Powered By Blogger

Sunday, September 18, 2011

నేచురల్ బ్రిడ్జి - కెంటకి

మా ఊరు లూయివిల్ కు దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో "నేచురల్  బ్రిడ్జి" స్టేట్ పార్క్ ఉంది. 

ప్రకృతి సహజం గా ఏర్పాటైన బ్రిడ్జి అన్నమాట. మీలో చాలామంది మన తిరుమల కొండమీద "శిలా తోరణం" చూసే ఉంటారు. సరిగ్గా అలాగే ఉంటుంది. కాకపొతే, చాలా పెద్దది ఎత్తైనది. మరో విషయం ఏంటంటే, నాకు తెలిసినంతవరకూ "శిలా తోరణం" మనం నడవడానికి వీలు లేదనుకుంటా. (నాకు సరిగ్గా గుర్తు లేదు. Correct me if I am wrong.) ఈ ఆర్చ్ మీద, మీరు నడవొచ్చు, పరుగులు పెట్టొచ్చు..మీ ఇష్టం. 

అసలీ పార్క్ కు వెళ్ళే దారికూడా చాలా బాగుంటుంది. రెండుగంటల ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. దారి పొడువునా, విశాలమైన పచ్చిక బయళ్ళు, స్వేచ్చ గా తిరిగే గుర్రాలు. (మా ఊరు గుర్రాలకు, గుర్రప్పందేలకు ప్రసిద్ది)చూడ్డానికి చాలా బాగుంటాయి. 
అసలు ఎలా ఏర్పడింది:  దాదాపు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ బ్రిడ్జి ఏర్పడడం మొదలైందని కొంత మంది జియాలజిస్ట్ ల నమ్మకం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ, కొంతమంది పర్యాటకులు 1889 నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారట. 78 అడుగుల పొడవు, 65 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం, 20 అడుగుల వెడల్పు.ఇవీ  ఈ బ్రిడ్జి వివరాలు.
 
ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ కేమ్పింగ్ వసతులున్నాయి. కొండ కిందున్న లేక్ లో బోటింగ్ చెయ్యడానికీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. 





 











 


మరి కొండపైకి వెళ్ళడం ఎలా?:
ఇక్కడ ఉన్న "స్కయ్ లిఫ్ట్" నిజంగా ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అరమైలు దూరం సాగే ఈ స్కయ్ లిఫ్ట్ ప్రయాణం ఉత్కంట భరితంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ, 
 కింద కనిపించే జింకలు, కుందేళ్ళు చూడ ముచ్చటగా ఉంటాయి.(కుందేళ్ళు కెమేరాకు చిక్కలేదు!)


ఈ ఆర్చ్ ఏర్పడడానికి ఉపయోగపడిన రాయిని  జియాలజీ పరిభాషలో 
"Pottsville conglomeratic sandstone" అంటారట. కొండపైన అడవిలాంటి ప్రాంతంలోపలికి వెళ్ళడానికి దారులు కూడా ఏర్పరచారు. 
మొత్తానికి ఈ ట్రిప్ పిల్లలకు, పెద్దలకు కూడా వీకెండ్ ఆటవిడుపే.


~శశిధర్  సంగరాజు.

Friday, September 16, 2011

నీ అసాధ్యం కూలా.. రాంబాబూ...నువ్వు సామాన్యుడివి కాదయ్యా!

ఇదిగో రాంబాబూ,
టీవీల్లో ఏదో చూపిస్తున్నారు. నువ్వేం  మనసు కష్టపెట్టుకోకు. ఈసారి వినాయక చవితికి కథ చదువుకోకుండా చంద్రున్ని చూసినట్లున్నావ్. నీలాపనిందలు. అవే సర్దుకుంటాయి లే.

అయినా, ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళకు వేరే పనేమీ లేనట్లుంది. గతంలో కూడా ఎన్ డి తివారీ విషయంలో కూడా ఇలాగే చేసారు. ఏదో ముసలాయన ఊరపిచ్చుక లేహ్యం గట్రా తిని హుషారుగా ఉన్నాడులే అని చూసీ చూడనట్లుండకుండా నానా యాగీ చేసి గవర్నర్ గిరి ఊడగొట్టించారు.

సరే, నీ విషయంలో అంటే ఊడగొట్టించడానికి నీ దగ్గర ప్రస్తుతానికి పదవేదీ లేదనుకో.
ఇక పరువు మర్యాదలంటావా..తూచ్..మనకు వాటికీ ఆమడదూరం. ఈ విషయం వాళ్ళకు తెలిసిరాలేదు.

అయినా, ఈ మధ్య ఓటర్ల కు కూడా బాగా కోరికలెక్కువయ్యాయి. ఏదో అయిదు సంవత్సరాలకొకసారి, నాలుగైదు
గంటలు ఎండలో నిలబడి ఓటు వేసినంతమాత్రాన, అవినీతి చెయ్యద్దంటారు, మహిళలను గౌరవించాలంటారు, ఎంత కష్టం. పైగా ప్రతిదానికీ ప్రకాశం పంతుల్ని, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటివాళ్ళను ఉదాహరణలు చూపిస్తారు. వాళ్ళలా నీతినిజాయితీ గా ఉండడానికి మనకేమైనా చాదస్తమా? ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోకపోతే, రాజకీయాల్లోకి రావడం ఎందుకు?

 వీళ్ళకు తోడు ఈ మధ్యన అన్నాహజారే తయారయ్యాడు,  ప్రతిదానికీ నిరాహార దీక్ష చేస్తానంటాడు.
ఈవయసులో అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం ఆయనకు కూడా మంచిదే అనుకో. కాకపోతే మధ్యతరగతి జనాలు ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు. ఏదో భూమి బద్దలైపోతున్నట్లు హడావిడి.

ఇంతకూ రాంబాబూ, మహిళా కార్యకర్తలను ఈరకంగా గిల్లుకోవచ్చని నీకు భలే ఐడియా వచ్చిందే. సూపర్ కదా!
అందుకే నిన్ను సామాన్యుడివి కాదూ అన్నది. రాజకీయాల్లో టెన్షన్ తట్టుకోలేక, రిలీఫ్ కోసం చేసి ఉంటావు కదా? అంతేలే, దానికి ఇంత గొడవ చెయ్యాలా?

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. నీ తాపత్రయం నా కర్థమైందిలే. ఏదో బయటున్నప్పుడే ఈ ముచ్చట్లన్నీ.
రేప్పొద్దున ఎమ్మార్ కేసులో సిబిఐ అరెస్టు చేసి లోపలేసిందనుకో, అక్కడ గోక్కోడానికి మహిళా కార్యకర్తలెవరూ ఉండరు. ఉంటే గింటే, మహిళా కానిస్టేబుళ్ళు ఉంటారు. వాళ్ళను గోకావనుకో, బయటకు  చెప్పుకోలేనిచోట థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మళ్ళీ అదో  బాధ.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నట్లున్నావ్. ధైర్యం అంటే అదీ. నిజం ఎలాగూ త్వరలోనే బయటపడుతుంది. ఈలోపల తొందరపడి జగన్ పార్టీలోంచి తీసేస్తాడని ఆలోచించొద్దు. ఇది కాకపోతే ఇంకోటి. ఈసారి మహిళలు కాస్త ఎక్కువున్న పార్టీ చూసి చేరుదువు గానీ. వినడానికి ఫోన్లో నీ గొంతు భలేగా ఉంది రాంబాబూ. ఈసారి వీడియో చాటింగ్ చెయ్యి. టెక్నాలజీ ని ఉపయోగించుకో. అసలే నీది మంచి ఫోటోజనిక్ ఫేస్  కదా.

ఈ ఛానళ్ళు, మహిళా సంఘాల  గొడవ మామూలేగానీ, నీ పనిలో నువ్వుండు. ఆల్ ది బెస్ట్.

~శశిధర్ సంగరాజు.

Thursday, September 8, 2011

750..800..850...

ఇరానీ హోటల్ లో ఇద్దరు...

మొదటి వ్యక్తి : (గాల్లోకి చూస్తూ...)   750..800..850...
రెండో వ్యక్తి : ఏంటి గురూ..ఏదో లెక్కలేస్తున్నట్లున్నావ్? ఏదైనా ఇంటి స్థలం కొంటున్నావా? ఎన్ని గజాలేంటి?
మొదటి వ్యక్తి : అబ్బే, ఇది గజాల్లెక్క కాదు. పొట్ట పగిలేలా దోచుకుతిన్న గాలి జనార్ధనరెడ్డి ని జైల్లో పెట్టి ఖైదీ నెంబర్ 697  ఇచ్చారు కదా? మన జగనన్న కు ఏ నెంబర్  వస్తుందా అని ఆలోచిస్తున్నా!
రెండో వ్యక్తి : అదేంటీ? బేరం సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీ లెవెల్లో ఏదో ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు?
మొదటి వ్యక్తి : ఆ ప్రయత్నాలన్నీ చీదేశాయి. మనోడు ఇంటిదారి కూడా పట్టాడట. డబ్బు మంత్రం పని చేసినట్లు లేదు. 
రెండో వ్యక్తి: సిబిఐ కూడా బాగా గట్టిగా ఉన్నట్లుంది. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పేట్లు లేదు.
మొదటి వ్యక్తి: అందరూ అదే అంటున్నారు. లోపలకు వెళ్ళాక ఏ నెంబర్ వచ్చినా పర్లేదు కానీ, 786 మాత్రం రాకూడదు. లేకపోతే, దేవుడు తనవైపే ఉన్నాడని ఇంకో పిడివాదం మొదలెడతాడు. మొన్న ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడుగా, తనను అరెస్ట్ చేస్తే, దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని.
రెండో వ్యక్తి : నిజమే, అంత పనీ, చెయ్యగలడు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వర్షం పడితే, వరుణుడు మా వైపే ఉన్నాడనేవాడు. 
మొదటి వ్యక్తి: చూద్దాం. సిబిఐ జగన్ కు ఎలాంటి షాక్ ఇస్తుందో?

~శశిధర్ సంగరాజు

Friday, July 22, 2011

ఘోస్ట్ హంటర్స్...

క్రితం వారం, నేను రాసిన "బహుశా..ఇదే కారణమై ఉంటుంది" పోస్ట్ లో ఆత్మల గురించి రాయడానికి ఒక కధ ఉందని చెప్పాను కదా?  ఆ కధ గురించే ఈ పోస్ట్. చదవండి మరి. 

ఇక్కడ మాకు టివిలో "ట్రావెల్" ఛానల్ వస్తుంది. సాధారణంగా, ఆ ఛానల్ లో ప్రపంచంలోని వివిధ దేశాలు, అక్కడి ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మొదలైనవి చూపిస్తుంటారు. "అంతోనీ బోర్డైన్ - నో రిజర్వేషన్", "ఆడం రిచ్మన్  - మాన్ వర్సెస్ ఫుడ్" ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. సరదాగా  ఉండడమే కాకుండా, ఎంతో విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ తో పాటు, "పారానార్మల్ స్టడీస్" (ఆత్మలకు సంబంధించిన శాస్త్రం) మీద కూడా ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఏదో, "మా పెరట్లో చింత చెట్టు మీద దయ్యం ఉంది, నిన్ను పట్టుకుంటుంది లే" అని చిన్నప్పుడు, తోటి పిల్లలను దడిపించినట్లు కాకుండా,  కాస్త సైంటిఫిక్ గా, లాజికల్ గా ఉంటాయి. సైంటిఫిక్ గా అంటే నా ఉదేశ్యం, ఆత్మలు చేసే శభ్దాలను, మాటలను (అవును, మాటలనే) హై సెన్సిటివ్ వాయిస్ రికార్డర్స్ తో రికార్డ్ చెయ్యడం, నైట్ విజన్ వీడియో కెమెరాలతో , చిమ్మ చీకటిలో, ఆత్మల సంచారాన్ని చిత్రించడం, తర్వాత వాటిని విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కూడా, టివి లో ఆ ప్రోగ్రామే వస్తోంది. ఈ కోవలోకే చెందినదే "ఘోస్ట్ హంటర్స్" అనే కార్యక్రమం.  ఒక చిన్న ఎపిసోడ్ గురించి చెప్పి ముగిస్తాను. 

ఒక కుటుంబానికి పురాతన వస్తువులు (Antiques) సేకరించడం సరదా. నిజంగా కూడా, అమెరికాలో, ఇదో పిచ్చి. ఎక్కడెక్కడో తిరిగి,  తుప్పు పట్టిన వస్తువులని డబ్బులిచ్చి కొని మరీ ఇంట్లో పెట్టుకుంటారు. మన దగ్గరైతే, ఎవరైనా ఇనుప వస్తువులు ఉచితంగా ఇచ్చినా తీసుకోము, దరిద్రమని.

సరే, కధలోకొస్తే, ఆ ఇంటి యజమాని ఎక్కడినుంచో ఒక పురాతన బాయ్నేట్ (తుపాకి ముందు తగిలించే కత్తి లాంటి ఆయుధం) కొని తెచ్చి ఇంట్లో అల్మారాలో పెట్టుకుంటాడు. వాళ్ళ ఆబ్బాయికి రాత్రిళ్ళు తన గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే, మొదట్లో, పిల్ల చేష్టలుగా కొట్టి పారేస్తారు. కాని, తర్వాత, యజమాని భార్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దాంతో వాళ్ళు భయపడి ఈ "ఘోస్ట్ హంటర్స్" ను పిలిపిస్తారు పరిశోదన చెయ్యడానికి. వాళ్ళ అనాలిసిస్ లో తేలిందేమిటంటే, ఈ బాయ్నేట్, వియత్నాం యుద్ధం లో పాల్గొన్న ఒక అమెరికన్ సైనికుడిది. అమెరికన్ సైనికులకు, వియత్నమీస్ కు జరిగిన యుద్దంలో, అమెరికన్ సైనికుడు ఈ బాయ్నేట్ ఉపయోగించి ఎంతో మందిని చంపేస్తాడు.బలవన్మరణాలకు గురైన ఆ ఆత్మలన్నీ, ఈ బాయ్నేట్ ను అంటిపెట్టుకుని ఉన్నాయన్నది పరిశోదన ఫలితం. "ఘోస్ట్ హంటర్స్" పరిశోధన ఎలా చేశారన్నది టివి లో చూస్తేగానీ మజా రాదు. ప్రస్తుతం నేను చూస్తున్న ఎపిసోడ్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది. 

నేను కాలేజి హాస్టల్ లో ఉన్నప్పుడు "ఊజా బోర్డు" అనే ప్రయోగం చేసాను. మా రూమ్మేట్స్ మాత్రమే పాల్గొనాలని ముందు కండిషన్ పెట్టుకున్నా, తర్వాత హాస్టల్ లో అందరికి తెలిసిపోయి రూం కిక్కిరిసి పోయ్యేలాగా జనం పోగైపోయారు. వార్డన్ కు తెలిస్తే, తన్ని తగలేస్తారని మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది.  

మీకు కూడా, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఆశక్తి ఉంటే, ఒక పని చెయ్యండి. మీ ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆర్పేయండి. టివి చూసే గదిలోకూడా ట్యూబ్ లైట్ కాకుండా, నైట్ బల్బ్ వెలుగులో సౌండ్ ఎక్కువ పెట్టుకుని చూడండి. మా ఊరి ఎమ్మెల్యే మీద ఒట్టు, దడుచుకోకపోతే నన్నడగండి.
Happy Ghost Hunting...
~శశిధర్ సంగరాజు. 

Tuesday, July 19, 2011

బహుశా ...ఇదే కారణమై ఉంటుంది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, రాందేవ్ బాబాల దీక్షలు, ప్రజలు దానికి మద్దతు పలకడం, రాజకీయనాయకులు యథాప్రకారం తమను కాదన్నట్లు అమాయకత్వం నటించడం చూస్తుంటే ఒకవైపు ఆనందం,మరోవైపు చిరాకు వస్తోంది. అవినీతి అన్ని రంగాల్లో ఉన్నా,  రాజకీయనాయకులదే పైచేయి.       నాకెప్పుడూ ఒక అనుమానం వస్తుండేది. రాజకీయ నాయకులు ఈస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు కదా, వీళ్ళకు మనస్సాక్షి ఉండదా?పాపభీతి లేదా? ఇంత మంది ఉసురు పోసుకుని రాత్రిళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకోగల్గుతున్నారు? అని. ఈమధ్యకాలంలో నాకొక దిక్కుమాలిన లాజిక్ తట్టింది. (లాజిక్ దిక్కుమాలిందని ముందే చెప్పాను, నన్ను చీవాట్లు పెట్టి లాభంలేదు.) 

భగవద్గీత సిడిలో ఘంటశాల మాష్టారు స్పష్టంగా చెప్పారు -

                     "ఆత్మ నాశనము లేనిది.
                                 ఆత్మను అగ్ని దహింపజాలదు,
                                 నీరు తడపజాలదు,
                                వాయవు ఆర్పివేయనూ సమర్ధము కాదు " అని.

జనాలు ఎంతమాత్రం వేదాంతమార్గం పట్టారో  తెలియదుకానీ, మన రాజకీయనాయకులు ఈ పాయింట్ మాత్రం బాగా వంటపట్టించుకున్నట్లుంది.ఎలాగూ వీళ్ళు పోయాక ఆత్మ వెళ్ళేది నరకానికే (స్వర్గం గేటు దగ్గరికి కూడా వీళ్ళను రానివ్వరని అరాజ(చ)కీయులకు ముందే తెలుసు). ఆత్మకు పైనచెప్పినట్లు ఏ బెంగా లేదు. ఇంకేం, సిగ్గు, శరం లేకుండా "అనుభవించు రాజా" అని పాడుకుంటూ ఇష్టమొచ్చినట్లు లంచాలు మేసేస్తున్నారు. పాపం, ఈవిషయం తెలియక యమకింకరులు పెద్ద, పెద్ద విగ్గులు అవీ పెట్టుకుని, నల్లరంగు పూసుకుని అమాయకంగా తిరుగుతుంటారు...సినిమాల్లో చూపించినట్లు. "చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత" అన్నట్లు కొంతమందిని పట్టుకుని జైల్లో పారేసినా, అక్కడ కూడా ఇడ్లీలు, వడలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

నా లాజిక్ తో ఏకీభవించేవాళ్ళెవరైనా ఉంటే, నాకు రాయండి.  ఇంతకూ, ఉన్నట్లుండి ఆత్మల మీద పడ్డాడేమిటి అనుకుంటున్నారా? దానికో కధ ఉంది. నా తర్వాత పోస్ట్ లో రాస్తాను.
~శశిధర్ సంగరాజు.

Sunday, June 26, 2011

కాలేజి రోజుల్లో నా కపిత్వం

అవును, కపిత్వం - మీరు చదివింది కరక్టే.
"కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ...." అని పెద్దాయన చెప్పినట్లు, పి.జి. చదివే రోజుల్లో నేను రాసిన ఒక కవిత గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. 

మొదటి సారి కవితలు రాసేవారు చాలామంది ప్రాస కోసం ప్రయత్నిస్తుంటారు. 
ఈ బాపతు ప్రయత్నమే ఎవరో చేసారట 

                     అందమైన మేడ
                     మేడ చుట్టూ గోడ
                     గోడ పక్కన దూడ
                     దూడ కింద పేడ   

ఇలాంటి కవితల పై గరికపాటి నరసింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ "దూడ కింద పేడ కాకపోతే నువ్వుంటావా?" అని చురకలంటించారు. 

ఇక నా కవిత విషయానికొస్తే...నేను నెల్లూరు జిల్లా కావలి లో మాస్టర్స్ చేసాను. అప్పటివరకు, కడప లో నా చదువు సాగింది.మరీ మిలిటరీ రూల్స్ కాకపోయినా, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్ గానే ఉండేవారు. కావలి లో హాస్టల్ మకాం.పై ఊర్లో ఉండి చదవడం, ఎప్పుడూ ఏమి అవసరం వస్తుందో అని ఇంట్లో వాళ్ళు అవసరానికి మించి పంపే డబ్బులు. ఇంకేముంది, అసలే కోతి, ముల్లు గుచ్చుకుంది, నిప్పు తొక్కింది అన్నట్లుగా ఉండేది వ్యవహారం.
పుస్తకాలు చదవడం, ఊర్లో కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం,వెంటనే చూసేయ్యడం మా దినచర్యగా మారింది. 

1993 ప్రాంతంలో కావలిలో కరవు వచ్చింది. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంతకమునుపు 30 సంవత్సారాల నుంచి అంత కరవు ఎప్పుడూ రాలేదని స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారు. 
నీటి ఇబ్బంది తో పాటూ, చదువు కూడా సరిగ్గా సాగడం (?) లేదని, మేము నలుగురం స్నేహితులం హాస్టల్ నుంచి జనత పేట కు మకాం మార్చాం. కానీ అక్కడ కూడా నీటి ఎద్దడే. పాపం, మహిళలు బిందెలు తీసుకుని రైల్వే ట్రాక్ దాటి కలుగోల్లమ్మ గుడి దాక మంచి నీళ్ళకోసం వెళ్ళేవారు. మేము అద్దెకు దిగిన ఇంట్లో బావి ఉన్నా, అదికూడా దాదాపుగా ఎండిపోయింది. కాకపోతే, చదువుకునే కుర్రాళ్ళు ప్రతిరోజూ స్నానం చెయ్యాలనే రూలేమీ లేదు కాబట్టి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. మా రూమ్మేటు ఒకతను కంద పద్యాలు రాసేవాడు.వ్యాకరణం పై నాకంత పట్టు లేకపోవడం వల్ల, నేను మామూలు కవితలకు సెటిల్ అయిపోయాను. 
మా బావి లో నీటి ఊట లేకపోయినా, అప్పటికే తెలుగు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడం వల్ల,  నాలో కవిత్వం పొంగడం మొదలై...ఇలా తయారైంది.
(మీకు ఓపిక ఉంటె మధ్య మధ్య లో వహ్వా, వహ్వా అనుకోవచ్చు ..నేనేమీ ఫీల్ అవను)

                     ఆకాశం లో నల్లని మబ్బులు
                     పక్కింటి మేడ పై తెల్లని సుబ్బులు
                     మబ్బులు కనిపిస్తే వర్షం
                     సుబ్బులు కనిపిస్తే హర్షం
                     ఎండిన కావలి జనాల్ని మబ్బులు  కరుణించేదేప్పుడో 
                     మండే నా హృదయాన్ని సుబ్బులు కరుణించేదేప్పుడో 
      
ఈ కవిత్వం ఆనోటా, ఈనోటా పడి హాస్టల్ లోని మా మిత్రబృందానికి కూడా చేరిందనీ, దానికి వాళ్ళు యథాశక్తి ప్రాచుర్యం కల్పించారనీ తర్వాత తెలిసింది.


షరా: పై కవితలో సుబ్బులు అనే శాల్తీ ఎవరూ లేరనీ, కేవలం ప్రాస కోసం పడ్డ తాపత్రయం మాత్రమేననీ, మానస ధియేటర్ కాంటీన్ లో దొరికే వేడి, వేడి పులిబొంగారాల మీద ఒట్టు. (ఇక్కడ మాత్రం ముళ్ళపూడి వారిని చదివి వాతలు పెట్టుకుంటున్నా..ఆయన కూడా రాసేవారుగా..."భట్టు గారి అట్టు మీద ఒట్టు" అని...అదన్నమాట.)


మీరు కూడా ఈ మాత్రం కపిత్వం వెలగబెట్టి ఉంటే...నాతో పంచుకోండి.
~శశిధర్ సంగరాజు.

Wednesday, May 18, 2011

సూరీడు ఎక్కడ?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించే రోజు వరకూ, ఏ దినపత్రికలో (ముఖ్యంగా ఈనాడులో ) రాజశేఖర్ రెడ్డి మీద కార్టూన్ వచ్చినా, పక్కనే, తెల్లటి జుట్టుతో, పొట్టిగా, లావుగా ఉన్నవ్యక్తి బొమ్మ తప్పకుండా ఉండేది. ఆయనే, రాజశేఖర్ రెడ్డి నమ్మినబంటు సూరీడు.కడప జిల్లాకే చెందిన సూరీడు (పూర్తి పేరు సూర్యనారాయణ రెడ్డి అనుకుంటా..) వైఎస్సార్ వెనుక ఫైళ్ళు పట్టుకొస్తూనో, మరోటో 
చేస్తూ వెన్నంటి ఉండేవాడు. కొన్ని టీవీ చానళ్ళ (బహుశా,టివి 9) ఇంటర్వ్యూ లలో ఆయనకు భోజనం వడ్డిస్తూ కూడా చూసినట్లు గుర్తు.

సర్వశిక్ష అభియాన్ కేసులో సూరీడు పేరు ప్రముఖంగా వినిపించింది. అన్ని కేసుల్లోలాగే, ఇందులో కూడా ఏమీ తేలలేదనుకోండి.అది వేరే విషయం.

వైఎస్సార్ అకాల మరణం తర్వాత సూరీడు కూడా కనుమరుగైపోయాడు. కానీ, ఇటీవల కడప ఉపఎన్నికల ప్రచారంలో కానీ,జగన్ ఘనవిజయం సాధించినప్పుడు కానీ ఈయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. పోనీ, జగన్ తో పొరపొచ్చాలేమైనా వచ్చాయనుకున్నా, స్వయానా  వైఎస్ తమ్ముడు వివేకా వైపుకూడా కనిపించలేదు.

మీరు గానీ ఎక్కడైనా టివీల్లో చూస్తే చెప్పండి. నాకు ఆయనతో పనేంలేదు కానీ, జస్ట్ క్యూరియాసిటీ...  అంతే.
~శశిధర్ సంగరాజు.

Saturday, May 7, 2011

కెంటకీ డర్బీ - మా ఊళ్ళో గుర్రప్పందేలు

మే 7 న (శనివారం) మా ఊర్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గుర్రప్పందేలు జరిగాయి. చర్చిల్ డౌన్స్ అనే ప్రాంతం లో జరిగిన ఈ రేసును  "డర్బీ" అంటారు. చిన్న, చితకా రేసులు దాదాపు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉన్నా, ఈ రేసుకు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా లో ప్రతిసంవత్సరం మూడు పెద్ద రేసులు జరుగుతాయి. వీటిని "ట్రిపుల్ క్రౌన్" రేసులంటారు. లూయివిల్ లో జరిగిన "డర్బీ" రేసు,  "ట్రిపుల్ క్రౌన్" లో మొదటిది. రెండోది, "ప్రీక్నెస్ స్టేక్స్"  బాల్టిమోర్/మేరీలాండ్ లో జరుగుతుంది. మూడో రేస్ "బెల్మొంట్ స్టేక్స్" న్యూయార్క్ లో జరుగుతుంది. అక్కడితో  ఈ సంవత్సరానికి "ట్రిపుల్ క్రౌన్" రేసులు ముగుస్తాయి. 
చర్చిల్ డౌన్స్



ఈ బ్లాగ్ చదివేవాళ్ళలో జంతు ప్రేమికులేవరైనా ఉంటే "నోరులేని జీవాలను హింసిస్తున్న దుర్మార్గులు" అని నా మీద అలగక్కరలేదు. ఈ రేసులు ఇప్పుడేదో కొత్తగా మొదలైనవికావు. కెంటకీ డర్బీ 1875 లో, ప్రీక్నెస్ స్టేక్స్ 1873 లో, బెల్మొంట్ స్టేక్స్ 1867 లో మొదలైయ్యాయి. లక్షలాది మంది చూసి ఆనందిస్తే, మిలియన్ల కొద్ది డాలర్లు చేతులు మారతాయి. ఈ రేసులన్నిట్లో మూడు సంవత్సరాల వయసున్న గుర్రాలే పాల్గొంటాయి. పేరుకు మూడు సంవత్సరాల వయసైనా, చూడడానికి ఎత్తుగా, పెద్దగా హుందాగా ఉంటాయి. ఫినిషింగ్ లైన్ వైపు దూసుకొచ్చే గుర్రాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. 
దూసుకుపోతున్నజాకీలు 


ఇక్కడో విషయం గమనించాలి, లింగవివక్ష ఎక్కడైనా ఉందేమో గానీ గుర్రప్పందేల్లో మాత్రం లేదని చెప్పగలను. సరిగ్గా డర్బీ జరగడానికి ఒక రోజు ముందు, లూయివిల్ లో "కెంటకీ ఓక్స్" అనే రేసు జరుగుతుంది. ఇందులో అన్నీ ఆడ గుర్రాలే పాల్గొంటాయి.


 ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా కొన్ని గుర్రాలమీద పందెం కాసాను. గతంలో ఎంతో, కొంత అనాలిసిస్ చేసి, గుర్రాల గురించి తెలుసుకుని మరీ పందేలు పెట్టేవాన్ని. కొన్నిసార్లు కొంత చిల్లర కూడా వచ్చినట్లు గుర్తు. అదేం విచిత్రమో, నేను పందెంకాసిన గుర్రాలు, రేసు మొదట్లో గుర్రాలుగానే పరుగు మొదలెట్టినా, చివరకొచ్చేసరికి గాడిదల్లాగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రతిసారి నాకు చేతి చమురు వదలడమే. ఆడిన ప్రతిసారి ఓడిపోయేటప్పుడు, పందేలు కట్టడ మెందుకు అంటారా? అదో తుత్తి.  

వచ్చేసంవత్సరానికైనా "ఆశ్వ హృదయం" గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతం లో నకులుడికో, సహదేవుడికో ఈ విద్య తెలుసని చదివాను. చూద్దాం అదృష్టం ఎలాఉందో. 
~శశిధర్ సంగరాజు.

Sunday, April 24, 2011

అర్జునుడా? అభిమన్యుడా?

 కడప లోక్ సభకు, పులివెందుల అసెంబ్లీ కి ఉప ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది . కాంగ్రెస్, తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరా హోరీ గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎప్పుడు చూసినా, కరవుతో, వర్షాభావంతో  అల్లాడే కడప ప్రజలపై ఇప్పుడు ధనవర్షం కురుస్తోంది. ఓటుకు ఐదు వేల రూపాయలవరకు ముట్టచెపుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలను రంగం లోకి దింపింది. ఇక విమర్శలు, ప్రతివిమర్శలకు అంతే లేదు. ఈ నేపధ్యంలో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఊహాత్మకమైన పరిశీలన మాత్రమే. ఫలితాలు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. 
ముందుగా పులివెందుల అసెంబ్లీ స్థానం: ప్రదానం గా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిల మధ్యనే.తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే, ఎంతో కుటుంబ నేపధ్యం, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడిన ఎస్వీ సతీష్ రెడ్డి కే ఇక్కడ విజయం దక్కలేదు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బిటెక్ రవికి ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం నమ్మశక్యం కాని విషయం. 

ఇక విజయమ్మ పరిస్థితి కొస్తే, ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా మహిళలు నీరాజనాలు పడుతున్నారు. గతంలో ఒక్కసారి కూడా ప్రచారానికి రాని ఆమె, మండుటెండల్లో వీదుల్లోకి రావడంతో మహిళల్లో  సానుభూతి కూడా పుష్కలంగా ఉంది. కానీ, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మహిళా సానుభూతి ఓట్లతో ఒకవేళ గెలిచినా, పులివెందుల ప్రజలకు వాళ్ళ పనులు జరగాలంటే, మళ్ళీ వివేకానందరెడ్డి సహాయం తప్పనిసరి. పైగా, 
వైఎస్ మరణం తర్వాత, అన్ని పార్టీల మద్దతుతో గెలుపొందిన విజయమ్మ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు (మీడియా వార్తల ప్రకారం). అప్పుడంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు "మీది తెనాలే..మాది తెనాలే" అని పాడుకుంటూ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు విజయమ్మ, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ కు  బద్దవ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు కాబట్టి, ఒకవేళ గెలిచి అసెంబ్లీ, మెట్లు ఎక్కకపోతే, ప్రతిపక్షాలతో పాటు, కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించక మానదు. ఒకవేళ, అసెంబ్లీ కి వెళ్ళినా ప్రజా సమస్యలపై ఈమె ఏమాత్రం పోరాడుతారో అనుమానమే. (ఇప్పుడు అసెంబ్లీ లో ఉన్నోళ్ళు ఏమి పొడిచేసారని నన్ను అడక్కండి...నా దగ్గర సమాధానం లేదు) 
వివేకానంద రెడ్డి విషయానికొస్తే, మొన్నేదో అసెంబ్లీ లో గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని ఒక్కటిచ్చుకున్నాడని పేపర్లలో వచ్చింది గానీ, స్వతహాగా ఈయన సౌమ్యుడు. పులివెందుల ప్రాంతంలో అందరికి అందుబాటులో ఉంటాడనే మంచి పేరు ఉంది. (ఈయన లోగడ కడప ఎంపి గా చేసినప్పుడు అందరూ అంటుంటే, విన్నాను. ) మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చెయ్యడం ఒక విధంగా ప్లస్ పాయింట్ అవుతోంది. 

Bottom Line: తక్కువ మెజార్టీతో అయినా సరే, పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గెలుస్తాడని నా అంచనా. 
కడప పార్లమెంటు స్థానం: ఇక్కడ, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్ర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జగన్, తెలుగుదేశం నుంచి మైసూరారెడ్డి బరిలో ఉన్నారు. అధికార పార్టీ, అధికారుల అండదండలు డిఎల్ కు కలిసివచ్చే అంశం. కాకపొతే, ఈయన సాదారణంగా మైదుకూరు నియోజక వర్గానికి పరిమితమైన నాయకుడు. జిల్లా మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనే దానిమీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పిఆర్పి, కాంగ్రెస్ లో విలీనం కావడంవల్ల, ఆ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా కలిసొస్తాయి. ఇక, మైసూరారెడ్డి ది మాత్రం ఎదురీతే. స్వతహాగా, మంచి నాయకుడనే పేరు, ప్రజల్లో సానుభూతి (గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి)ఉంది. అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది వేచిచూడాల్సిన విషయం. 
ఇక జగన్, ఈయన,  తాను సియం అయితే...ఏ ఫైల్ మీద ముందుగా సంతకం పెడతాడో అన్న విషయం పక్కనపెట్టి, ప్రజలకు ఏమిచేస్తాడో చెపితే ఇంకొన్ని ఓట్లు ఎక్కువ రాలే అవకాశం ఉంది.కాంగ్రెస్ పన్నిన పద్మవ్యూహం లో అభిమన్యుడవుతాడో, అర్జునుడవుతాడో మే 13 దాకా వేచిచూడాల్సిందే.  

Bottom Line: జగన్ వర్గం డప్పు కొట్టుకుంటున్నట్లు, మూడులక్షల మెజార్టీ రాదు కానీ, జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువున్నాయి. గతంలో కన్నా మెజార్టీ తగ్గొచ్చు. అయినా, ఎంపి గా పదవీ కాలం ఉన్నప్పుడు, రాజీనామ చేసి, మళ్లీ ఎంపి గా గెలిస్తే మాత్రం ఒరిగేదేముంటుంది (సొంత గుర్తు మీద గెలిచానన్న తుత్తి తప్ప).
రిగ్గింగ్ జరక్కుండా అడ్డుకుని, ప్రజలను స్వేచ్చగా ఓట్లు వేసుకోనిస్తే ఫలితాలు తారుమారైయ్యే అవకాశం ఉంది. కానీ, కడప లో అది సాధ్యమైయ్యే వ్యవహారం కాదు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో. 
ఒకవేళ, రెండు సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి మాత్రం ఖాయం. 

Wednesday, March 16, 2011

పట్టుకుంటారా...వదిలేస్తారా?

ఇరానీ హోటల్ లో ఇద్దరు:
మొదటివ్యక్తి: తెలంగాణా ఉద్యమం, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం, జగన్ పార్టీ, జపాన్ సునామీ   ఈ వార్తల్లో పడి ఈ మధ్య పట్టించుకోలేదు కానీ, భాను ఏమైయ్యాడ్రా?

రెండోవ్యక్తి: ఏ భాను?

మొదటివ్యక్తి: చూసావా, నువ్వుకూడా మర్చిపోయావ్!

రెండోవ్యక్తి: ఆ..ఆ...గుర్తొచ్చింది. మద్దులచెర్వు సూరి ని  హత్యచేసాడని అనుమానిస్తున్న భాను గురించేగా...అవున్రా.. ఏమైయ్యాడంటావ్?

మొదటివ్యక్తి: ఎక్కడో మన పొలీసు బాబాయిల ప్రతిభ చూసి నవ్వుకుంటూ ఉంటాడు.

రెండోవ్యక్తి: పాపం, సూరి పోయి వంద రోజులు దాటినట్లుంది.

మొదటివ్యక్తి: అవును. ఇదంతా చూస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తోంది. మేము కాలేజ్ కు వెళ్ళే దారిలో ఒక గోడ మీద ఎవరో ఎర్ర అక్షరాలతో రాసారు "పోలీసుల్లారా! బుర్ర ఉన్నది టోపీ లు పెట్టుకోవడానికి కాదు. ఆలోచించడానికి" అని. అది నిజమనిపిస్తోంది.

రెండోవ్యక్తి:  ఏమోరా బాబు! చూస్తుంటే సూరి సంవత్సరీకానికైనా పట్టుకుంటారా? లేకపోతే,  వాడి పాపాన వాడే పోతాడని వదిలేస్తారా అనిపిస్తోంది.

~శశిధర్ సంగరాజు. 

Thursday, March 3, 2011

కుయ్యో ...మొర్రో

అవును. ప్రస్తుతం నా పరిస్థితి (అంటే, నా ఒక్కడిదే కాదు, అమెరికాలో అందరిదీ) అలాగే ఉంది మరి.
పెట్రోల్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం లో విప్లవం పుణ్యమా అని పెరగడం మొదలెట్టిన పెట్రోల్ ధరలు రెండు డాలర్ల నుంచి పెరుగుతూ వచ్చి ఈరోజుకు మూడున్నర డాలర్లకు చేరుకుంది. 

దురుద్రుష్టం కొద్దీ, మా ఆఫీసు పక్కనే గ్యాస్ స్టేషన్ (అమెరికాలో పెట్రోల్ బంకును అలాగే పిలుస్తాం) ఉంది. నా సీట్ లోంచి చూస్తే స్టేషన్ ముందున్న  పెట్రోల్ ధరల బోర్డు కనిపిస్తుంది. హనుమంతుడి తోకలాగా రోజు, రోజుకు పెరిగే ధరలు చూడడం, గుండెలు బాదుకోవడమే పనిగా తయారైంది నాకు. నాకు తెలిసి చాలామంది, ఈ పెట్రోల్ వేడి తట్టుకోలేక వీకెండ్ ప్రయాణాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ ప్లాన్ చేసుకుంటున్నారు. ట్యాంక్ నింపితే పట్టుమని వారం రోజులు కూడా రావడం లేదు. 

ఈ పరిస్థితి ఇలాగే సాగితే, కార్లు మానేసి, సైకిల్ కొనుక్కోవడమో, లేకపోతే క్లింట్ ఈస్ట్ వుడ్ సినిమాల్లో లాగా గుర్రాలపై తిరగడమో తప్పేట్లు లేదు.

మొన్నీ మధ్య గుడికి వెళ్ళినప్పుడు దేవుడ్ని ప్రార్థించా.."భగవంతుడా! నా జీవితం రొటీన్ గా తయారైంది. ఏదైనా మార్పు చూపించు" అని. ఆయన ఏం విన్నాడో, ఏమో, ఉదయానికల్లా పెట్రోల్ రేట్లు పెంచేసాడు. ఈ సారి పంతులుగారితో అయినా రికమెండ్ చేయించాలి. 
~శశిధర్ సంగరాజు.  

Friday, February 25, 2011

నిష్కల్మష మూర్తి కి అశ్రునివాళి

ఈ మధ్య పనిఒత్తిడితో తరచూ బ్లాగ్ లో రాయడం కుదరలేదు. కానీ ఆంధ్ర రాజకీయాలు మాత్రం కొద్దో గొప్పో ఫాలో అవుతున్నాను. రాజకీయాలు పక్కన పెడితే, నన్ను బాగా కదిలించింది ముళ్ళపూడి గారి మరణం.

ఇండియా ట్రిప్ కు వెళ్ళినప్పుడు తెలుగు పుస్తకాలు కొని తెచ్చుకోవడం మామూలే. ఇటీవల ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా కోతికొమ్మచ్చి - 2  కొన్నాను. మొదటి భాగం స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు. పనిఒత్తిడి ఎక్కువైనా, మనసు బాలేకపోయినా బుడుగు - సీగానపెసూనంబలు, కోతికొమ్మచ్చులు నాలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంటాయి. అలాంటి మంచి  మనిషి మన మధ్య లేరనే విషయం నిజం కాకపొతే బాగుండనిపిస్తోంది.

టివి కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, సభల్లో ప్రసంగించినా ఒక్క పొల్లు మాట ఆయన నోటి నుంచి దొర్లిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. మాటల విలువ తెలిసిన మహనీయుడు. తమకు అవార్డులు రాకపోతే ఎదుటివాళ్ళ మీద దుమ్మెత్తి పోసే సినీరంగంలో ఉంటూ కూడా, తమకు "పద్మాలు" రాలేదని పన్నెత్తు మాట కూడా అనని సంస్కారి. ప్రాణ మిత్రుడు బాపుగారితో కలసి ఎన్నో సిల్వర్ జూబిలీ హిట్లు ఇచ్చినా, ఏనాడూ, ప్రచార ఆర్భాటానికి వెళ్ళని నిగర్వి.

"జాతస్య మరణం.." నిజమైనప్పటికీ, మరణం ఇలాంటి వారి విషయంలో వీలున్నంత నిదానంగా వస్తే బాగుంటుందేమో.  జీవించినంత కాలం అందరినీ నవ్వించిన పెద్దాయన ఆత్మకు శాంతి కలగాలనీ, ఆయన బహిప్రాణం బాపుగారికి ఈ కష్టకాలంలో  వీలున్నంత త్వరగా స్వాంతన చేకూరాలని ఈ బ్లాగ్ ముఖంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

~శశిధర్ సంగరాజు. 

Sunday, February 6, 2011

మనిషివా....చిరంజీవివా?

ఇరానీ హోటల్ లో ఇద్దరి సంభాషణ...

మొదటివాడు: ఏరా...వార్తలు ఫాలో అవుతున్నావా?
రెండోవాడు: అవుతున్నానులే...ఏం?
మొదటివాడు: పీఆర్పీ...కాంగ్రెస్...
రెండోవాడు: ఆ విషయం వదిలైయ్యరా బాబూ..కడుపులో దేవేసినట్లుంది.
మొదటివాడు:అదికాదురా..ఏంటీ దారుణం అని.
రెండోవాడు: అదంతే లేరా...సైడ్ కాల్వలన్నీ వెళ్లి మెయిన్ డ్రైనేజ్ లో కలవాల్సిందే.
మొదటివాడు:జనాలేమనుకుంటారో అని కూడా లేకుండా...
రెండోవాడు: జనాలేమనుకుంటారూ .. " మా చిరు వచ్చేసాడ్రా...అలాంటిలాంటి మార్పు కాదు....అవినీతిని  కడిగేస్తాడు...సామాజిక న్యాయం తెస్తాడు...చూస్తుండు" అని నిన్న మొన్నటి దాకా ఊగిపోయిన మా ఎదురింటి బాబాయి ...ఉదయాన్నే ఎవరినో తిడుతున్నాడు..."నువ్వు మనిషివా...చిరంజీవివా?" అని.
మొదటివాడు: ఖర్మ గాకపోతే...ఎందుకొచ్చిన దూల.కొన్ని రోజులు పోతే మెగాస్టార్ ను దగాస్టార్ అని కూడా అంటారేమో...


~శశిధర్ సంగరాజు.

Saturday, February 5, 2011

పీఆర్పీ + కాంగ్రెస్ = ఇంకో చారిత్రక తప్పిదం (?)

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెయ్యడం దాదాపుగా ఖరారైంది (మీడియా వార్తల ప్రకారం)..
విలీనం మరో  చారిత్రక తప్పిదం అవుతుందని నా నమ్మకం. ఈ నేపధ్యం లో నా అభిప్రాయాలు :


ఆగుష్టు 26 , 2008 తిరుపతి లో మెగా స్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నాడు. దాదాపు అంతకు నెల రోజుల ముందరనుంచే మీడియా లో పార్టీ జెండా, అజెండాల గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఆంధ్ర రాజకీయాల మీద ఆశక్తి తో నేను కూడా అమెరికా నుంచి ఈ డెవలప్మెంట్ల ను గమనిస్తూ వచ్చాను. ఒక విధంగా సంతోషపడ్డాను కూడా. ఎందుకంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ఇంకో రాజకీయ పార్టీ రాబోతోందని. అదీ, అత్యధిక ప్రజాదరణ ఉన్న చిరంజీవి పెట్టబోయే పార్టీ. ఇక ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మురిసి ముక్కలైపోయాను.అమెరికా నుంచి కొందరు ఉత్సాహవంతులు పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి తరలి వెళ్ళారు.  అంతటి అద్రుష్టం, అవకాశం నాకు లేకపోయిందే అని కొంత బాధపడ్డ మాట కూడా నిజం. స్వర్గీయ ఎన్టీయార్  1983 లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను బాగా చిన్నవాణ్ణి. అందరూ అనుకుంటుంటే వినడమేకానీ, ఈ రాజకీయ పార్టీలు, ఎలెక్షన్ లు ఆంటే ఏమిటో అర్థం అయ్యేది కాదు. సరే, అప్పుడెలాగు త్రిల్ మిస్ అయ్యాము ,  ఈయనేదో పొడిచేస్తాడు కదా అని ఎదురుచూడడం మొదలెట్టాను. 


పార్టీ పెట్టిందగ్గర నుంచి, " నానాటికి తీసికట్టు నాగం భొట్లు" అన్నట్లు తయారైయాడు అన్నయ్య. ఏ విషయంలో క్లారిటీ లేదు (ఇప్పుడు పీఆర్పీని, కాంగ్రెస్ లో  విలీనం చెయ్యడం మినహా). తనను చూడడానికోచ్చే  జనాన్ని చూసి మురిసి పోవడం తప్ప.ఇక పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ పార్టీని, నాయకులను అమ్మనాబూతులు తిట్టేసాడు. పార్టీ పెట్టింతర్వాత గట్టిగా రెండు,మూడు సంవత్సరాలైనా నడపడం చేతకాలేదు. తమిళనాడు లో విజయకాంత్ ను చూడండి ఎలా రాజకీయాలకు ఎదురీదుతున్నాడో. సాటి నటుడ్ని చూసినా చిరుకు జ్జ్ఞానోదయం కలగాలి.


కేవలం జగన్ తాకిడిని తట్టుకోవడానికి తప్ప, కాంగ్రెస్ కు చిరంజీవి వల్ల ఒనగూడే లాభం ఏమాత్రం లేదు. ఒకవిధంగా నష్టమే. అదెలాగంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరంజీవికి కొత్త అల్లుడి మర్యాదలు చేస్తే, ఇంతవరకూ పార్టీని పట్టుకు వేలాడుతున్న సీనియర్లు అలగడం ఖాయం.  వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి చిరంజీవి ని పక్కన పెట్టడమో, ప్రాధాన్యత తగ్గించడమో చేస్తే,ఇక పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రయోజనం ఏముంది. మీడియా లో ఇంకో రకం పుకార్లు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి చిరంజీవిని సీయమ్ చేస్తారని. ఎందుకయ్యా ఆంటే , జగన్ ను ఎదుర్కునేందుకు సమర్ధుడైన నాయకుడి అవసరం కనుక. చిరంజీవి సమర్దుడే అయితే ఈసరికి ముఖ్యమంత్రే అయ్యేవాడు. ఇక, ప్రతిదానికి అల్లు అరవింద్ వైపు చూసే చిరంజీవి, జగన్ ను ఎదుర్కుంటాడనేది అర్థం లేని వాదన. 


కొంతమంది పీఆర్పీ నాయకులు, రాజకీయాల్లో ఇలాంటి విలీనాలు తప్పు కాదు, విజయశాంతి "తల్లి తెలంగాణా పార్టీ"ని తెరాస లో విలీనం చెయ్యలేదా అని లా పాయింట్లు లాగుతున్నారు. ఆంటే, చిరంజీవిని , విజయశాంతిని ఒక గాటన కట్టేస్తారా? ఒక రకంగా విజయశాంతి నయం. తెలంగాణా సాధనకు పోరాడుతున్న ఇంకో పార్టీ లో   విలీనం చేసింది. కమ్యునిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ను, టిడిపి ని తిట్టి తర్వాత అవసరానికి వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదా అని మరో వాదన. రాష్ట్ర రాజకీయాల్లో,కమ్యునిస్ట్ పార్టీ లు ప్రధాన పార్టీలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. అలా ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. కానీ, అభిమానులు పీఆర్పీని, కాంగ్రెస్, టిడిపి లకు ప్రత్యామ్నాయంగానే చూసారు. ఇప్పుడు పీఆర్పీ జండాలు మోసిన అభిమానుల పరిస్థితేంటి. ఆస్తులమ్ముకుని, 2009 లో పీఆర్పీ తరుఫున పోటీచేసిన వాళ్ళ పరిస్థితేంటి.విలీనం అంటూ జరిగితే (జరగడం అనివార్యం...ఈ సరికే పీఆర్పీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పదవుల వాసన చూపించేసింది...వాల్లెలాగూ పదవులకు మొహం వాచే ఉన్నారు.) పీఆర్పీ వీళ్ళందరికీ ముందుగా జవాబు చెప్పాలి. 

ఒకవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో  2 జి స్పెక్ట్రం అవినీతి, ఎమ్మార్ కుంభకోణాలు ఎదుర్కుంటున్న పరిస్తితుల్లో, కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, వెళ్లి, వెళ్లి కాంగ్రెస్ లో కలవడం నిజంగా మూర్ఖత్వమే. అయినా, అంత తొందరేమొచ్చింది. పదవుల పిచ్చ కాకపొతే.

ప్రజలను, అభిమానులను వెర్రివాళ్ళను చేసిన ఈ మొత్తం డ్రామాలో బంపర్ ఆఫర్ కొట్టింది అల్లు అరవింద్. మొన్న ఎలెక్షన్లలో ఓడిపోయినా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా, చిరంజీవి బామ్మర్ది అయిన కారణంగా కేంద్రంలో మంత్రి పదవి వచ్చేలాగుంది. మొత్తానికి, చిరంజీవి పెట్టిన ఈ పీఆర్పీ దుకాణం త్వరలో ఎలాగూ మూసేస్తారు. అదేదో కథలో చెప్పినట్లు "ఏనుగు ఏదో చేస్తుందని జనాలు ఎగబడితే, వారికి నిరాశ ఎదురైనట్లు ...." పీఆర్పీ ప్రస్థానం ఈ రకంగా తుస్సుమంది. ముందుముందు, చిరంజీవి & కో ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాలో. చూద్దాం.


~శశిధర్ సంగరాజు.

Thursday, January 20, 2011

సింహ Vs పరమవీర చక్ర

ఇంతలో ఎంత తేడా...
సింహ: "చూడూ...ఒకవైపే చూడూ...రెండో వైపు చూడాలనుకోకూ..తట్టుకోలేవూ..మాడిపోతావ్" 
            (ప్రేక్షకుల చప్పట్లతో ధియేటర్ లు మారుమోగాయి)
పరమవీరచక్ర : "చూడూ...వాల్ పోస్టర్ మాత్రమే చూడూ..సినిమా చూడాలనుకోకూ...చచ్చిపోతావ్ "
          (ప్రేక్షకులు బయటనుంచే పారిపోవడంతో ధియేటర్ లు చిన్నబోయాయి)
~ శశిధర్ సంగరాజు.

Saturday, January 15, 2011

వెన్నుపోటు - కత్తిపోటు

ఒక ఇరాని హోటల్ లో ఇద్దరి సంభాషణ :

మొదటివాడు  -  మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి, తన భర్త హత్య వెనుక చంద్రబాబు       హస్తం ఉందని ఆరోపించిందిట. విన్నావా?
రెండోవాడు - ఆ..విన్నాలే...ఎవరు నమ్ముతారూ.
మొదటివాడు - ఏం?
రెండోవాడు - మనోడి చరిత్రలో వెన్నుపోటు ఉందికానీ, కత్తిపోటు లేదు. 
మొదటివాడు -??
(కేవలం సరదాకే, ఎవరినీ నొప్పించాలని కాదు)
~శశిధర్ సంగరాజు.

Wednesday, January 12, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలు 
~ శశిధర్ సంగరాజు

Tuesday, January 11, 2011

రుద్రాక్షలు - సద్గురు జగ్గీ వాసుదేవ్

గత సంవత్సరం (జూలై 2010 ) ఇండియా కు వెళ్ళినప్పుడు, టివీల్లో రుద్రాక్షల గురించి ప్రకటనలు చూసాను. హైదరాబాద్, అమీర్ పేట్ ప్రాంతంలో ఏకంగా ఒక షాపే ఉంది(ట). నేను వెళ్ళలేదు. అంతకముందు రుద్రాక్షల గురించి కొంత అవగాహన ఉన్నా, పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ ప్రకటనలు, అందులో వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత, కొంత ఆసక్తి  పెరిగింది. 

 ఇండియా ట్రిప్ లో ఉన్నప్పుడే, అమెరికాలోని మిత్రుడొకరు,  "మా  బంధువులు  "ఏకముఖి రుద్రాక్ష" ఇస్తారు, తీసుకురాగలరా?"  అని అడిగారు. "దానికేం భాగ్యం, తప్పకుండా" అని నేను కూడా ఒప్పుకున్నాను. ఆ రకంగా "ఏకముఖి రుద్రాక్ష" ప్రత్యక్షంగా చూసే అద్రుష్టం కలిగింది. 


సరే, రుద్రాక్షలు ధరించడం వల్ల లాభాలు, నష్టాలు పక్కన పెడితే, ఈ మధ్య "యూట్యుబ్" లో వెతుకుతుంటే, సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు రుద్రాక్షల గురించి చెప్పిన వీడియో కనిపించింది. రెండు భాగాలుగా ఉన్న ఈ వీడియో, రుద్రాక్షల గురించి నాకు తెలియని కొన్ని విషయాలు చెప్పింది. 

ముఖ్యంగా, రెండవ లింక్ లో, రుద్రాక్షమాలను ఉపయోగించి మనం తాగే నీళ్లు మంచివో, కాదో తెలుసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. అడవుల్లో సంచరించే సాధువులు, సన్యాసులు రుద్రాక్షమాలను ఉపయోగించి, నీటిచెలమల్లోని నీరు తాగడానికి శ్రేయస్కరమో, కాదో తెలుసుకునేవాళ్ళట. ప్రస్తుతం నా దగ్గర రుద్రాక్షమాల లేదు కాబట్టి పరీక్షించి చూడలేను. 

రుద్రాక్షలు వాడమనో, వాడితే మంచిదనో, మరోటో ప్రచారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరిష్టం వారిది. 
నా ఆసక్తి అంతా, రుద్రాక్షమాల టెక్నిక్ ఉపయోగించి ఈ మధ్యకాలంలో మినరల్ వాటర్ అని చెప్పి మురికి నీళ్ళు  అంటగడుతున్న దొంగ వెధవల ఆటకట్టించొచ్చు కదా అనే. (సాధ్యమో కాదో తెలియదు..ఒక ఆలోచన మాత్రమే)


వీడియో లింకులు కింద ఇస్తున్నాను. మీరు రుద్రాక్షలు వాడుతున్నట్లయితే మీ అనుభవాలు నాతో పంచుకోండి (అభ్యంతరం లేకపోతేనే సుమా!)


Rudhraksha - Part 1

Rudhraksha - Part 2 


~శశిధర్ సంగరాజు

Sunday, January 2, 2011

కెలైటోస్కోప్ - రంగుల హరివిల్లు

మా ఊర్లో (లూయివిల్, కెంటకి) క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా " కెలైటోస్కోప్" అనే ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఒహాయో నది వడ్డున ఉన్న "గాల్ట్ హౌస్" ప్రాంగణం లో ఈ ప్రదర్శన జరిగింది. నేను మా శ్రీమతి, పిల్లలు (సాకేత్,శ్రియ) తో కలసి వెళ్లాను. వేళ్ళు కొంకర్లు తిరిగే చలిలో కూడా నిజంగా చూడాలనిపించే రంగుల హరివిల్లు ఈ కార్యక్రమం. 


పురాతన చైనీస్ ఆర్ట్ స్పూర్తితో ఏర్పాటు చేసిన శిల్పాలు(?) లోపలకు అడుగు పెట్టగానే మమ్మల్ని కట్టి పడేశాయి.
 దూరం నుంచి చూడగానే ఈ ఆకృతులు గాజు పలకలతో చేసారేమో అనిపించాయి. తర్వాత నిర్వాహకులు చెప్పారు, ఇవి పూర్తిగా ప్రత్యేకమైన, సిల్క్ లాంటి, రంగు రంగుల బట్టలతో చేసారని. బట్టల వెనకాల నుంచి అమర్చిన కలరఫుల్ లైట్ల కాంతులు బొమ్మలకు కొత్త అందాలనిచ్చాయి.
 క్రిస్మస్, న్యూ ఇయర్ థీమ్ లతో దాదాపు 25  అంశాలను ప్రదర్శించారు. ప్రతి అంశంలోనూ, చిన్న పిల్లలకు ఆసక్తి కరంగా ఉండడానికి, కొన్ని పజిళ్ళను ఏర్పాటు చేసారు. మా సాకేత్ అన్ని పజిళ్ళను పూర్తిచేయ్యాలని పరుగులు పెట్టాడు. 
 పజిళ్ళను సకాలంలో పూర్తిచేసిన పిల్లలకు చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తారు. సాకేత్ కూడా కొన్ని బహుమతులు గెలుచుకున్నాడు. కొన్ని ఆకృతులు దాదాపు 24  అడుగుల పొడవుకూడా ఉన్నాయి.
 ఈ ఫ్లవర్  ఎగ్జిబిట్ సన్నటి ఫ్రేం మీద అమర్చారు. మంచి రంగుల కలయికతో పాటు, లైట్ కాంబినేషన్ కూడా చక్కగా అమరింది. ఫోటో లో ఉన్నది మా ఏడాదిన్నర వయసున్న శ్రియ. అన్నిటిని ముట్టుకు చూడాలని చాలా గొడవ చేసింది.
 పిరమిడ్ ల షేప్ లో ఉన్న ఈ ఆకృతి ఆప్టికల్ ఇల్లూషన్ ను కలిగిస్తాయి. ఈ పిరమిడ్ లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం పజిల్. ఏ చివరనుంచి లెక్కించినా కొన్ని మన దృష్టిని తప్పించుకుంటాయి. మనం అన్నీ లెక్క పెట్టాము అనుకుని సంతోషపడేసరికి, మన పక్కనున్న వాళ్ళు వేరే మొత్తం చెప్తారు. మళ్లీ కౌంటింగ్ మొదలు. సరదాగా గడిచిపోయింది.
  మా పిల్లలిద్దరికి ఈ ఎగ్జిబిట్ బాగా నచ్చింది. ఎంతోమంది కళాకారులు శ్రమించి సృష్టించిన ఈ రంగుల లోకం మాకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. 

మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను. 


~ శశిధర్ సంగరాజు.