాళ్ళంతా ఇప్పుడు పదవుల కోసం వెంపరలాడుతున్నారు. ఈ నాయకులకు కావాల్సిన పదవులు దక్కితే, జిల్లా పేరు మార్పిడి తర్వాత, తమ ఇంటి పేర్లు కూడా మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లున్నారు. 


చూద్దాం ...ఏమవుతుందో. 


~శశిధర్ సంగరాజు.

Thursday, November 25, 2010

దస్తగిరి - పార్ట్ 2 కువైట్ పెన్ను

దస్తగిరి తో నేను పడ్డ తిప్పలు పార్ట్ 1 లో చదివారు కదా...చిన్న, చిన్న సంఘటనలు మామూలే అయినా...నా వల్ల జరిగిన ఒక పొరపాటు, నాకు ప్రశాంతత అనేది లేకుండా చేసింది. అదేంటో, చదవండి మరి.


పదవ తరగతి మొదలైన కొత్తల్లో కూడా పరిస్థితి మామూలుగానే ఉండేది. ఆరు నెలల పరీక్షలు అయిపోయినప్పటి నుంచి  టెన్షన్ మొదలైంది. పలకరించిన ప్రతివాళ్ళు, "ఈ సారి పదోతరగతి..ఇంతకముందులా కాదు..పబ్లిక్ ...బ్రహ్మాండం గా చదవాలి..మంచి మార్కులు రావాలి " అని ఊదరగొట్టడం మొదలెట్టారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన, ఒక అడుగు ముందుకేసి "నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి " అని దీవించేసాడు. "ఏం ఈ సంవత్సరం మీరు గాని పేపర్లు దిద్దుతారా" అని అడగబోయి మాట మింగేసాను. ఇంట్లో తెలిస్తే తంతారని.  


ప్రతి గురువారం దూరదర్శన్ లో "చిత్రలహరి" అనే సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. వాణిజ్యప్రకటనలు పోను, ఆ కార్యక్రమం వచ్చేది 15 నిమిషాలు.అది కూడా, చూడనిచ్చేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చే వాళ్ళు కూడా, సరిగ్గా ఆ టైం కు రావడం, " "చిత్రలహరి" జీవితం లో ఎప్పుడైనా చూడొచ్చు నాయనా..ఈ సారి పదోతరగతి .." అంటూ మళ్లీ  రికార్డు మొదలెట్టడం.


ఈ గొడవలో కూడా, దస్తగిరి "డోన్ట్ కేర్" పద్దతిలో ఏ మార్పు లేదు. ఇక్కడ దస్తగిరి కి ఉన్న ఒక సుగుణం గురించి చెప్పుకోవాలి. కర్ణుడు (అవును, మహాభారతం లో ఉండే ఆయనే) అడిగిన వాళ్లకు మాత్రమే దానం చేస్తాడేమో, దస్తగిరి మాత్రం నోరు తెరచి అడక్కపోయినా, మన మనస్సు కనిపెట్టి మరీ దానాలు చేస్తాడు. చిక్కల్లా,మాట తేడా వస్తే, "నేను ఇచ్చింది తిరిగి ఇచ్చై"  అని హింసిస్తాడు . ఈ విచిత్ర వికారానికి  నేను బలైపోయాను. 

ఒక రోజు, స్కూల్ లో దస్తగిరి జేబులో ఒక కొత్త పెన్ను చూసాను. అది ఇంకు పెన్ను. పెన్ను కింది భాగం ముదురు ఆకు పచ్చ రంగులో ఉంది. లోపల ఇంకు లెవెల్ కనపడడానికి అటూ, ఇటూ సన్నటి విండోలు. బంగారు రంగు కేప్. కేప్ చుట్టూ దానిమ్మ రంగులో చెక్కిన లతల డిజైన్. మెరిసిపోతున్న పెన్ను క్లిప్.చూడగానే "పెన్నంటే ఇదిరా" అనిపించే లాగా ఉంది. నా దగ్గర కామెల్ ఇంకు పెన్ను ఉంది . కానీ, నా పెన్నుకు, దస్తగిరి దగ్గరుండే పెన్నుకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మెల్లగా, దస్తగిరిని  అడిగాను , "  కొత్త పెన్ను కొన్నావా"  అని.దస్తగిరి చెప్పిన జవాబు నన్ను ఇంకా ఆశ్చర్యంలో ముంచేసింది. దస్తగిరి వాళ్ళ బంధువులెవరో కువైట్ లో పనిచేస్తారట. (కడప, రాజంపేట ప్రాంతాలనుంచి గల్ఫ్ కు, ముఖ్యంగా   కువైట్ కు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది) వాళ్ళు సెలవల్లో వచ్చినప్పుడు తెచ్చారట. 


కొత్త పెన్ను, అందులో ఫారెన్ పెన్ను. నాకు కుతూహలం ఎక్కువైపోయింది. దస్తగిరిని అడిగాను, "ఈ రోజు పెన్నులు మార్చుకుందామా" అని. దాన కర్ణుడు కదా, వెంటనే ఇచ్చేసాడు. ఆరోజంతా ఆ పెన్నుతోనే నోట్స్ రాసుకున్నాను. ఉత్సాహం ఆపుకోలేక, దస్తగిరి నోట్స్ కూడా నేనే రాసి పెట్టాను. ఆ పెన్ను తో రాస్తుంటే , అక్షరాలు కూడా పొందిగ్గా కుదురుతున్నట్లు నాకు నమ్మకం గా అనిపించింది. సాయంత్రం పెన్ను తిరిగి ఇచ్చేటప్పుడు బాధగా కూడా అనిపించింది. " మళ్లీ రేపు తెస్తావా " అని అడిగితే సరేనన్నాడు. అలా రెండు, మూడు రోజులు జరిగిపోయింది. 


నాలుగో రోజు ఏ కళ నున్నాడో , ఏమో, "ఈ పెన్ను నువ్వే తీసుకో " అన్నాడు. నాకు ఒకవైపు ఆశ్చర్యం, మరో వైపు అనుమానం. "మీ ఇంట్లో ఏమీ అనరా" అని అడిగాను. "ఫర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు మళ్లీ తెమ్మని అడుగుతాన్లే, ఏమీ అనరు" అని చెప్పాడు.దస్తగిరి కి మరీ, మరీ థాంక్స్ చెప్తూ, గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్లాను. ఆరోజు నుంచి "కువైట్ పెన్ను" నా జీవితం లో ఒక భాగమైంది. ఎక్కడి కి వెళ్ళినా ఆ పెన్ను నాతో ఉండాల్సిందే. ఆ కృతజ్ఞతతో దస్తగిరికి అడిగినప్పుడల్లా నోట్స్ రాసి ఇచ్చేవాన్ని. 


కానీ, అన్ని రోజులు మనవి కావనే విషయం త్వరలోనే నిజమైంది. ఆ రోజుల్లో నేను ఎన్.సి.సి. కూడా వెలగబెట్టే వాణ్ని. ఒక రోజు ఎన్.సి.సి. డ్రెస్ మార్చుకుంటుంటే కువైట్ పెన్ను కింద పడడం, నేను చూసుకోకుండా ఎన్.సి.సి. బూటుతో పెన్ను మీద అడుగు పెట్టడం జరిగిపోయింది. ఇంకేముంది, ఇనుప నాడాలు బిగించిన బూట్ బరువుకి పెన్ను చిట్లి పోయింది. నాకు విపరీతమైన దుఃఖం .ఇక కువైట్ పెన్ను ఇంకు కారడం మొదలెట్టింది. ఎన్ని బట్టలు చుట్టినా, ఫలితం లేకుండా పోయింది. దస్తగిరి కి తెలియకుండా, ఇంకో ఫ్రెండ్ ని అడిగా , ఏం చేద్దామని. సన్నటి కొవ్వొత్తి సెగ లో పెన్ను ను ఉంచితే, పగిలిన భాగం అతుక్కుంటుందని సలహా ఇచ్చాడు. ఆ ప్రయోగం దారుణంగా ఫెయిల్ అయ్యింది. అంత వరకు బొచ్చు కుక్క పిల్ల లా అందంగా , ముచ్చటగా ఉండే కువైట్ పెన్ను, గజ్జి కుక్కలా తయారైంది. చేసేదేమీ లేక, విసుగొచ్చి పెన్ను ఎక్కడో పడేసాను. ఎలాగూ, పెన్ను లేదుకదా అని దస్తగిరికి నోట్స్ రాసిపెట్టడం కూడా మానేసాను. 


మరి ఎలా గమనించాడో, ఏమో, ఒక రోజు దస్తగిరి నన్ను అడిగాడు, కువైట్ పెన్ను స్కూల్ కి తీసుకురావడం లేదేమని. నసుగుతూ అసలు విషయం చెప్పేసాను. అప్పటికేమి అనలేదు, నేను కూడా ఆ విషయం మర్చిపోయాను. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఒక రోజు దస్తగిరి ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. " నా కువైట్ పెన్ను నా కిచ్చై" అని. పైగా దానికి మరో క్లాజ్ తోడైంది "ఎట్లిచ్చింది అట్లనే" అని. ( ఆంటే, As It Was అని అర్థం). నాకు గుండెల్లో రాయి పడింది. దస్తగిరికి ఉన్నట్లు , మా బంధువులెవరూ కువైట్ లో లేరు. నా పెన్ను సమస్య తీర్చడానికి , మా ఇంట్లో వాళ్లెవరికీ  కువైట్ కు వెళ్ళే ఉద్దేశ్యం కూడా లేదు. పైగా ఇంట్లో విషయం తెలిస్తే చీవాట్లు తప్పవు. వేరే పెన్ను ఇస్తానంటే దస్తగిరి ఒప్పుకోలేదు. చివరికి తనే పరిష్కారం కూడా చెప్పాడు.


పరీక్షల్లో (హిందీ, లెక్కలు )నేను తనకు ఆన్సర్ లు చూపిస్తే సరిపోతుందని.నేనేదో తనకన్నా మేధావినని కాదు, ఏదో గుడ్డిలో మెల్ల. అంతే.  హిందీ వరకు ఫర్వాలేదు. నేను అప్పటికే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే ప్రవేశిక పరీక్ష పాసయ్యాను. లెక్కలతోనే నాకు తిప్పలు. నాకు మాత్రికలు (Matrix), త్రికోణమితి (Trigonometry) లను చూస్తే, అమావాస్య అర్ధరాత్రి రెండు కొరివి దయ్యాలు జుగల్బంది చేసినట్లుండేది. కాకపొతే, వేరే మార్గం లేక పోవడం తో సంధికి ఒప్పుకోక తప్పలేదు.  ముందు జాగ్రత్తగా, నేను కూడా ఒక మెలిక పెట్టాను. 10 మార్కుల ప్రశ్నలు మాత్రమే సాయం చెయ్యగలననీ, బిట్స్ తనే రాసుకోవాలని. ఇంకో మొండి ధైర్యం కూడా ఏమిటంటే, మా ఇద్దరి నంబర్లు ఒకే దగ్గర వచ్చినప్పుడు చూద్దాం లే అని.దస్తగిరి కూడా ఒప్పుకున్నాడు.


నాకు దురదృష్టం  రామస్వామి రెడ్డి అనే డి.ఈ.ఓ. రూపం లో ఎదురైంది. ఆయనను ఆ సంవత్సరమే కడపకు ట్రాన్స్ఫర్ చేసారు. ఆయన బాగా స్ట్రిక్ట్. ఆయన చేసిన మొదటి పని, స్కూల్ సెంటర్ లు మార్చడం. అప్పటి వరకు ఎవరి పరీక్షల సెంటర్ వాళ్ళ స్కూల్ లోనే.తెలిసిన వాతావరణం, తెలిసిన టీచర్ ల మూలంగా పిల్లలకు కూడా ధైర్యం గా ఉండేది. కాపీలు కూడా విచ్చలవిడిగా జరిగేవి.  మునిసిపల్ హైస్కూల్ సెంటర్ ను, శారదా నిలయం అనే స్కూల్ కు మార్చారు. ప్రతి పరీక్ష కు రూం లు కూడా మార్చడం మొదలెట్టారు. ఈ కొత్త పద్దతి లో  హిందీ, లెక్కలు, సైన్సు పరీక్షలకు నేను, దస్తగిరి ఒకే క్లాసు లో పడ్డాం. హిందీ పరీక్షకు మాత్రం ఒకే క్లాసు అయినా బాగా దూరంగా కూర్చోవలసి వచ్చింది. పెద్ద గా సాయం చెయ్యలేక పోయాను. కానీ, పరీక్ష అయిపోయాక దస్తగిరి మాత్రం ఆనందంగానే ఉన్నాడు . ఎలా రాసావని అడిగాను. "ఏముంది, కొచ్చిన్ పేపర్ లో ఏముందో అదంతా చూసి ఆన్సర్ పేపర్లో రాసేసా" అన్నాడు. నాకు గుండెల్లో రాయి పడింది. పేపర్లు దిద్దే మాస్టార్లు హిందీ విషయం లో మాత్రం కొంచెం చూసీ, చూడనట్లు వెళ్ళేవారు. కాకపోతే, నాకు తెలిసి హిందీ లో ఫెయిల్ ఆయినా వాళ్ళెవరూ లేరు.  అయినా ఏదో అనుమానం. 

ఇక లెక్కల పరీక్షలో మాత్రం దస్తగిరి నంబర్ నాకు ఐమూలగా (ఆంటే, Diagonal అన్నమాట)వచ్చింది. ఇక కొచ్చిన్ పేపర్లు ఇచ్చిన 10 నిమిషాల నుంచి దస్తగిరి గొడవ మొదలైంది "చూపీ" అంటూ. ఏం చూపియ్యనూ, నా బొంద. పేపర్లో అడిగిన  ప్రశ్నలే అర్థం కాక నా పరిస్థితి  గందరగోళం గా ఉంది. ముందు రెండు మార్కుల ప్రశ్నలకు జవాబు రాసి, కొంత కుదుటబడ్డాక, పది మార్కుల ప్రశ్నలు అటెంప్ట్ చెయ్యాలన్నది నా ప్లాన్. దస్తగిరి మాత్రం ముందు పది మార్కుల ప్రశ్నలు ఆన్సర్ చెయ్యమనేవాడు, ఒక పని అయిపోతుందని. తర్వాత రాస్తానని సైగ చేస్తే, వెంటనే దెప్పిపొడవడం " ఏం, సరిగ్గా చదవలేదా" అని. దస్తగిరి గుసగుసల శబ్దానికి ఇన్విజిలేటర్ "ష్..." అంటూ హెచ్చరికలు. నాకు భయంగా ఉండేది ఎక్కడ పేపర్ లాక్కుని బయటకు పంపేస్తారో అని. మొత్తానికి ఆ మూడు గంటలూ కడప ఎండల్లో చెప్పులు లేకుండా నడిచినట్లనిపించింది. నోటికొచ్చిన ఈక్వేషన్లు, ఫార్ములాలతో పేపర్ నింపేసాను. దస్తగిరి, నా పైత్యం కొంత, తన పైత్యం కొంత కలిపి పేపర్లు నింపేసాడు. ఒకటి, రెండు అడిషనల్ పేపర్లు కూడా తీసుకున్నట్లు గుర్తు. బయటకు వచ్చాక "సూపర్ గా రాశాం  కదా! కనీసం 70 మార్కులన్నా వస్తాయి. కదా ?" అని అడిగాడు. నేనొక వెర్రి నవ్వు నవ్వాను. " అవును, ఇద్దరికీ కలిపి 70 మార్కులు వస్తే , పుణ్యం చేసుకున్నట్లే" అని మనసులో అనుకున్నాను. బయటకు ఆంటే మళ్ళీ అదో గొడవ.


మొత్తానికి పరిక్షలైపోయాయి. ఎండా కాలం సెలవల్లో, దస్తగిరి పాలిటెక్నిక్ కోచింగ్ లో చేరాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లాను, సెలవలు గడపడానికి, బావుల్లో ఈత కొట్టడానికి.
రిజల్ట్స్ రావడానికి ఒక వారం రోజుల ముందు మళ్లీ కడపకు వచ్చాను. రిజల్ట్స్ రోజు మా ఇంట్లో అందరూ నా నంబర్ కోసం వెతుకుతుంటే..నేను దస్తగిరి నంబర్ కోసం వెతికాను. అప్పటివరకు కడప లో, పదవ తరగతి ఉత్తీర్ణత 70  శాతానికి ఎప్పుడూ తగ్గేది కాదు. దానికి కారణం, మాస్ కాపీయింగ్. కానీ, ఆ సంవత్సరం, రామస్వామి రెడ్డి గారి పుణ్యమా అని 13 శాతానికి పడిపోయింది. అందులో అమ్మాయిలదే పైచెయ్యి.


నేను స్టేట్ ఫస్ట్ రావాలని ఆశీర్వదించిన మా నాన్నగారి ఫ్రెండ్ కు ఆశాభంగం కలిగిస్తూ నేను సెకండ్ క్లాసు లో పాసయ్యాను. దస్తగిరి కి థర్డ్ క్లాసు వచ్చింది. మామూలుగా అయితే, సెకండ్ క్లాసు వచ్చినందుకు మా ఇంట్లో నన్ను బాదేసేవాళ్ళు. కానీ, 13 పర్సెంట్ పాస్ అవ్వడంతో, పోన్లే, సంవత్సరం వేస్ట్ కాలేదని సంతోషించి, చీవాట్లతో సరిపెట్టారు.  లాంగ్వేజస్, సోషల్ స్టడీస్ లో వచ్చిన మార్కులు నన్ను కాపాడాయి. లెక్కలు, సైన్సు లో బొటాబొటి మార్కులతో గట్టెక్కాను.


మార్క్ షీట్లు తీసుకోడానికి వెళ్ళినప్పుడు దస్తగిరి కలిసాడు. తాను పాలిటెక్నిక్ లో చేరుతున్నట్లు చెప్పాడు. లెక్కల్లో మాత్రం 40 మార్కులు కూడా దాటకపోవడం పై బోల్డు ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఈ మధ్య పేపర్లు సరిగ్గా దిద్దడం లేదనీ, లేకపోతే అన్ని పేపర్లు రాస్తే 40 కూడా దాటక పోతే ఎట్లా? అని విసుక్కున్నాడు. జరిగిందేమిటో నేను దస్తగిరికి వివరించి చెప్పలేదు. అనవసరం కూడా. తర్వాత మా దార్లు వేరైపోయాయి. మళ్లీ కలవలేదు.


అప్పట్నుంచి ఎవరితోనూ పెన్నులు మార్చుకునే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.


~శశిధర్ సంగరాజు.

Saturday, November 20, 2010

దస్తగిరి - పార్ట్ 1 : గురు పూజోత్సవము.

 నేను, కడప మునిసిపల్ హై స్కూల్ (మెయిన్) లో 9 , 10 తరగతులు  చదివే రోజుల్లో దస్తగిరి నా క్లాసుమేటు. దస్తగిరి వ్యవహారం కొంచెం విచిత్రం గా ఉండేది. దేనికీ తొణికే రకం కాదు. ఏం జరిగినా మనల్ని కాదు అన్నట్లు ఉండే దస్తగిరి నాకు త్వరగానే మిత్రుడయ్యాడు.

9  వ తరగతి మొదలైన కొన్ని నెలలకు దస్తగిరి సియస్ ఐ  స్కూల్ నుంచి మా స్కూల్ కు ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. స్కూల్ తెరిచిన రెండు నెలలకు రావడం మూలాన, మిగతా క్లాసు లలో అప్పటికే పూర్తి స్త్రెంగ్థ్ ఉండడం వల్ల, దస్తగిరి ని మా సెక్షన్ కు కేటాయించారు. 9  వ తరగతి లో 4 సెక్షన్లు ఉండేవి. ఎ,బి,సి,డి. ఎ సెక్షన్లో మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఉండేవారు. నాది సి సెక్షన్. 

దస్తగిరి పూర్తి పేరు "దస్తగిరి రెడ్డి". రాయలసీమ లో హిందువుల్లో కూడా "దస్తగిరి రెడ్డి, ఫకీరా రెడ్డి" లాంటి పేర్లు మామూలే. మొక్కుబడి ఉన్నవాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకుంటారు. అప్పటివరకు స్క్వాడ్ లీడర్ (మా స్కూల్ కు ప్రతి సంవత్సరం బిఇడి ట్రైనీ టీచర్ లు వచ్చేవారు. ఈ స్క్వాడ్ లీడర్  ప్రయోగం వాళ్ళదే . లేకపోతే మునిసిపల్  హై స్కూల్ ఆటలకే కానీ, చదువుకు అంత ఫేమస్ కాదు.)గా ఉన్న నాకు, క్లాసు లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. 

స్క్వాడ్ లీడర్ గా నేను ఉద్ధరించింది ఏమీ లేదు. నా స్క్వాడ్ లో ఉన్నవాళ్ళంతా కొంచెం అమాయకులు, నోట్లో నాలుక లేని బాపతు కావడం, వాళ్ళు హోం వర్క్ సరిగ్గా చేయడం, అల్లరి చెయ్యక పోవడం నా ప్రతిభే అని పొరపాటు పడి మా  లెక్కల సార్ నన్ను క్లాసు లీడర్ ను చేసారు. స్క్వాడ్ లీడర్ గా ఎలాగో నెట్టుకొచ్చిన నాకు , క్లాసు లీడర్ పోస్ట్ తల నొప్పి గానే తయారైంది.


అప్పటివరకు అల్లరి చేసే పిల్లల పేర్లు బోర్డు మీద రాయడం, టీచర్ లకు మొర పెట్టుకోవడం మినహా గత్యంతరం లేని నాకు దస్తగిరి తో స్నేహం కలిసొచ్చింది. 9  తరగతికే, దస్తాగిరిది భారీ విగ్రహం. మా అందరికన్నా పొడవు కూడా. కాస్త దుడుకుగా ఉన్న పిల్లలను దస్తగిరి కంట్రోల్ లో పెట్టేవాడు. చూడడానికి దిట్టంగా, ఎవరన్నా లెక్కలేనట్లు ఉండే దస్తగిరి ఆంటే వాళ్లకు భయం.   కొన్ని కొన్ని విషయాల్లో దస్తగిరి నాకు సలహాలు కూడా ఇచ్చేవాడు. ఆ సలహాల వల్ల కొన్ని సార్లు లాభాలు, మరి కొన్ని సార్లు నష్టాలు. కానీ, ఒక సారి దస్తగిరి ఇచ్చిన సలహా, నా మెడకు అనకొండ లా చుట్టుకుంది.


అదేమిటంటే, ప్రతి సంవత్సరం స్కూల్ లో గురుపూజోత్సవం (టీచర్స్ డే - సెప్టెంబర్ 5 న)బాగానే జరుపుకుంటారు. అన్ని సెక్షన్ల మధ్య ఒక అప్రకటిత పోటి  ఉండేది. ఎవరు బాగా టీచర్స్ డే జరిపారనే విషయం మీద. 'ఏ' సెక్షన్ తో మాకు ఎప్పుడూ పోటి ఉండేది కాదు. కారణం, ఆ సెక్షన్లో అమ్మాయిలు ఉండడం. వాళ్ళ క్లాసు ను వాళ్ళు బాగా అలంకరించడమే కాకుండా, ముగ్గులు, రంగవల్లులు వేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవారు.ఇక మా పోటి  బి,డి సెక్షన్ లతోనే. 


ఈ సంవత్సరం మనం గురుపూజోత్సవం ఎలా జరపాలన్న విషయం మీద చర్చలు మొదలైయ్యాయి. అందరి దగ్గరనుంచి డబ్బులు  వసూలు చేసే భాద్యత నేను తీసుకున్నాను.  తెలుగు సార్ ని పిలుద్దామని అనుకున్నాం. ఆయన కూడా వస్తానని చెప్పారు. 


క్లాసు మొత్తం రంగు కాగితాలతో అలంకరించడం, గురువు గారికి పూల దండ, ఆపిల్ పండ్లు సమర్పించడం వరకు అందరూ ఒప్పుకున్నారు. కానీ, మిగతా క్లాసులకన్నా మనం గొప్పగా చెయ్యడం ఎలా అన్న దగ్గర ఎవరికీ ఏమి తోచడం లేదు. ఇంతలో, దస్తగిరికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పైన్నించి పూలు కురిపించాలని.  అదెలాగో కూడా దస్తగిరి చెప్పాడు. బెలూన్లలో పూలు నింపి, వాటిని పేల్చడం ద్వారా పూలు కురిపించొచ్చని . గత సంవత్సరం వాళ్ళ పాత స్కూల్ లో అలాగే చేసారట.ఇంకేం, ఆ భాద్యత తను తీసుకున్నాడు. 


సెప్టెంబర్ 5  రానే వచ్చింది. వసూలు చేసిన డబ్బులు ఆపిల్ పండ్లకు, రంగు కాగితాలకు, విడి పూలకు సరిగ్గా సరిపోయింది. ఇంకా బెలూన్లకు డబ్బులు అడిగితే, గురుపూజోత్సవం సంగతి దేవుడెరుగు, నాకు పూజ ఖాయం. అందుకని ఆ తిప్పలేవో దస్తాగిరినే పడమన్నాను. మా క్లాసు లోనే సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. "నేను, సురేష్ తెస్తాం లే" అని దస్తగిరి హామీ ఇచ్చాడు. నన్ను మాత్రం అగరుబత్తీలు తెమ్మని చెప్పాడు. బెలూన్లు పేల్చడానికీ, సార్ కుర్చీ ఎదురుగా ఉండే, టేబుల్ మీద పెట్టడానికీ. 


ముందు రోజు క్లాసు మొత్తం శుభ్రంగా చిమ్మి, రంగు కాగితాలతో అలంకరించడం వల్ల క్లాసు కు కూడా కొత్త కళ వచ్చింది. దస్తగిరి, సురేష్ బెలూన్లు, అందులో వేయడానికి బంతి పూలు తెచ్చారు. ఎరుపు, పసుపు రంగుల బంతి పూలు ముచ్చటగా ఉన్నాయి. పూల రేకులను జాగ్రత్తగా తుంచి బెలూన్లను నింపారు. మొత్తం మూడు బెలూన్లు తయారయ్యాయి. వాటిని టీచర్ కూర్చునే కుర్చీ పైన, రంగు కాగితాలు కట్టిన తాళ్ళకు ముడి వేసారు. అంతా సిద్దం అయ్యింది, నేను స్టాఫ్ రూం కు వెళ్ళాను గురువు గారిని పిలుచుకు రావడానికి. ఆయన పేరు సుబ్రమణ్య శర్మ. తెలుగు చాలా బాగా చెప్తారు.ముఖ్యంగా "విదురుని విందు" అనే పాటం ఆయన చెపితే మళ్లీ , మళ్లీ వినాలనిపించేది.


ఆయన క్లాసు లోకి రాగానే, అందరూ లేచి "గుడ్మార్నింగ్ సార్ "అని దీర్ఘాలు తీసారు. అందరినీ కూర్చోమని చెప్పి, శర్మ గారు కుర్చీలో కూర్చున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి, గురుపూజోత్సవం గురించి మరొక్క సారి చెప్పి, బాగా చదువుకోమని ఆశీర్వదించారు. ఇక మిగిలింది ఆయన్ను సన్మానించే కార్యక్రమం. క్లాసు లీడర్ను అయినందుకు నేను, ఈ కార్యక్రమంలో నాకు ఎక్కువగా సహకరించినందుకు దస్తగిరి, సురేష్ లు మాస్టారు కూర్చునే ప్లాట్ ఫారం మీద నించున్నాం. ఆయన మెడలో పూల దండ వేశాం. చిరునవ్వుతో స్వీకరించారు, ఇవన్నీ ఎందుకురా అంటూనే. ఇక బెలూన్లు పేల్చే పని నాది. నేను అగరుబత్తి తో బెలూన్లను పేల్చాను. పెద్ద శబ్దంతో రెండు బెలూన్లు పేలాయి.  పూలు జలజల మాష్టారు గారి మీద పడ్డాయి. బెలూన్లు పేలిన  శభ్దానికి, గాలి విసురుకూ అగరుబత్తి ఆరిపోయింది. మూడో బెలూన్ పేలలేదు.అదే మా కొంప ముంచింది. 


తన మీద పడ్డ పూలను చిరునవ్వుతో చూస్తూ, సార్ తల పైకెత్తి చూసారు . అంతవరకూ సాకేత రాముడిలా ప్రశాంతంగా ఉన్న ఆయన ఒక్కసారిగా పరశురాముడై పోయారు. "ఛీ..ఛీ" అంటూ, ఒక చేత్తో తనమీద పడ్డ పూలను విదిలించేస్తూ, మరో చేత్తో నా చెవి పట్టుకున్నారు. "వెధవల్లారా...ఎక్కడ్నుంచి తెచ్చారురా ఇవి, ఇది మీకు వచ్చిన ఆలోచనేనా " అంటూ. మాకందరికీ నిలువు గుడ్లు పడ్డాయి. బాధకు తట్టుకోలేక నేను సురేష్ వైపు, సురేష్  దస్తగిరి వైపు చూపించుకున్నాం. సురేష్ కు కూడా వీపు మీద ఒక దెబ్బ పడింది. రెండు చేతులతో మా ఇద్దరికీ సన్మానం జరగడం వల్ల దస్తగిరి మాత్రం బతికి పోయాడు.


జరిగిందేంటంటే, దస్తగిరి, సురేష్ లు తెచ్చిన బెలూన్లు,  "నిరోద్"లు. సురేష్ వాళ్ళ అమ్మగారు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ గా పనిచేస్తారట. పేషంట్లకు పంపిణీ చెయ్యమని వాళ్లకు ఇచ్చిన పాకెట్లలోంచి వీళ్ళిద్దరూ కొన్ని నిరోద్ లు కొట్టుకొచ్చారు. డబ్బు ఖర్చుపెట్టక్కర లేదు కదా ని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు . 
అయినా, ఇప్పటి పిల్లలకున్నంత లోకజ్ఞానం కూడా అప్పట్లో మాకెవ్వరికి ఉండేది కాదు కూడా. ఉచితంగా బెలూన్లు వస్తున్నాయన్న సంబరం తప్ప.


ఇప్పుడు గుర్తుచేసుకుంటే , ఆ దృశ్యం కూడా వికృతం గానే కనిపిస్తోంది. పగిలి వాలిపోయిన రెండు బెలూన్ల మధ్య, పేలని మూడో బెలూన్ గాలికి ఊగుతోంది. పాలిపోయిన మోఖాలతో నించున్న మమ్మల్ని చూసి ఏమనుకున్నారో ఏమో, "సరే, చేసింది చాలు, ఇక ఈ దరిద్రం అంతా శుభ్రం చెయ్యండి" అని ఆర్డరు వేసి శర్మ గారు క్లాసు లోంచి వెళ్లి పోయారు.


తర్వాత బిక్కు బిక్కు మంటూ, నేను, దస్తగిరి, సురేష్, ఇంకా క్లాసు లోని కొంతమంది పిల్లలు స్టాఫ్ రూం కు వెళ్లి, సార్ కు సారీ చెప్పి, ఆయన కోసం తెచ్చిన ఆపిల్ పండ్లు ఇచ్చి వచ్చాం. "ఇలాంటివి స్కూల్ లోకి తీసుకు రాకూడదు ..సరే వెళ్ళండి. పిచ్చి వేషాలు వెయ్యకుండా బాగా చదువుకోండి" అని అప్పటికి మమ్మల్ని వదిలేసారు. సార్ మమ్మల్ని చివాట్లు పెట్టిన బాధకన్నా, మిగతా సెక్షన్ల కు ఈ విషయం తెలియకుండా ఎలా దాచాలన్నది మా ముందున్న పెద్ద సమస్య. ఎలా చెయ్యడమా అని అందరం మల్ల గుల్లాలు పడుతుంటే, దస్తగిరి మాత్రం "అన్ని బెలూన్లు పగలలేదని సార్ కు కోపం వచ్చిందిరా...అంతే, ఇంకేమి కాదు" అని జరిగిన దారుణానికి ముక్తాయింపు పలికాడు. 
తర్వాత ఎక్కడ కనిపించినా, మా వైపు తెలుగు సార్ అనుమానంగా చూడడం, ఆయనను తప్పించుకు తిరగడంతో మా 9 తరగతి చదువు భారంగానే గడిచింది. 
ఇప్పుడు అమెరికా లో, పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ లు చేసినప్పుడు, కాంఫెట్టి వేసిన బెలూన్లను పేలుస్తూనే ఉన్నాం. ప్రతిసారీ నాకు మేము చేసిన గురుపూజోత్సవమే గుర్తుకు వస్తుంది. 


దస్తగిరి తో నాకు ఎదురైన మరో అనుభవం రెండో భాగం లో వివరిస్తాను...అంత వరకూ సెలవ్.


~ శశిధర్ సంగరాజు. 







Friday, November 12, 2010

డే లైట్ సేవింగ్స్ టైం ....

అమెరికా లో నివసించే చాలామంది భారతీయుల లాగానే, నేను కూడా తరచూ ఇండియాలోని
బంధువులతో,  స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను. గత పదకొండు సంవత్సరాల్లో నేను గమనించిందేంటంటే, ఈ  సంభాషణల్లో  వాళ్ళు తప్పకుండా నన్ను అడిగే ఒక ప్రశ్న - "ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అయింది?" అని. అమెరికా కు, ఇండియా కు ఉన్న ఈ టైం తేడా, గత ఆదివారం తో ఇంకొంచెం (ఆంటే, ఒక గంట) తగ్గింది.



అవును, ఆదివారం (నవంబర్ 7  తెల్ల వారు ఝామున, అంతే శనివారం అర్థరాత్రి తర్వాత)మేమంతా గడియారాల్లో టైం ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం. అదేం పిచ్చి అనుకుంటున్నారా? అదంతే. అమెరికా లో, ఈ సంవత్సరానికి  నవంబర్ 7 తో "డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసింది. ఈ "డే లైట్ సేవింగ్స్ టైం " మార్చి 14 న మొదలై, నవంబర్ 7 వరకు ఉంటుంది. 

అమెరికాలో స్ప్రింగ్ (వసంతకాలం)లో ఒక గంట ముందుకు, ఫాల్ (ఆకురాలేకాలం) లో ఒక గంట వెనక్కు టైం మార్చుకుంటాం.


"డే లైట్ సేవింగ్స్ టైం " ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎండాకాలం లో సాయంకాలం ఎక్కువ సేపు వెలుతురును ఎంజాయ్ చెయ్యడం. వెలుతురు ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి,దూర ప్రాంతాలకు కార్లల్లో వెళ్ళే వాళ్లకు డ్రైవ్ చెయ్యడానికి కాస్త ఈజీ గా ఉంటుంది.

"డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసిన తర్వాత అమెరికాలో ఈస్ట్ కోస్ట్ లో ఉండేవాళ్ళు, ఇండియా కన్నా పదిన్నర గంటలు వెనుక ఉంటాం. (ఈ విషయం లో మాత్రం అమెరికా ఇండియా కన్నా వెనకబడే వుంది.) ఉదాహరణకు, ఇప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది. 

"డే లైట్ సేవింగ్స్ టైం " లో  అమెరికా కు , ఇండియా కు టైం లో ఉన్న తేడా తొమ్మిదిన్నర గంటలు. అప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఏడు గంటలు అవుతుంది. 


అమెరికా లో మొత్తానికి 4 టైం జోన్స్ ఉన్నాయి. మీ సౌలభ్యం కోసం చార్ట్ కింద ఇస్తున్నాను. 





ఈస్టర్న్ టైంజోన్ కన్నా పసిఫిక్ టైంజోన్ 3 గంటలు వెనక్కు ఉంటుంది. 
ఈస్ట్ లో రాత్రి తొమ్మిది అయితే, సెంట్రల్ లో ఎనిమిది, మౌంటైన్ లో ఏడు, పసిఫిక్ లో ఆరు గంటలు అవుతుంది. 

చార్ట్ లో కింద అలాస్కా కనిపిస్తోంది కదా, అక్కడ ఇంకో విపరీతం. సంవత్సరం లో కొన్నిరోజులు 24 గంటలు వెలుతురు , కొన్ని రోజులు 24 గంటలు చీకటి ఉంటాయి. 24 గంటలు వెలుతురు ఉన్నప్పుడు అలాస్క కు వెళ్లి చూసి రావాలన్నది నాకున్న ఒక కోరిక. తీరుతుందనే ఆశ,నమ్మకం. 


అమెరికా కు వచ్చిన కొత్తలో ఈ గోల అర్థం కావడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. ఆమెరికా లోని తమ పిల్లల దగ్గరకు తరచూ వచ్చే వారికి ఈ విషయంలో కొంత అవగాహన ఉన్నా, ఇండియా లో ఉండే మిత్రులకు కొంత ఆసక్తికరంగా ఉంటుందనే భావిస్తాను. 

ఇండియా, అమెరికా కన్నా భౌగోళికంగా చిన్నదవ్వడం మూలాన, మనకు ఒక టైంజోన్ తో సరిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం, ఈ టైం ముందుకు జరుపుకునే విషయం లో అమెరికాను చూసి వాతలు పెట్టుకోబోయి, ఆనక నాలుక కరుచుకున్నారని ఎక్కడో చదివాను. 


ఈ పోస్ట్ మీద మీ కామెంట్స్ తెలియజేయండి. 


~ శశిధర్ సంగరాజు.





 






Saturday, November 6, 2010

గరికిపాటి వారు....

నాకు,  రొటీన్ దినచర్య నుంచి కాస్త రిలీఫ్ కావాలనిపించినప్పుడు, లేదా ఎవరికోసమైనా ఎదురు చూడడమో, నా మినీ వ్యాన్ సర్విసింగ్ కు ఇచ్చినప్పుడో, ఆఖరికి ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో సైతం,  కాలక్షేపానికి నేను  ఆశ్రయించే ఒకే ఒక సాధనం "యూ ట్యూబ్". నిజం గా "యూ ట్యూబ్" ద్వారా నేను పొందిన లాభాలు అన్నీ, ఇన్నీ కావు. టెక్నాలజీ నుంచి, సాహిత్యం దాకా అన్ని రంగాలను  "యూ ట్యూబ్" లో వెతికి పట్టుకుని, చూసి  ఆనందిస్తుంటాను. బోర్ కొట్టినప్పుడు టివి లో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడడం కన్నా,  "యూ ట్యూబ్" బ్రౌజ్ చెయ్యడం ఉత్తమం.

ఈ మధ్య, మా కార్ డీలర్ దగ్గర ఒక రెండు గంటల పాటు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది ( నా మినీ వ్యాన్ సర్వీసింగ్ కోసం). వెయిటింగ్ లాంజ్ , ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. చక్కటి రిక్లైనింగ్ సోఫాలు, పెద్ద పెద్ద  ఎల్సిడి టివి లు , కాఫీ మెషిన్ నుంచి తయారవుతున్న తాజా కాఫీ. ఇంకేమి కావాలీ, శుభ్రంగా కాళ్ళు జాపుకుని , ఐ-ఫోన్ లో  "యూ ట్యూబ్" వెతకడం మొదలు పెట్టాను.

మనసు సాహిత్యం వైపు మళ్ళింది. వెంటనే, నాకిష్టమైన పేరు టైపు చేసాను. "గరికిపాటి నరసింహారావు" అని సెర్చ్ మొదలెట్టగానే కొన్ని వీడియోలు  వచ్చాయి. నేను క్లిక్ చేసిన మొదటి లింక్ కింద ఇస్తున్నాను. గరికిపాటి వారి పేరు, సాహితీ ప్రియులకు చిర పరిచితమే అనుకుంటాను.  సహస్రావధానిగా,కవిగా, సాహితీ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించే గరికిపాటి వారు ఆంధ్రులవడం మన అద్రుష్టం .  మహానుభావుడు, సరస్వతీ కటాక్షం పుష్కలంగా పొందాడు. చతురతకు, భాష మీద పట్టుకు ఈయనే చిరునామా. మిగతా వారికి, ఈయనకు ఉన్న తేడా ఏమిటంటే, ఏ విషయాన్నైనా, సరళంగా, సరదాగా చెప్పడం ఈయన సొత్తు. సెల్ ఫోన్ల మీద గరికిపాటి వారి చమత్కారం చూడండి.  http://www.youtube.com/watch?v=jYyy6SVTPEY&feature=fvw

తెలుగు వన్ వెబ్ సైట్ లో ప్రసారమైన "సాహిత్యం లో హాస్యం" కార్యకమం లోనిది ఈ లింక్. ఈ సిరీస్ లోనే వచ్చిన మరికొన్ని ..
మిరపకాయ బజ్జి,
ఆంధ్రుల ఆవకాయ,
భోజరాజు సమక్షం లో కాళిదాసు చెప్పిన పద్యాలు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో...

మీకు వీలు దొరికితే "యూ ట్యూబ్" లో వెతకండి. మీ ఖాళీ సమయం తప్పకుండా సద్వినియోగం అవుతుంది.
ప్రయత్నిస్తారు కదూ,
మీ కేమైనా మంచి లింకు లు దొరికితే, నాకు కూడా పంపండి.

~శశిధర్ సంగరాజు.

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ,

మీకు, మీ కుటుంబసభ్యులకు 
దీపావళి శుభాకాంక్షలు. 

~ శశిధర్ సంగరాజు.

Sunday, October 31, 2010

లూయివిల్ లో బాలల సాంస్కృతిక కార్యక్రమాలు ....

మా ఊర్లో (లూయివిల్ ) సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలను ఎంకరేజ్ చేయడానికి చిన్న రైట్అప్ రాస్తున్నాను. ఈ వార్తను ఈనాడు కు కూడా పంపడం జరిగింది. లింక్ ఇస్తున్నాను. http://www.eenadu.net/story.asp?qry1=28&reccount=29
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కెంటకి రాష్ట్రం లోని లూయివిల్ లో బాలల దినోత్సవం సందర్భం గా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కెంటకియాన తెలుగు సంఘం ఆధ్వర్యం లో "ఆటల పాటల సాయంత్రం" పేరుతొ జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
కార్యక్రమానికి రఘు కొడుమూరి,రాధిక వేమ్మిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిన్నారులు ప్రదర్శించిన "బృందావనం" నృత్యరూపకం ఆహూతుల మన్ననలు పొందింది. డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన ఘంటసాల సినీ గీతాలు అందరిని అలరించాయి. తెలుగు జానపద గీతాలకు అమెరికన్ యువతులు చేసిన నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఏడు సంవత్సరాల "సూపర్ జీనియస్ కిడ్" మాస్టర్ ప్రణవ్ తన అసాధారణ ప్రతిభ తో ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఈ అబ్బాయి ధారణ శక్తి  ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువనీ, పది లక్షల మంది లో ఒక్కరికి ఇలాంటి సామర్థ్యం ఉంటుందని నిర్వాహకులు తెల్పారు (ఈ అబ్బాయి గురించి , మరో పోస్ట్ విడిగా రాయాలని ఉంది. తప్పకుండా రాస్తాను.) సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ కొడాలి విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~













Friday, October 29, 2010

హాలోవీన్ వచ్చేసింది...

నార్త్ అమెరికా (అమెరికా, కెనడా), యూరప్ లలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 (ఈ సంవత్సరం ఆదివారం రోజు)న హాలోవీన్ జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు రక రకాల కాస్ట్యుంలు ధరించి సందడిగా గడిపేస్తారు. అసలీ హాలోవీన్ ఏమిటో, ఈ విచిత్ర వేషధారణ వెనకాల ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. 

కథ కమామీషు: 
దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ హాలోవీన్ యూరప్ లో మొదలైంది. అక్కడి వారికి ఒక నమ్మకం/మూఢ నమ్మకం ఉండేది. హాలోవీన్ రోజున, చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకు వస్తాయని. సరే, వచ్చిన ఆత్మలు ఊరికే ఉండవు కదా? తమ ఇళ్ళ దగ్గరకు వచ్చి పట్టి పీడిస్తాయని వీరి నమ్మకం. అందుకని, ఆ ఆత్మలు తమను గుర్తు పట్టకుండా, రక రకాల వేషాలు, మొహాలు కనపడకుండా మాస్కులు ధరించి, తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి గుంపులు గుంపులు గా తిరిగేవాళ్ళు (ట). యూరోపియన్లు అమెరికా కు వలస వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయం ఇక్కడ కూడా మొదలైంది.  

దాదాపు నెల రూజుల ముందు నుంచే, షాపుల్లో వెరైటీ  కాస్ట్యుంలు అమ్ముతుంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ కాస్ట్యుంలు ధరించి పార్టీలకు, పెరేడ్ లకు వెళతారు. 
కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య కాస్ట్యుం పోటీలు నిర్వహించి, బెస్ట్ కాస్ట్యుం కు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. 

ఇక పిల్లల హడావుడి కి అడ్డేముంది..సంవత్సరం ముందు నుంచే , వచ్చే హాలోవీన్ కు ఏయే కాస్ట్యుంలు కొనాలో ప్లాన్ చేసే చిచ్చర పిడుగులున్నారంటే అతిశయోక్తి కాదు. 

చెక్కిన గుమ్మడి కాయ ఆకారంలో ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ బకెట్ లు పట్టుకుని "ట్రిక్ ఆర్ ట్రీట్" అంటూ పరుగులు పెడతారు. ఈరోజున తమ ఇళ్ళ దగ్గరకు వచ్చే చిన్నారులకు చాక్లెట్లు, కాన్డీలు, చిన్న చిన్న ఆట బొమ్మలు పంచి పెడతారు. ఇదే  "ట్రిక్ ఆర్ ట్రీట్".

మా ఇంటి దగ్గరున్న చర్చి ఆవరణలో పెరేడ్ జరుపుతారు. చర్చి వాలంటీర్లు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా,  ఇంఫ్లేటబుల్స్ ఏర్పాటు  చేస్తారు. అందుకే, మా పిల్లలు కూడా చర్చి పెరేడ్ కు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. 
సరే, ఇక టివి చానళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచే  దడుచుకునే హారర్ సినిమాలు వేసి వాయించేస్తారు.


ప్రతి సరదా సందర్భం వెనుకా, ఒక ప్రమాదం ఉన్నట్లే (దీపావళి పండుగలో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉన్నట్లు), ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ముఖ్యం గా పిల్లలను "ట్రిక్ ఆర్ ట్రీట్" కు పంపేటప్పుడు.


అమెరికాలోని బ్లాగ్ మిత్రులకు కొన్ని సూచనలు:
1 ) పిల్లలను ఒంటరిగా పంపకండి.
2 ) అపరిచితుల ఇళ్ళకు, రోడ్డుకు కొంత దూరంగా, కాస్త విసిరేసినట్లు ఉండే ఇళ్ళకు అస్సలు పంపకండి. 
(అపరిచితుల ఇళ్ళ దగ్గరకు పెద్దల తోడు లేకుండా వెళ్ళిన పిల్లలు ఎదుర్కునే పరిస్థితులను టివి లలో చూపుతుంటారు. వాటి వివరాల్లోకి నేను వెళ్ళదలచుకోలేదు.) 
3 ) వీలున్నంత వరకూ, జనం బాగా ఉండే ప్రాంతాల్లో జరిగే పెరేడ్ లకు తీసుకెళ్ళండి. అదీ, పిల్లలను, మీ కనుచూపు మేరలో ఉండేలాగా చూసుకోండి. 
దీనికి, మేము కనిపెట్టిన ఒక ఉపాయం, మా పిల్లలను చర్చి పెరేడ్ కు కానీ, దగ్గరలోని మాల్ కు కానీ తీసుకెళ్లడం. మాల్ కు వెళ్ళడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ఉండడం ఒకటైతే ,ఎలాగూ, అక్టోబర్ చివరి వారం వచ్చే సరికి వాతావరణం బాగా చల్లబడి పోతుంది. మాల్ లో అయితే, సెంట్రల్ ఎయిర్ కండీషనర్ మూలంగా వెచ్చగా ఉండడం రెండోది. 
మీ దగ్గరలోని మాల్ లో సంప్రదించండి. "ట్రిక్ ఆర్ ట్రీట్" టైమింగ్స్ చెప్తారు.  

ఇండియా లో కూడా ఈమధ్య కాలం లో హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నాను. అది నిజమైతే,
మీకందరికీ , "హ్యాపీ హాలోవీన్"! 
ఎంజాయ్ చెయ్యండి మరి.

~శశిధర్ సంగరాజు.


Tuesday, October 26, 2010

'తిక్క'వరపు సుబ్బరామిరెడ్డి


 నేనెవరి గురించి రాస్తున్నానో మీకందరికీ తెలిసే వుంటుంది.   ఇంటి  పేరు లోనే 'తిక్క' ఉన్న ఈ పెద్ద మనిషి పిచ్చి ప్రేలాపన ఇప్పుడే టివి లో చూసాను. "తెలుగు లలిత కళా తోరణం" పేరు ను "రాజీవ్ తెలుగు లలిత కళా తోరణం" గా మార్చడం సమంజసం అన్నది ఈయన పిడివాదం. 

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దిక్కుమాలిన కళా/సాంస్కృతిక సంఘాలు ఉన్నాయి. వీళ్ళ పనేంటంటే, సమాజం లో బాగా స్థితి పరులైన కొందరు పెద్దలను కాకా పట్టి, వాళ్ళ డబ్బులతోనే వాళ్లకు సన్మానాలు చేస్తుంటారు. అలాంటి సంఘాలకు డబ్బులిచ్చి సుబ్బరామిరెడ్డి గారు "కళాబంధు" (నిజంగా రాబందు)లాంటి బిరుదులు కొనుక్కున్నారు. ఈయన కళా రంగానికి సేవచేసిన మాట నిజమే గాని, ఇలా డబ్బులిచ్చి డప్పు కొట్టించుకోవడం కూడా అంతే నిజం.

సరే, ఈయన ప్రతాపం కళా రంగానికి పరిమితమైతే బాగుండేది. ఉన్నట్లుండి సోనియమ్మ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా 10 కోట్లు విరాళం ఇస్తాను, లలిత కళా తోరణం పేరును మార్చి "రాజీవ్" ముందు తగిలించాలని అడగడం, దానికి రోశయ్య గారు వెంటనే బట్టతల ఊపడం జరిగి పోయింది. 


టివి షో లో యాంకర్ తో ఈయన వాగ్యుద్ధం ...అసలు "తెలుగు జాతి" అనేది లేదనీ, అదొక డైలాగ్ మాత్రమేనని.ఇది నిజంగానే పిచ్చికి పరాకాష్ట.


ఈ లెక్కన రాష్ట్ర అసెంబ్లీ కీ, హైకోర్టు కు కూడా రాజీవ్, ఇందిర ల పేర్లు పెడతారేమో ఖర్మ. అన్ని రాజకీయపార్టీలు (పార్టీలకు అతీతంగా) ఈ పేరు మార్పిడి ప్రోగ్రాం ను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


సుబ్బరామిరెడ్డి గారు నమ్ముకున్న పరమేశ్వరుడు ఆయనకు సద్భుద్ది ప్రసాదించుగాక. 

ఈ ఉన్మాదాన్ని అందరూ ఖండించండి.

~ శశిధర్ సంగరాజు.

Friday, October 22, 2010

నన్నారి షర్బత్

కడప, ఏడురోడ్ల సెంటర్, ఈ పేరు వినగానే, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు తప్పకుండా గుర్తుకొచ్చే మరో విషయం "బాషా కూల్ డ్రింక్ షాప్". అక్కడ దొరికే "నన్నారి షర్బత్" . ఈ నన్నారి అనే మాట రాయలసీమ వాసులకు సుపరిచితమే అనుకుంటాను. నన్నారి మొక్క వేళ్ళను ఉడికించి తయారు చేస్తారు. ఎండాకాలం లో వేడి తగ్గించే మంచి జ్యూస్. పరీక్షల టైమ్ లో మరీ.


ఏడురోడ్ల సెంటర్ నుంచి కృష్ణ - రమేష్ థియేటర్లకు వెళ్ళే దారిలో ఎడమ వైపు కార్నర్లో ఉండేది బాషా షాపు. మామూలు కూల్ డ్రింక్ షాపే. కానీ, ఎండాకాలం లో దాదాపు ప్రతి రోజు మాకు సేద తీర్చే అడ్డా. 

సంవత్సరం పరీక్షలు  రాసి,  మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురం స్నేహితులం షాప్ దగ్గర ఆగేవాళ్ళం. బాషా అసలు పేరు ఏమిటో నాకు తెలీదు. అందరూ బాషా అనే పిలిచేవాళ్ళు. మేము పిల్లలం మాత్రం "అన్నా" అని పిలిచేవాళ్ళం.

సైకిళ్ళు స్టాండ్ వేసి, వెనకాల క్యారియర్ మీద కూర్చుని, "అన్నా, నన్నారి" అని ఆర్డరు చేసేవాళ్ళం. అప్పుడు బాషా "పరీక్షలు బాగా రాసారా?" అని అడుగుతూ  నన్నారి ప్రిపరేషన్ మొదలెట్టే వాడు. 

 నన్నారి ప్రిపరేషన్: 


ముందుగా, ఫ్రీజర్ లోంచి ఐస్ బ్లాక్ తీసి, తన చేతులు మొద్దు బారకుండా , శుభ్రమైన బట్టతో పట్టుకునేవాడు. బాషా ఎదురుగా స్టీల్ బ్లేడు బిగించిన చెక్క ఫ్రేం ఉండేది. ఐస్ బ్లాక్ ను ఆ బ్లేడ్ కు ఎదురుగా చెక్కేవాడు, కొబ్బరి తురుము లా. చెక్క కు ఉన్న కన్నం లోంచి ఐస్, పొడి, పొడి గా కింద ఉంచిన గ్లాసుల్లోకి పడేది.  సగం వరకు ఐస్ పొడి నిండిన ఆ గ్లాసుల్లోకి, డార్క్ చాకలేట్ రంగులోని , నన్నారి మిశ్రమాన్ని కలిపేవాడు. దానికి పంచదార, అరచెక్క నిమ్మ రసం  జత చేరేవి. గ్యాస్ తో నిండిన గోళీ సోడాను కొట్టి , గ్లాసుల్లోకి పోసేవాడు. సోడా తో కలసిన నన్నారి లేత గోధుమ రంగులోకి మారి, బుస, బుస మని పొంగేది. 
అసలే, కడప ఎండలు, పైగా పరీక్షల టెన్షన్. గ్లాసును నోటి దగ్గరకు చేర్చగానే, సోడా గ్యాస్ వల్ల ఎగిరే నీటి తుంపరలు పెదవులకు తగిలి గిలిగింతలు పెట్టేవి. నన్నారి తాగుతూ, రేపటి పరీక్ష కు ఎలా ప్రిపేర్ కావాలో డిస్కస్ చేసుకునే వాళ్ళం. 

నేను కడప వదిలేసి దాదాపు 15 సంవత్సరాలైంది. ఆ నన్నారి రుచి ఇంకా గుర్తుంది. అమెరికాలో దానికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాను. ఇక్కడ "రూట్ బీర్" (నా శీలాన్ని శంకించక్కర్లేదు. ఇది సాఫ్ట్ డ్రింక్. )    అనే డ్రింక్ దొరుకుతుంది. నన్నారి బదులు,  ఈ డ్రింక్ కూడా వాడొచ్చు. కానీ, నన్నారి షర్బత్ కు ఏదీ సాటి రాదు. 


6 సంవత్సరాల తర్వాత, జూలై లో కడప కు వెళ్ళాను. ఏడు రోడ్ల సెంటర్ లో బాషా షాప్ కనపడలేదు. మా నాన్న గారిని అడిగాను. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని షాపులను తీశేసారని చెప్పారు. బాషా ఏమయ్యాడని ఎవరినీ అడగలేదు. ఏం వినాల్సొస్తుందోనని. 

కడపను సింగపూర్ చెయ్యాలని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ఆయన మేయరు బామ్మర్ది
ప్రయత్నించిన కారణంగా, కాంట్రాక్టర్లు రోడ్లన్నీ తవ్వేసారు. ఇంకా రాళ్ళగుట్టలు అలాగే
ఉన్నాయి.  ఊర్లో కొన్ని చోట్ల మరీ దారుణం.

వీళ్ళు  కడపను సింగపూర్ చేస్తే సంతోషించేవాళ్ళల్లో నేనూ ఒకడిని. కానీ, కాంట్రాక్టర్లు పనిని సగంలో ఒదిలేస్తే మాత్రం, పరిస్థితి అదేదో సామెత లాగా ( "ఉన్నదీ పోయి, ...." ) అవుతుంది. సామెత నేను పూర్తి చేయక్కర్లేదు. మీకు తెలుసు.


నన్నారి షర్బత్ ట్రై చెయ్యడం మర్చిపోకండి.

~ శశిధర్ సంగరాజు.




Sunday, October 17, 2010

థాంక్స్

ఇటీవలె కూడలి నుంచి ఈమెయిలు వచ్చింది. నా బ్లాగ్ ను కూడలి లో చేర్చారని.
నాకు కూడలి ని పరిచయం చేసి, నా బ్లాగ్ ను కూడలి కి పంపేలా ప్రోత్సహించిన 
 శ్రీదేవి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 


కలసి పనిచేసి (ఈటీవి లో) దాదాపు 14 సంవత్సరాలైనా , నేను బ్లాగ్ ఓపెన్ చేసి, రాయడం మొదలు పెట్టానని 
 తెలిసి ప్రోత్సహిస్తున్న విజయ్ కుమార్ (ఆయన జర్నలిజం స్కూల్ లో నాకు సీనియర్ , ప్రస్తుతం  "జర్నో ముచ్చట్లు" బ్లాగ్ నిర్వాహకులు)గారికి మెనీ థాంక్స్.










అమెరికా లో ఫాల్ కలర్స్

ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి ఫాల్ / ఆటం మొదలైంది. ఈ కాలం లో చెట్లు తమ ఆకుల రంగులను క్రమ క్రమం గా మార్చుకుని చివరికి రాలి పోతాయి. అందరికీ తెలిసిన విషయమేగా , ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా- చిన్నప్పుడు సైన్సు క్లాసు లో చదువుకునే ఉంటాం ఫోటో సింథసిస్ గురించి.మరోసారి గుర్తు చేసుకుందాం. 

చెట్లు తమ వేళ్ళ ద్వారా భూమి లోని తేమనీ , పర్యావరణం లోని కార్బోన్ డై ఆక్సైడ్ ని గ్రహిస్తాయి. సూర్యరశ్మి ని ఉపయోగించి తేమనీ , కార్బోన్ డై ఆక్సైడ్ నీ, ఆక్సిజన్ , గ్లూకొస్ లు గా మార్చు కుంటాయి. ఈ ప్రక్రియనే ఫోటో సింథసిస్ అంటారు. ఫోటో సింథసిస్ జరగడానికీ, చెట్ల ఆకులు ఆకు పచ్చ గా ఉండడానికీ క్లోరోఫిల్ అనే రసాయనం ప్రధాన కారణం. (కింది ఫోటో చూడండి).

ఫాల్ / ఆటం లో చెట్ల ఆకుల రంగులో మార్పెలా వస్తుంది?
ఎలాగంటే, ఎండాకాలం అయిపోయి, ఆకు రాలే కాలం వచ్చిన తర్వాత, పగటి పూట ఎండలో తీక్షణత  తగ్గుతూ వస్తుంది. తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఫోటో సింథసిస్ ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా చెట్ల ఆకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు, ఎరుపు, వంగ, నారింజ రంగుల్లోకి మారతాయి. ఇవ్వాళ మా ఇంటి దగ్గర కొన్ని చెట్ల ఫోటో లు తీసాను. చూడండి రంగులు ఎలా ఉన్నాయో. 
ఇండియా లో ఉన్నప్పుడు , ఇన్ని రకాలుగా ఆకులు రంగు మారడం ఎప్పుడూ చూడలేదు. బహుశా, ఉష్ణోగ్రతల్లో పెద్ద తేడాలు ఉండక పోవడం కూడా కారణమై ఉండొచ్చు.

 ఉష్ణ ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాల్లో ఎండా కాలానికీ, ఆకురాలే కాలానికి మధ్య ఉష్ణోగ్రతా భేదాలు ఎక్కువగా ఉండవు.


 


అమెరికా లో, వీకెండ్స్ లో ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళడం ఒక ఆట విడుపు. కొన్ని వందల మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్లి , కలర్స్ చూసి వస్తుంటారు. మా ఊరికి దగ్గర్లో "గ్యాటలిన్ బర్గ్ " అనే ప్రాంతం, ఈ ఫాల్ కలర్స్ కి బాగా ప్రసిద్ది.  మళ్ళీ డిసెంబర్ 21 నుంచి చలికాలం మొదలవుతుంది. మంచు, చలి. అదొక అందం. 


                            (ఈ ఫోటో, లూయీవిల్ కు దగ్గర్లోని " బెర్న్ హైమ్ ఫారెస్ట్  " లో  తీసింది. )  



ప్రకృతి సృష్టించే ఈ రంగుల కాన్వాస్ ను, పునఃసృష్టి చేయడం, ఎంత చేయి తిరిగిన చిత్రకారుడికైనా అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!

చెట్లన్నీ కొట్టేస్తే, ముందు తరాలకు ఈ అందాలన్నీ దూరమైపోతాయి.
మరి మీ వంతుగా మొక్కలను నాటి, పర్యావరణ సమతుల్యానికి పాటుపడతారు కదూ?

ప్రయత్నించండి.

~ శశిధర్ సంగరాజు.


 


Saturday, October 16, 2010

దసరా శుభాకాంక్షలు .

నా బ్లాగ్ ను సందర్శిస్తున్న  మిత్రులందరికీ , విజయదశమి శుభాకాంక్షలు. 




~ శశిధర్ సంగరాజు.

Friday, October 15, 2010

అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్

ఈమధ్యన రెగ్యులర్ చెకప్ కోసం , డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవలసి వచ్చింది. అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం.  మీకందరికీ తెలిసే ఉంటుంది, ఇండియా లో చాలా మంది డాక్టర్ లు ఉదయం 8 నుంచి 12 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 దాకా పనిచేస్తారు. మనం ఆఫీసు లో పర్మిషన్లు, సెలవులు తీసుకోనక్కరలేదు .అమెరికా లో మాత్రం, డాక్టర్ లు  చాలా మంది 8  నుంచి 4 వరకే పేషంట్లను చూస్తారు. సరే, అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా అని , ఆఫీసు లో పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. 

డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ, అక్కడ నేను ఎదుర్కున్న పరిస్తితులను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.  


ఫ్రంట్ డెస్క్ లో ఉన్న నర్స్ "We need latest information , because its been an year since your last visit" అంటూ  పేషంట్ హిస్టరీ ఫోరం ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఇది తప్పదురా బాబూ అనుకుంటూ ఫిల్ చెయ్యడం మొదలెట్టాను. ఆ చిత్రగుప్తుడి చిట్టా  పూర్తి చేయడానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది. ఇక్కడో ముఖ్యమైన విషయం - అపాయింట్మెంట్ టైం కు పదిహేను నిమిషాలు మీరు లేట్ గా వెళ్ళారా, ఇక అంతే సంగతులు. బిజీ డాక్టర్ అయితే, మీ అపాయింట్మెంట్ కాన్సిల్. కానీ, డాక్టర్ గారు మాత్రం ఆయనకు వీలున్నప్పుడు చూస్తారు. అవును, అవసరం మనది మరీ. 


ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి, డాక్టర్ ఆఫీసు లో వెయిటింగ్ రూం లు మాత్రం శుభ్రంగా ఉంటాయి. 
వెయిటింగ్ టైం లో చదువుకోడానికి కొన్ని మేగజైన్ లు ఉంచారు. అవి కనీసం సంవత్సరం క్రితంవి. అట్టలు చిరిగి, నలిగి పోయి , నా సహనాన్నిపరీక్షించాయి.
 అక్కడ ఒక స్పోర్ట్స్ మేగజైన్ కోసం, నాకు, ఒక చైనీస్ ముసలామెకు జరిగిన పోరాటంలో పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఓడి పోవలసి వచ్చింది. పోనీలే సీనియర్ సిటిజన్ కదా అని నన్ను నేను ఓదార్చుకున్నాను. (ఇది జగన్ ఓదార్పు కాదు, నిజమైనదే).

ఇంకో వైపు రక రకాలైన రోగాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి , రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి, లేదా చెయ్యకూడదు లాంటి వివరాలతో బ్రోషర్స్ పెట్టారు. అవన్నీ చదివారో , అవసరం లేని పరిజ్ఞానం పెరిగి, ఆ రోగాలు అన్నీనిజం గా మనకే ఉన్నాయేమోనన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది.  విషయ పరిజ్ఞానం మంచిదే కానీ, ఈ విషయం లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అందుకే వాటి జోలికి మాత్రం వెళ్ళలేదు. 


ఇలా, దాదాపు గంటసేపు తిప్పలు పడ్డాక, కలుగు లోంచి బయటపడ్డ ఎలుక లా,ఎక్కడినుంచో నర్స్ వచ్చిడాక్టర్ పిలుస్తున్నాడని చెప్పింది. Thank GOD  అనుకుంటూ, లోపలికి నడిచాను. 

చెకప్ పూర్తయింది. అంతా శుభం. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకూ ఈ వైపు వచ్చే అవసరం రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ, బయట పడ్డాను. వచ్చే సంవత్సరమైనా కొత్త మేగజైన్స్ ఉంచుతారని ఆశ. 

చూద్దాం.


~ శశిధర్ సంగరాజు.