Powered By Blogger

Sunday, September 18, 2011

నేచురల్ బ్రిడ్జి - కెంటకి

మా ఊరు లూయివిల్ కు దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో "నేచురల్  బ్రిడ్జి" స్టేట్ పార్క్ ఉంది. 

ప్రకృతి సహజం గా ఏర్పాటైన బ్రిడ్జి అన్నమాట. మీలో చాలామంది మన తిరుమల కొండమీద "శిలా తోరణం" చూసే ఉంటారు. సరిగ్గా అలాగే ఉంటుంది. కాకపొతే, చాలా పెద్దది ఎత్తైనది. మరో విషయం ఏంటంటే, నాకు తెలిసినంతవరకూ "శిలా తోరణం" మనం నడవడానికి వీలు లేదనుకుంటా. (నాకు సరిగ్గా గుర్తు లేదు. Correct me if I am wrong.) ఈ ఆర్చ్ మీద, మీరు నడవొచ్చు, పరుగులు పెట్టొచ్చు..మీ ఇష్టం. 

అసలీ పార్క్ కు వెళ్ళే దారికూడా చాలా బాగుంటుంది. రెండుగంటల ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. దారి పొడువునా, విశాలమైన పచ్చిక బయళ్ళు, స్వేచ్చ గా తిరిగే గుర్రాలు. (మా ఊరు గుర్రాలకు, గుర్రప్పందేలకు ప్రసిద్ది)చూడ్డానికి చాలా బాగుంటాయి. 
అసలు ఎలా ఏర్పడింది:  దాదాపు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ బ్రిడ్జి ఏర్పడడం మొదలైందని కొంత మంది జియాలజిస్ట్ ల నమ్మకం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ, కొంతమంది పర్యాటకులు 1889 నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారట. 78 అడుగుల పొడవు, 65 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం, 20 అడుగుల వెడల్పు.ఇవీ  ఈ బ్రిడ్జి వివరాలు.
 
ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ కేమ్పింగ్ వసతులున్నాయి. కొండ కిందున్న లేక్ లో బోటింగ్ చెయ్యడానికీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. 





 











 


మరి కొండపైకి వెళ్ళడం ఎలా?:
ఇక్కడ ఉన్న "స్కయ్ లిఫ్ట్" నిజంగా ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అరమైలు దూరం సాగే ఈ స్కయ్ లిఫ్ట్ ప్రయాణం ఉత్కంట భరితంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ, 
 కింద కనిపించే జింకలు, కుందేళ్ళు చూడ ముచ్చటగా ఉంటాయి.(కుందేళ్ళు కెమేరాకు చిక్కలేదు!)


ఈ ఆర్చ్ ఏర్పడడానికి ఉపయోగపడిన రాయిని  జియాలజీ పరిభాషలో 
"Pottsville conglomeratic sandstone" అంటారట. కొండపైన అడవిలాంటి ప్రాంతంలోపలికి వెళ్ళడానికి దారులు కూడా ఏర్పరచారు. 
మొత్తానికి ఈ ట్రిప్ పిల్లలకు, పెద్దలకు కూడా వీకెండ్ ఆటవిడుపే.


~శశిధర్  సంగరాజు.

Friday, September 16, 2011

నీ అసాధ్యం కూలా.. రాంబాబూ...నువ్వు సామాన్యుడివి కాదయ్యా!

ఇదిగో రాంబాబూ,
టీవీల్లో ఏదో చూపిస్తున్నారు. నువ్వేం  మనసు కష్టపెట్టుకోకు. ఈసారి వినాయక చవితికి కథ చదువుకోకుండా చంద్రున్ని చూసినట్లున్నావ్. నీలాపనిందలు. అవే సర్దుకుంటాయి లే.

అయినా, ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళకు వేరే పనేమీ లేనట్లుంది. గతంలో కూడా ఎన్ డి తివారీ విషయంలో కూడా ఇలాగే చేసారు. ఏదో ముసలాయన ఊరపిచ్చుక లేహ్యం గట్రా తిని హుషారుగా ఉన్నాడులే అని చూసీ చూడనట్లుండకుండా నానా యాగీ చేసి గవర్నర్ గిరి ఊడగొట్టించారు.

సరే, నీ విషయంలో అంటే ఊడగొట్టించడానికి నీ దగ్గర ప్రస్తుతానికి పదవేదీ లేదనుకో.
ఇక పరువు మర్యాదలంటావా..తూచ్..మనకు వాటికీ ఆమడదూరం. ఈ విషయం వాళ్ళకు తెలిసిరాలేదు.

అయినా, ఈ మధ్య ఓటర్ల కు కూడా బాగా కోరికలెక్కువయ్యాయి. ఏదో అయిదు సంవత్సరాలకొకసారి, నాలుగైదు
గంటలు ఎండలో నిలబడి ఓటు వేసినంతమాత్రాన, అవినీతి చెయ్యద్దంటారు, మహిళలను గౌరవించాలంటారు, ఎంత కష్టం. పైగా ప్రతిదానికీ ప్రకాశం పంతుల్ని, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటివాళ్ళను ఉదాహరణలు చూపిస్తారు. వాళ్ళలా నీతినిజాయితీ గా ఉండడానికి మనకేమైనా చాదస్తమా? ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోకపోతే, రాజకీయాల్లోకి రావడం ఎందుకు?

 వీళ్ళకు తోడు ఈ మధ్యన అన్నాహజారే తయారయ్యాడు,  ప్రతిదానికీ నిరాహార దీక్ష చేస్తానంటాడు.
ఈవయసులో అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం ఆయనకు కూడా మంచిదే అనుకో. కాకపోతే మధ్యతరగతి జనాలు ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు. ఏదో భూమి బద్దలైపోతున్నట్లు హడావిడి.

ఇంతకూ రాంబాబూ, మహిళా కార్యకర్తలను ఈరకంగా గిల్లుకోవచ్చని నీకు భలే ఐడియా వచ్చిందే. సూపర్ కదా!
అందుకే నిన్ను సామాన్యుడివి కాదూ అన్నది. రాజకీయాల్లో టెన్షన్ తట్టుకోలేక, రిలీఫ్ కోసం చేసి ఉంటావు కదా? అంతేలే, దానికి ఇంత గొడవ చెయ్యాలా?

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. నీ తాపత్రయం నా కర్థమైందిలే. ఏదో బయటున్నప్పుడే ఈ ముచ్చట్లన్నీ.
రేప్పొద్దున ఎమ్మార్ కేసులో సిబిఐ అరెస్టు చేసి లోపలేసిందనుకో, అక్కడ గోక్కోడానికి మహిళా కార్యకర్తలెవరూ ఉండరు. ఉంటే గింటే, మహిళా కానిస్టేబుళ్ళు ఉంటారు. వాళ్ళను గోకావనుకో, బయటకు  చెప్పుకోలేనిచోట థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మళ్ళీ అదో  బాధ.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నట్లున్నావ్. ధైర్యం అంటే అదీ. నిజం ఎలాగూ త్వరలోనే బయటపడుతుంది. ఈలోపల తొందరపడి జగన్ పార్టీలోంచి తీసేస్తాడని ఆలోచించొద్దు. ఇది కాకపోతే ఇంకోటి. ఈసారి మహిళలు కాస్త ఎక్కువున్న పార్టీ చూసి చేరుదువు గానీ. వినడానికి ఫోన్లో నీ గొంతు భలేగా ఉంది రాంబాబూ. ఈసారి వీడియో చాటింగ్ చెయ్యి. టెక్నాలజీ ని ఉపయోగించుకో. అసలే నీది మంచి ఫోటోజనిక్ ఫేస్  కదా.

ఈ ఛానళ్ళు, మహిళా సంఘాల  గొడవ మామూలేగానీ, నీ పనిలో నువ్వుండు. ఆల్ ది బెస్ట్.

~శశిధర్ సంగరాజు.

Thursday, September 8, 2011

750..800..850...

ఇరానీ హోటల్ లో ఇద్దరు...

మొదటి వ్యక్తి : (గాల్లోకి చూస్తూ...)   750..800..850...
రెండో వ్యక్తి : ఏంటి గురూ..ఏదో లెక్కలేస్తున్నట్లున్నావ్? ఏదైనా ఇంటి స్థలం కొంటున్నావా? ఎన్ని గజాలేంటి?
మొదటి వ్యక్తి : అబ్బే, ఇది గజాల్లెక్క కాదు. పొట్ట పగిలేలా దోచుకుతిన్న గాలి జనార్ధనరెడ్డి ని జైల్లో పెట్టి ఖైదీ నెంబర్ 697  ఇచ్చారు కదా? మన జగనన్న కు ఏ నెంబర్  వస్తుందా అని ఆలోచిస్తున్నా!
రెండో వ్యక్తి : అదేంటీ? బేరం సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీ లెవెల్లో ఏదో ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు?
మొదటి వ్యక్తి : ఆ ప్రయత్నాలన్నీ చీదేశాయి. మనోడు ఇంటిదారి కూడా పట్టాడట. డబ్బు మంత్రం పని చేసినట్లు లేదు. 
రెండో వ్యక్తి: సిబిఐ కూడా బాగా గట్టిగా ఉన్నట్లుంది. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పేట్లు లేదు.
మొదటి వ్యక్తి: అందరూ అదే అంటున్నారు. లోపలకు వెళ్ళాక ఏ నెంబర్ వచ్చినా పర్లేదు కానీ, 786 మాత్రం రాకూడదు. లేకపోతే, దేవుడు తనవైపే ఉన్నాడని ఇంకో పిడివాదం మొదలెడతాడు. మొన్న ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడుగా, తనను అరెస్ట్ చేస్తే, దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని.
రెండో వ్యక్తి : నిజమే, అంత పనీ, చెయ్యగలడు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వర్షం పడితే, వరుణుడు మా వైపే ఉన్నాడనేవాడు. 
మొదటి వ్యక్తి: చూద్దాం. సిబిఐ జగన్ కు ఎలాంటి షాక్ ఇస్తుందో?

~శశిధర్ సంగరాజు

Friday, July 22, 2011

ఘోస్ట్ హంటర్స్...

క్రితం వారం, నేను రాసిన "బహుశా..ఇదే కారణమై ఉంటుంది" పోస్ట్ లో ఆత్మల గురించి రాయడానికి ఒక కధ ఉందని చెప్పాను కదా?  ఆ కధ గురించే ఈ పోస్ట్. చదవండి మరి. 

ఇక్కడ మాకు టివిలో "ట్రావెల్" ఛానల్ వస్తుంది. సాధారణంగా, ఆ ఛానల్ లో ప్రపంచంలోని వివిధ దేశాలు, అక్కడి ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మొదలైనవి చూపిస్తుంటారు. "అంతోనీ బోర్డైన్ - నో రిజర్వేషన్", "ఆడం రిచ్మన్  - మాన్ వర్సెస్ ఫుడ్" ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. సరదాగా  ఉండడమే కాకుండా, ఎంతో విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ తో పాటు, "పారానార్మల్ స్టడీస్" (ఆత్మలకు సంబంధించిన శాస్త్రం) మీద కూడా ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఏదో, "మా పెరట్లో చింత చెట్టు మీద దయ్యం ఉంది, నిన్ను పట్టుకుంటుంది లే" అని చిన్నప్పుడు, తోటి పిల్లలను దడిపించినట్లు కాకుండా,  కాస్త సైంటిఫిక్ గా, లాజికల్ గా ఉంటాయి. సైంటిఫిక్ గా అంటే నా ఉదేశ్యం, ఆత్మలు చేసే శభ్దాలను, మాటలను (అవును, మాటలనే) హై సెన్సిటివ్ వాయిస్ రికార్డర్స్ తో రికార్డ్ చెయ్యడం, నైట్ విజన్ వీడియో కెమెరాలతో , చిమ్మ చీకటిలో, ఆత్మల సంచారాన్ని చిత్రించడం, తర్వాత వాటిని విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కూడా, టివి లో ఆ ప్రోగ్రామే వస్తోంది. ఈ కోవలోకే చెందినదే "ఘోస్ట్ హంటర్స్" అనే కార్యక్రమం.  ఒక చిన్న ఎపిసోడ్ గురించి చెప్పి ముగిస్తాను. 

ఒక కుటుంబానికి పురాతన వస్తువులు (Antiques) సేకరించడం సరదా. నిజంగా కూడా, అమెరికాలో, ఇదో పిచ్చి. ఎక్కడెక్కడో తిరిగి,  తుప్పు పట్టిన వస్తువులని డబ్బులిచ్చి కొని మరీ ఇంట్లో పెట్టుకుంటారు. మన దగ్గరైతే, ఎవరైనా ఇనుప వస్తువులు ఉచితంగా ఇచ్చినా తీసుకోము, దరిద్రమని.

సరే, కధలోకొస్తే, ఆ ఇంటి యజమాని ఎక్కడినుంచో ఒక పురాతన బాయ్నేట్ (తుపాకి ముందు తగిలించే కత్తి లాంటి ఆయుధం) కొని తెచ్చి ఇంట్లో అల్మారాలో పెట్టుకుంటాడు. వాళ్ళ ఆబ్బాయికి రాత్రిళ్ళు తన గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే, మొదట్లో, పిల్ల చేష్టలుగా కొట్టి పారేస్తారు. కాని, తర్వాత, యజమాని భార్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దాంతో వాళ్ళు భయపడి ఈ "ఘోస్ట్ హంటర్స్" ను పిలిపిస్తారు పరిశోదన చెయ్యడానికి. వాళ్ళ అనాలిసిస్ లో తేలిందేమిటంటే, ఈ బాయ్నేట్, వియత్నాం యుద్ధం లో పాల్గొన్న ఒక అమెరికన్ సైనికుడిది. అమెరికన్ సైనికులకు, వియత్నమీస్ కు జరిగిన యుద్దంలో, అమెరికన్ సైనికుడు ఈ బాయ్నేట్ ఉపయోగించి ఎంతో మందిని చంపేస్తాడు.బలవన్మరణాలకు గురైన ఆ ఆత్మలన్నీ, ఈ బాయ్నేట్ ను అంటిపెట్టుకుని ఉన్నాయన్నది పరిశోదన ఫలితం. "ఘోస్ట్ హంటర్స్" పరిశోధన ఎలా చేశారన్నది టివి లో చూస్తేగానీ మజా రాదు. ప్రస్తుతం నేను చూస్తున్న ఎపిసోడ్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది. 

నేను కాలేజి హాస్టల్ లో ఉన్నప్పుడు "ఊజా బోర్డు" అనే ప్రయోగం చేసాను. మా రూమ్మేట్స్ మాత్రమే పాల్గొనాలని ముందు కండిషన్ పెట్టుకున్నా, తర్వాత హాస్టల్ లో అందరికి తెలిసిపోయి రూం కిక్కిరిసి పోయ్యేలాగా జనం పోగైపోయారు. వార్డన్ కు తెలిస్తే, తన్ని తగలేస్తారని మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది.  

మీకు కూడా, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఆశక్తి ఉంటే, ఒక పని చెయ్యండి. మీ ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆర్పేయండి. టివి చూసే గదిలోకూడా ట్యూబ్ లైట్ కాకుండా, నైట్ బల్బ్ వెలుగులో సౌండ్ ఎక్కువ పెట్టుకుని చూడండి. మా ఊరి ఎమ్మెల్యే మీద ఒట్టు, దడుచుకోకపోతే నన్నడగండి.
Happy Ghost Hunting...
~శశిధర్ సంగరాజు. 

Tuesday, July 19, 2011

బహుశా ...ఇదే కారణమై ఉంటుంది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, రాందేవ్ బాబాల దీక్షలు, ప్రజలు దానికి మద్దతు పలకడం, రాజకీయనాయకులు యథాప్రకారం తమను కాదన్నట్లు అమాయకత్వం నటించడం చూస్తుంటే ఒకవైపు ఆనందం,మరోవైపు చిరాకు వస్తోంది. అవినీతి అన్ని రంగాల్లో ఉన్నా,  రాజకీయనాయకులదే పైచేయి.       నాకెప్పుడూ ఒక అనుమానం వస్తుండేది. రాజకీయ నాయకులు ఈస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు కదా, వీళ్ళకు మనస్సాక్షి ఉండదా?పాపభీతి లేదా? ఇంత మంది ఉసురు పోసుకుని రాత్రిళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకోగల్గుతున్నారు? అని. ఈమధ్యకాలంలో నాకొక దిక్కుమాలిన లాజిక్ తట్టింది. (లాజిక్ దిక్కుమాలిందని ముందే చెప్పాను, నన్ను చీవాట్లు పెట్టి లాభంలేదు.) 

భగవద్గీత సిడిలో ఘంటశాల మాష్టారు స్పష్టంగా చెప్పారు -

                     "ఆత్మ నాశనము లేనిది.
                                 ఆత్మను అగ్ని దహింపజాలదు,
                                 నీరు తడపజాలదు,
                                వాయవు ఆర్పివేయనూ సమర్ధము కాదు " అని.

జనాలు ఎంతమాత్రం వేదాంతమార్గం పట్టారో  తెలియదుకానీ, మన రాజకీయనాయకులు ఈ పాయింట్ మాత్రం బాగా వంటపట్టించుకున్నట్లుంది.ఎలాగూ వీళ్ళు పోయాక ఆత్మ వెళ్ళేది నరకానికే (స్వర్గం గేటు దగ్గరికి కూడా వీళ్ళను రానివ్వరని అరాజ(చ)కీయులకు ముందే తెలుసు). ఆత్మకు పైనచెప్పినట్లు ఏ బెంగా లేదు. ఇంకేం, సిగ్గు, శరం లేకుండా "అనుభవించు రాజా" అని పాడుకుంటూ ఇష్టమొచ్చినట్లు లంచాలు మేసేస్తున్నారు. పాపం, ఈవిషయం తెలియక యమకింకరులు పెద్ద, పెద్ద విగ్గులు అవీ పెట్టుకుని, నల్లరంగు పూసుకుని అమాయకంగా తిరుగుతుంటారు...సినిమాల్లో చూపించినట్లు. "చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత" అన్నట్లు కొంతమందిని పట్టుకుని జైల్లో పారేసినా, అక్కడ కూడా ఇడ్లీలు, వడలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

నా లాజిక్ తో ఏకీభవించేవాళ్ళెవరైనా ఉంటే, నాకు రాయండి.  ఇంతకూ, ఉన్నట్లుండి ఆత్మల మీద పడ్డాడేమిటి అనుకుంటున్నారా? దానికో కధ ఉంది. నా తర్వాత పోస్ట్ లో రాస్తాను.
~శశిధర్ సంగరాజు.

Sunday, June 26, 2011

కాలేజి రోజుల్లో నా కపిత్వం

అవును, కపిత్వం - మీరు చదివింది కరక్టే.
"కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ...." అని పెద్దాయన చెప్పినట్లు, పి.జి. చదివే రోజుల్లో నేను రాసిన ఒక కవిత గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. 

మొదటి సారి కవితలు రాసేవారు చాలామంది ప్రాస కోసం ప్రయత్నిస్తుంటారు. 
ఈ బాపతు ప్రయత్నమే ఎవరో చేసారట 

                     అందమైన మేడ
                     మేడ చుట్టూ గోడ
                     గోడ పక్కన దూడ
                     దూడ కింద పేడ   

ఇలాంటి కవితల పై గరికపాటి నరసింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ "దూడ కింద పేడ కాకపోతే నువ్వుంటావా?" అని చురకలంటించారు. 

ఇక నా కవిత విషయానికొస్తే...నేను నెల్లూరు జిల్లా కావలి లో మాస్టర్స్ చేసాను. అప్పటివరకు, కడప లో నా చదువు సాగింది.మరీ మిలిటరీ రూల్స్ కాకపోయినా, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్ గానే ఉండేవారు. కావలి లో హాస్టల్ మకాం.పై ఊర్లో ఉండి చదవడం, ఎప్పుడూ ఏమి అవసరం వస్తుందో అని ఇంట్లో వాళ్ళు అవసరానికి మించి పంపే డబ్బులు. ఇంకేముంది, అసలే కోతి, ముల్లు గుచ్చుకుంది, నిప్పు తొక్కింది అన్నట్లుగా ఉండేది వ్యవహారం.
పుస్తకాలు చదవడం, ఊర్లో కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం,వెంటనే చూసేయ్యడం మా దినచర్యగా మారింది. 

1993 ప్రాంతంలో కావలిలో కరవు వచ్చింది. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంతకమునుపు 30 సంవత్సారాల నుంచి అంత కరవు ఎప్పుడూ రాలేదని స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారు. 
నీటి ఇబ్బంది తో పాటూ, చదువు కూడా సరిగ్గా సాగడం (?) లేదని, మేము నలుగురం స్నేహితులం హాస్టల్ నుంచి జనత పేట కు మకాం మార్చాం. కానీ అక్కడ కూడా నీటి ఎద్దడే. పాపం, మహిళలు బిందెలు తీసుకుని రైల్వే ట్రాక్ దాటి కలుగోల్లమ్మ గుడి దాక మంచి నీళ్ళకోసం వెళ్ళేవారు. మేము అద్దెకు దిగిన ఇంట్లో బావి ఉన్నా, అదికూడా దాదాపుగా ఎండిపోయింది. కాకపోతే, చదువుకునే కుర్రాళ్ళు ప్రతిరోజూ స్నానం చెయ్యాలనే రూలేమీ లేదు కాబట్టి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. మా రూమ్మేటు ఒకతను కంద పద్యాలు రాసేవాడు.వ్యాకరణం పై నాకంత పట్టు లేకపోవడం వల్ల, నేను మామూలు కవితలకు సెటిల్ అయిపోయాను. 
మా బావి లో నీటి ఊట లేకపోయినా, అప్పటికే తెలుగు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడం వల్ల,  నాలో కవిత్వం పొంగడం మొదలై...ఇలా తయారైంది.
(మీకు ఓపిక ఉంటె మధ్య మధ్య లో వహ్వా, వహ్వా అనుకోవచ్చు ..నేనేమీ ఫీల్ అవను)

                     ఆకాశం లో నల్లని మబ్బులు
                     పక్కింటి మేడ పై తెల్లని సుబ్బులు
                     మబ్బులు కనిపిస్తే వర్షం
                     సుబ్బులు కనిపిస్తే హర్షం
                     ఎండిన కావలి జనాల్ని మబ్బులు  కరుణించేదేప్పుడో 
                     మండే నా హృదయాన్ని సుబ్బులు కరుణించేదేప్పుడో 
      
ఈ కవిత్వం ఆనోటా, ఈనోటా పడి హాస్టల్ లోని మా మిత్రబృందానికి కూడా చేరిందనీ, దానికి వాళ్ళు యథాశక్తి ప్రాచుర్యం కల్పించారనీ తర్వాత తెలిసింది.


షరా: పై కవితలో సుబ్బులు అనే శాల్తీ ఎవరూ లేరనీ, కేవలం ప్రాస కోసం పడ్డ తాపత్రయం మాత్రమేననీ, మానస ధియేటర్ కాంటీన్ లో దొరికే వేడి, వేడి పులిబొంగారాల మీద ఒట్టు. (ఇక్కడ మాత్రం ముళ్ళపూడి వారిని చదివి వాతలు పెట్టుకుంటున్నా..ఆయన కూడా రాసేవారుగా..."భట్టు గారి అట్టు మీద ఒట్టు" అని...అదన్నమాట.)


మీరు కూడా ఈ మాత్రం కపిత్వం వెలగబెట్టి ఉంటే...నాతో పంచుకోండి.
~శశిధర్ సంగరాజు.

Wednesday, May 18, 2011

సూరీడు ఎక్కడ?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించే రోజు వరకూ, ఏ దినపత్రికలో (ముఖ్యంగా ఈనాడులో ) రాజశేఖర్ రెడ్డి మీద కార్టూన్ వచ్చినా, పక్కనే, తెల్లటి జుట్టుతో, పొట్టిగా, లావుగా ఉన్నవ్యక్తి బొమ్మ తప్పకుండా ఉండేది. ఆయనే, రాజశేఖర్ రెడ్డి నమ్మినబంటు సూరీడు.కడప జిల్లాకే చెందిన సూరీడు (పూర్తి పేరు సూర్యనారాయణ రెడ్డి అనుకుంటా..) వైఎస్సార్ వెనుక ఫైళ్ళు పట్టుకొస్తూనో, మరోటో 
చేస్తూ వెన్నంటి ఉండేవాడు. కొన్ని టీవీ చానళ్ళ (బహుశా,టివి 9) ఇంటర్వ్యూ లలో ఆయనకు భోజనం వడ్డిస్తూ కూడా చూసినట్లు గుర్తు.

సర్వశిక్ష అభియాన్ కేసులో సూరీడు పేరు ప్రముఖంగా వినిపించింది. అన్ని కేసుల్లోలాగే, ఇందులో కూడా ఏమీ తేలలేదనుకోండి.అది వేరే విషయం.

వైఎస్సార్ అకాల మరణం తర్వాత సూరీడు కూడా కనుమరుగైపోయాడు. కానీ, ఇటీవల కడప ఉపఎన్నికల ప్రచారంలో కానీ,జగన్ ఘనవిజయం సాధించినప్పుడు కానీ ఈయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. పోనీ, జగన్ తో పొరపొచ్చాలేమైనా వచ్చాయనుకున్నా, స్వయానా  వైఎస్ తమ్ముడు వివేకా వైపుకూడా కనిపించలేదు.

మీరు గానీ ఎక్కడైనా టివీల్లో చూస్తే చెప్పండి. నాకు ఆయనతో పనేంలేదు కానీ, జస్ట్ క్యూరియాసిటీ...  అంతే.
~శశిధర్ సంగరాజు.