Powered By Blogger

Thursday, September 8, 2011

750..800..850...

ఇరానీ హోటల్ లో ఇద్దరు...

మొదటి వ్యక్తి : (గాల్లోకి చూస్తూ...)   750..800..850...
రెండో వ్యక్తి : ఏంటి గురూ..ఏదో లెక్కలేస్తున్నట్లున్నావ్? ఏదైనా ఇంటి స్థలం కొంటున్నావా? ఎన్ని గజాలేంటి?
మొదటి వ్యక్తి : అబ్బే, ఇది గజాల్లెక్క కాదు. పొట్ట పగిలేలా దోచుకుతిన్న గాలి జనార్ధనరెడ్డి ని జైల్లో పెట్టి ఖైదీ నెంబర్ 697  ఇచ్చారు కదా? మన జగనన్న కు ఏ నెంబర్  వస్తుందా అని ఆలోచిస్తున్నా!
రెండో వ్యక్తి : అదేంటీ? బేరం సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీ లెవెల్లో ఏదో ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు?
మొదటి వ్యక్తి : ఆ ప్రయత్నాలన్నీ చీదేశాయి. మనోడు ఇంటిదారి కూడా పట్టాడట. డబ్బు మంత్రం పని చేసినట్లు లేదు. 
రెండో వ్యక్తి: సిబిఐ కూడా బాగా గట్టిగా ఉన్నట్లుంది. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పేట్లు లేదు.
మొదటి వ్యక్తి: అందరూ అదే అంటున్నారు. లోపలకు వెళ్ళాక ఏ నెంబర్ వచ్చినా పర్లేదు కానీ, 786 మాత్రం రాకూడదు. లేకపోతే, దేవుడు తనవైపే ఉన్నాడని ఇంకో పిడివాదం మొదలెడతాడు. మొన్న ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడుగా, తనను అరెస్ట్ చేస్తే, దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని.
రెండో వ్యక్తి : నిజమే, అంత పనీ, చెయ్యగలడు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వర్షం పడితే, వరుణుడు మా వైపే ఉన్నాడనేవాడు. 
మొదటి వ్యక్తి: చూద్దాం. సిబిఐ జగన్ కు ఎలాంటి షాక్ ఇస్తుందో?

~శశిధర్ సంగరాజు

Friday, July 22, 2011

ఘోస్ట్ హంటర్స్...

క్రితం వారం, నేను రాసిన "బహుశా..ఇదే కారణమై ఉంటుంది" పోస్ట్ లో ఆత్మల గురించి రాయడానికి ఒక కధ ఉందని చెప్పాను కదా?  ఆ కధ గురించే ఈ పోస్ట్. చదవండి మరి. 

ఇక్కడ మాకు టివిలో "ట్రావెల్" ఛానల్ వస్తుంది. సాధారణంగా, ఆ ఛానల్ లో ప్రపంచంలోని వివిధ దేశాలు, అక్కడి ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మొదలైనవి చూపిస్తుంటారు. "అంతోనీ బోర్డైన్ - నో రిజర్వేషన్", "ఆడం రిచ్మన్  - మాన్ వర్సెస్ ఫుడ్" ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. సరదాగా  ఉండడమే కాకుండా, ఎంతో విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ తో పాటు, "పారానార్మల్ స్టడీస్" (ఆత్మలకు సంబంధించిన శాస్త్రం) మీద కూడా ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఏదో, "మా పెరట్లో చింత చెట్టు మీద దయ్యం ఉంది, నిన్ను పట్టుకుంటుంది లే" అని చిన్నప్పుడు, తోటి పిల్లలను దడిపించినట్లు కాకుండా,  కాస్త సైంటిఫిక్ గా, లాజికల్ గా ఉంటాయి. సైంటిఫిక్ గా అంటే నా ఉదేశ్యం, ఆత్మలు చేసే శభ్దాలను, మాటలను (అవును, మాటలనే) హై సెన్సిటివ్ వాయిస్ రికార్డర్స్ తో రికార్డ్ చెయ్యడం, నైట్ విజన్ వీడియో కెమెరాలతో , చిమ్మ చీకటిలో, ఆత్మల సంచారాన్ని చిత్రించడం, తర్వాత వాటిని విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కూడా, టివి లో ఆ ప్రోగ్రామే వస్తోంది. ఈ కోవలోకే చెందినదే "ఘోస్ట్ హంటర్స్" అనే కార్యక్రమం.  ఒక చిన్న ఎపిసోడ్ గురించి చెప్పి ముగిస్తాను. 

ఒక కుటుంబానికి పురాతన వస్తువులు (Antiques) సేకరించడం సరదా. నిజంగా కూడా, అమెరికాలో, ఇదో పిచ్చి. ఎక్కడెక్కడో తిరిగి,  తుప్పు పట్టిన వస్తువులని డబ్బులిచ్చి కొని మరీ ఇంట్లో పెట్టుకుంటారు. మన దగ్గరైతే, ఎవరైనా ఇనుప వస్తువులు ఉచితంగా ఇచ్చినా తీసుకోము, దరిద్రమని.

సరే, కధలోకొస్తే, ఆ ఇంటి యజమాని ఎక్కడినుంచో ఒక పురాతన బాయ్నేట్ (తుపాకి ముందు తగిలించే కత్తి లాంటి ఆయుధం) కొని తెచ్చి ఇంట్లో అల్మారాలో పెట్టుకుంటాడు. వాళ్ళ ఆబ్బాయికి రాత్రిళ్ళు తన గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే, మొదట్లో, పిల్ల చేష్టలుగా కొట్టి పారేస్తారు. కాని, తర్వాత, యజమాని భార్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దాంతో వాళ్ళు భయపడి ఈ "ఘోస్ట్ హంటర్స్" ను పిలిపిస్తారు పరిశోదన చెయ్యడానికి. వాళ్ళ అనాలిసిస్ లో తేలిందేమిటంటే, ఈ బాయ్నేట్, వియత్నాం యుద్ధం లో పాల్గొన్న ఒక అమెరికన్ సైనికుడిది. అమెరికన్ సైనికులకు, వియత్నమీస్ కు జరిగిన యుద్దంలో, అమెరికన్ సైనికుడు ఈ బాయ్నేట్ ఉపయోగించి ఎంతో మందిని చంపేస్తాడు.బలవన్మరణాలకు గురైన ఆ ఆత్మలన్నీ, ఈ బాయ్నేట్ ను అంటిపెట్టుకుని ఉన్నాయన్నది పరిశోదన ఫలితం. "ఘోస్ట్ హంటర్స్" పరిశోధన ఎలా చేశారన్నది టివి లో చూస్తేగానీ మజా రాదు. ప్రస్తుతం నేను చూస్తున్న ఎపిసోడ్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది. 

నేను కాలేజి హాస్టల్ లో ఉన్నప్పుడు "ఊజా బోర్డు" అనే ప్రయోగం చేసాను. మా రూమ్మేట్స్ మాత్రమే పాల్గొనాలని ముందు కండిషన్ పెట్టుకున్నా, తర్వాత హాస్టల్ లో అందరికి తెలిసిపోయి రూం కిక్కిరిసి పోయ్యేలాగా జనం పోగైపోయారు. వార్డన్ కు తెలిస్తే, తన్ని తగలేస్తారని మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది.  

మీకు కూడా, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఆశక్తి ఉంటే, ఒక పని చెయ్యండి. మీ ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆర్పేయండి. టివి చూసే గదిలోకూడా ట్యూబ్ లైట్ కాకుండా, నైట్ బల్బ్ వెలుగులో సౌండ్ ఎక్కువ పెట్టుకుని చూడండి. మా ఊరి ఎమ్మెల్యే మీద ఒట్టు, దడుచుకోకపోతే నన్నడగండి.
Happy Ghost Hunting...
~శశిధర్ సంగరాజు. 

Tuesday, July 19, 2011

బహుశా ...ఇదే కారణమై ఉంటుంది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, రాందేవ్ బాబాల దీక్షలు, ప్రజలు దానికి మద్దతు పలకడం, రాజకీయనాయకులు యథాప్రకారం తమను కాదన్నట్లు అమాయకత్వం నటించడం చూస్తుంటే ఒకవైపు ఆనందం,మరోవైపు చిరాకు వస్తోంది. అవినీతి అన్ని రంగాల్లో ఉన్నా,  రాజకీయనాయకులదే పైచేయి.       నాకెప్పుడూ ఒక అనుమానం వస్తుండేది. రాజకీయ నాయకులు ఈస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు కదా, వీళ్ళకు మనస్సాక్షి ఉండదా?పాపభీతి లేదా? ఇంత మంది ఉసురు పోసుకుని రాత్రిళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకోగల్గుతున్నారు? అని. ఈమధ్యకాలంలో నాకొక దిక్కుమాలిన లాజిక్ తట్టింది. (లాజిక్ దిక్కుమాలిందని ముందే చెప్పాను, నన్ను చీవాట్లు పెట్టి లాభంలేదు.) 

భగవద్గీత సిడిలో ఘంటశాల మాష్టారు స్పష్టంగా చెప్పారు -

                     "ఆత్మ నాశనము లేనిది.
                                 ఆత్మను అగ్ని దహింపజాలదు,
                                 నీరు తడపజాలదు,
                                వాయవు ఆర్పివేయనూ సమర్ధము కాదు " అని.

జనాలు ఎంతమాత్రం వేదాంతమార్గం పట్టారో  తెలియదుకానీ, మన రాజకీయనాయకులు ఈ పాయింట్ మాత్రం బాగా వంటపట్టించుకున్నట్లుంది.ఎలాగూ వీళ్ళు పోయాక ఆత్మ వెళ్ళేది నరకానికే (స్వర్గం గేటు దగ్గరికి కూడా వీళ్ళను రానివ్వరని అరాజ(చ)కీయులకు ముందే తెలుసు). ఆత్మకు పైనచెప్పినట్లు ఏ బెంగా లేదు. ఇంకేం, సిగ్గు, శరం లేకుండా "అనుభవించు రాజా" అని పాడుకుంటూ ఇష్టమొచ్చినట్లు లంచాలు మేసేస్తున్నారు. పాపం, ఈవిషయం తెలియక యమకింకరులు పెద్ద, పెద్ద విగ్గులు అవీ పెట్టుకుని, నల్లరంగు పూసుకుని అమాయకంగా తిరుగుతుంటారు...సినిమాల్లో చూపించినట్లు. "చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత" అన్నట్లు కొంతమందిని పట్టుకుని జైల్లో పారేసినా, అక్కడ కూడా ఇడ్లీలు, వడలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

నా లాజిక్ తో ఏకీభవించేవాళ్ళెవరైనా ఉంటే, నాకు రాయండి.  ఇంతకూ, ఉన్నట్లుండి ఆత్మల మీద పడ్డాడేమిటి అనుకుంటున్నారా? దానికో కధ ఉంది. నా తర్వాత పోస్ట్ లో రాస్తాను.
~శశిధర్ సంగరాజు.

Sunday, June 26, 2011

కాలేజి రోజుల్లో నా కపిత్వం

అవును, కపిత్వం - మీరు చదివింది కరక్టే.
"కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ...." అని పెద్దాయన చెప్పినట్లు, పి.జి. చదివే రోజుల్లో నేను రాసిన ఒక కవిత గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. 

మొదటి సారి కవితలు రాసేవారు చాలామంది ప్రాస కోసం ప్రయత్నిస్తుంటారు. 
ఈ బాపతు ప్రయత్నమే ఎవరో చేసారట 

                     అందమైన మేడ
                     మేడ చుట్టూ గోడ
                     గోడ పక్కన దూడ
                     దూడ కింద పేడ   

ఇలాంటి కవితల పై గరికపాటి నరసింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ "దూడ కింద పేడ కాకపోతే నువ్వుంటావా?" అని చురకలంటించారు. 

ఇక నా కవిత విషయానికొస్తే...నేను నెల్లూరు జిల్లా కావలి లో మాస్టర్స్ చేసాను. అప్పటివరకు, కడప లో నా చదువు సాగింది.మరీ మిలిటరీ రూల్స్ కాకపోయినా, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్ గానే ఉండేవారు. కావలి లో హాస్టల్ మకాం.పై ఊర్లో ఉండి చదవడం, ఎప్పుడూ ఏమి అవసరం వస్తుందో అని ఇంట్లో వాళ్ళు అవసరానికి మించి పంపే డబ్బులు. ఇంకేముంది, అసలే కోతి, ముల్లు గుచ్చుకుంది, నిప్పు తొక్కింది అన్నట్లుగా ఉండేది వ్యవహారం.
పుస్తకాలు చదవడం, ఊర్లో కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం,వెంటనే చూసేయ్యడం మా దినచర్యగా మారింది. 

1993 ప్రాంతంలో కావలిలో కరవు వచ్చింది. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంతకమునుపు 30 సంవత్సారాల నుంచి అంత కరవు ఎప్పుడూ రాలేదని స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారు. 
నీటి ఇబ్బంది తో పాటూ, చదువు కూడా సరిగ్గా సాగడం (?) లేదని, మేము నలుగురం స్నేహితులం హాస్టల్ నుంచి జనత పేట కు మకాం మార్చాం. కానీ అక్కడ కూడా నీటి ఎద్దడే. పాపం, మహిళలు బిందెలు తీసుకుని రైల్వే ట్రాక్ దాటి కలుగోల్లమ్మ గుడి దాక మంచి నీళ్ళకోసం వెళ్ళేవారు. మేము అద్దెకు దిగిన ఇంట్లో బావి ఉన్నా, అదికూడా దాదాపుగా ఎండిపోయింది. కాకపోతే, చదువుకునే కుర్రాళ్ళు ప్రతిరోజూ స్నానం చెయ్యాలనే రూలేమీ లేదు కాబట్టి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. మా రూమ్మేటు ఒకతను కంద పద్యాలు రాసేవాడు.వ్యాకరణం పై నాకంత పట్టు లేకపోవడం వల్ల, నేను మామూలు కవితలకు సెటిల్ అయిపోయాను. 
మా బావి లో నీటి ఊట లేకపోయినా, అప్పటికే తెలుగు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడం వల్ల,  నాలో కవిత్వం పొంగడం మొదలై...ఇలా తయారైంది.
(మీకు ఓపిక ఉంటె మధ్య మధ్య లో వహ్వా, వహ్వా అనుకోవచ్చు ..నేనేమీ ఫీల్ అవను)

                     ఆకాశం లో నల్లని మబ్బులు
                     పక్కింటి మేడ పై తెల్లని సుబ్బులు
                     మబ్బులు కనిపిస్తే వర్షం
                     సుబ్బులు కనిపిస్తే హర్షం
                     ఎండిన కావలి జనాల్ని మబ్బులు  కరుణించేదేప్పుడో 
                     మండే నా హృదయాన్ని సుబ్బులు కరుణించేదేప్పుడో 
      
ఈ కవిత్వం ఆనోటా, ఈనోటా పడి హాస్టల్ లోని మా మిత్రబృందానికి కూడా చేరిందనీ, దానికి వాళ్ళు యథాశక్తి ప్రాచుర్యం కల్పించారనీ తర్వాత తెలిసింది.


షరా: పై కవితలో సుబ్బులు అనే శాల్తీ ఎవరూ లేరనీ, కేవలం ప్రాస కోసం పడ్డ తాపత్రయం మాత్రమేననీ, మానస ధియేటర్ కాంటీన్ లో దొరికే వేడి, వేడి పులిబొంగారాల మీద ఒట్టు. (ఇక్కడ మాత్రం ముళ్ళపూడి వారిని చదివి వాతలు పెట్టుకుంటున్నా..ఆయన కూడా రాసేవారుగా..."భట్టు గారి అట్టు మీద ఒట్టు" అని...అదన్నమాట.)


మీరు కూడా ఈ మాత్రం కపిత్వం వెలగబెట్టి ఉంటే...నాతో పంచుకోండి.
~శశిధర్ సంగరాజు.

Wednesday, May 18, 2011

సూరీడు ఎక్కడ?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించే రోజు వరకూ, ఏ దినపత్రికలో (ముఖ్యంగా ఈనాడులో ) రాజశేఖర్ రెడ్డి మీద కార్టూన్ వచ్చినా, పక్కనే, తెల్లటి జుట్టుతో, పొట్టిగా, లావుగా ఉన్నవ్యక్తి బొమ్మ తప్పకుండా ఉండేది. ఆయనే, రాజశేఖర్ రెడ్డి నమ్మినబంటు సూరీడు.కడప జిల్లాకే చెందిన సూరీడు (పూర్తి పేరు సూర్యనారాయణ రెడ్డి అనుకుంటా..) వైఎస్సార్ వెనుక ఫైళ్ళు పట్టుకొస్తూనో, మరోటో 
చేస్తూ వెన్నంటి ఉండేవాడు. కొన్ని టీవీ చానళ్ళ (బహుశా,టివి 9) ఇంటర్వ్యూ లలో ఆయనకు భోజనం వడ్డిస్తూ కూడా చూసినట్లు గుర్తు.

సర్వశిక్ష అభియాన్ కేసులో సూరీడు పేరు ప్రముఖంగా వినిపించింది. అన్ని కేసుల్లోలాగే, ఇందులో కూడా ఏమీ తేలలేదనుకోండి.అది వేరే విషయం.

వైఎస్సార్ అకాల మరణం తర్వాత సూరీడు కూడా కనుమరుగైపోయాడు. కానీ, ఇటీవల కడప ఉపఎన్నికల ప్రచారంలో కానీ,జగన్ ఘనవిజయం సాధించినప్పుడు కానీ ఈయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. పోనీ, జగన్ తో పొరపొచ్చాలేమైనా వచ్చాయనుకున్నా, స్వయానా  వైఎస్ తమ్ముడు వివేకా వైపుకూడా కనిపించలేదు.

మీరు గానీ ఎక్కడైనా టివీల్లో చూస్తే చెప్పండి. నాకు ఆయనతో పనేంలేదు కానీ, జస్ట్ క్యూరియాసిటీ...  అంతే.
~శశిధర్ సంగరాజు.

Saturday, May 7, 2011

కెంటకీ డర్బీ - మా ఊళ్ళో గుర్రప్పందేలు

మే 7 న (శనివారం) మా ఊర్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గుర్రప్పందేలు జరిగాయి. చర్చిల్ డౌన్స్ అనే ప్రాంతం లో జరిగిన ఈ రేసును  "డర్బీ" అంటారు. చిన్న, చితకా రేసులు దాదాపు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉన్నా, ఈ రేసుకు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా లో ప్రతిసంవత్సరం మూడు పెద్ద రేసులు జరుగుతాయి. వీటిని "ట్రిపుల్ క్రౌన్" రేసులంటారు. లూయివిల్ లో జరిగిన "డర్బీ" రేసు,  "ట్రిపుల్ క్రౌన్" లో మొదటిది. రెండోది, "ప్రీక్నెస్ స్టేక్స్"  బాల్టిమోర్/మేరీలాండ్ లో జరుగుతుంది. మూడో రేస్ "బెల్మొంట్ స్టేక్స్" న్యూయార్క్ లో జరుగుతుంది. అక్కడితో  ఈ సంవత్సరానికి "ట్రిపుల్ క్రౌన్" రేసులు ముగుస్తాయి. 
చర్చిల్ డౌన్స్



ఈ బ్లాగ్ చదివేవాళ్ళలో జంతు ప్రేమికులేవరైనా ఉంటే "నోరులేని జీవాలను హింసిస్తున్న దుర్మార్గులు" అని నా మీద అలగక్కరలేదు. ఈ రేసులు ఇప్పుడేదో కొత్తగా మొదలైనవికావు. కెంటకీ డర్బీ 1875 లో, ప్రీక్నెస్ స్టేక్స్ 1873 లో, బెల్మొంట్ స్టేక్స్ 1867 లో మొదలైయ్యాయి. లక్షలాది మంది చూసి ఆనందిస్తే, మిలియన్ల కొద్ది డాలర్లు చేతులు మారతాయి. ఈ రేసులన్నిట్లో మూడు సంవత్సరాల వయసున్న గుర్రాలే పాల్గొంటాయి. పేరుకు మూడు సంవత్సరాల వయసైనా, చూడడానికి ఎత్తుగా, పెద్దగా హుందాగా ఉంటాయి. ఫినిషింగ్ లైన్ వైపు దూసుకొచ్చే గుర్రాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. 
దూసుకుపోతున్నజాకీలు 


ఇక్కడో విషయం గమనించాలి, లింగవివక్ష ఎక్కడైనా ఉందేమో గానీ గుర్రప్పందేల్లో మాత్రం లేదని చెప్పగలను. సరిగ్గా డర్బీ జరగడానికి ఒక రోజు ముందు, లూయివిల్ లో "కెంటకీ ఓక్స్" అనే రేసు జరుగుతుంది. ఇందులో అన్నీ ఆడ గుర్రాలే పాల్గొంటాయి.


 ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా కొన్ని గుర్రాలమీద పందెం కాసాను. గతంలో ఎంతో, కొంత అనాలిసిస్ చేసి, గుర్రాల గురించి తెలుసుకుని మరీ పందేలు పెట్టేవాన్ని. కొన్నిసార్లు కొంత చిల్లర కూడా వచ్చినట్లు గుర్తు. అదేం విచిత్రమో, నేను పందెంకాసిన గుర్రాలు, రేసు మొదట్లో గుర్రాలుగానే పరుగు మొదలెట్టినా, చివరకొచ్చేసరికి గాడిదల్లాగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రతిసారి నాకు చేతి చమురు వదలడమే. ఆడిన ప్రతిసారి ఓడిపోయేటప్పుడు, పందేలు కట్టడ మెందుకు అంటారా? అదో తుత్తి.  

వచ్చేసంవత్సరానికైనా "ఆశ్వ హృదయం" గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతం లో నకులుడికో, సహదేవుడికో ఈ విద్య తెలుసని చదివాను. చూద్దాం అదృష్టం ఎలాఉందో. 
~శశిధర్ సంగరాజు.

Sunday, April 24, 2011

అర్జునుడా? అభిమన్యుడా?

 కడప లోక్ సభకు, పులివెందుల అసెంబ్లీ కి ఉప ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది . కాంగ్రెస్, తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరా హోరీ గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎప్పుడు చూసినా, కరవుతో, వర్షాభావంతో  అల్లాడే కడప ప్రజలపై ఇప్పుడు ధనవర్షం కురుస్తోంది. ఓటుకు ఐదు వేల రూపాయలవరకు ముట్టచెపుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలను రంగం లోకి దింపింది. ఇక విమర్శలు, ప్రతివిమర్శలకు అంతే లేదు. ఈ నేపధ్యంలో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఊహాత్మకమైన పరిశీలన మాత్రమే. ఫలితాలు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. 
ముందుగా పులివెందుల అసెంబ్లీ స్థానం: ప్రదానం గా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిల మధ్యనే.తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే, ఎంతో కుటుంబ నేపధ్యం, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడిన ఎస్వీ సతీష్ రెడ్డి కే ఇక్కడ విజయం దక్కలేదు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బిటెక్ రవికి ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం నమ్మశక్యం కాని విషయం. 

ఇక విజయమ్మ పరిస్థితి కొస్తే, ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా మహిళలు నీరాజనాలు పడుతున్నారు. గతంలో ఒక్కసారి కూడా ప్రచారానికి రాని ఆమె, మండుటెండల్లో వీదుల్లోకి రావడంతో మహిళల్లో  సానుభూతి కూడా పుష్కలంగా ఉంది. కానీ, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మహిళా సానుభూతి ఓట్లతో ఒకవేళ గెలిచినా, పులివెందుల ప్రజలకు వాళ్ళ పనులు జరగాలంటే, మళ్ళీ వివేకానందరెడ్డి సహాయం తప్పనిసరి. పైగా, 
వైఎస్ మరణం తర్వాత, అన్ని పార్టీల మద్దతుతో గెలుపొందిన విజయమ్మ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు (మీడియా వార్తల ప్రకారం). అప్పుడంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు "మీది తెనాలే..మాది తెనాలే" అని పాడుకుంటూ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు విజయమ్మ, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ కు  బద్దవ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు కాబట్టి, ఒకవేళ గెలిచి అసెంబ్లీ, మెట్లు ఎక్కకపోతే, ప్రతిపక్షాలతో పాటు, కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించక మానదు. ఒకవేళ, అసెంబ్లీ కి వెళ్ళినా ప్రజా సమస్యలపై ఈమె ఏమాత్రం పోరాడుతారో అనుమానమే. (ఇప్పుడు అసెంబ్లీ లో ఉన్నోళ్ళు ఏమి పొడిచేసారని నన్ను అడక్కండి...నా దగ్గర సమాధానం లేదు) 
వివేకానంద రెడ్డి విషయానికొస్తే, మొన్నేదో అసెంబ్లీ లో గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని ఒక్కటిచ్చుకున్నాడని పేపర్లలో వచ్చింది గానీ, స్వతహాగా ఈయన సౌమ్యుడు. పులివెందుల ప్రాంతంలో అందరికి అందుబాటులో ఉంటాడనే మంచి పేరు ఉంది. (ఈయన లోగడ కడప ఎంపి గా చేసినప్పుడు అందరూ అంటుంటే, విన్నాను. ) మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చెయ్యడం ఒక విధంగా ప్లస్ పాయింట్ అవుతోంది. 

Bottom Line: తక్కువ మెజార్టీతో అయినా సరే, పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గెలుస్తాడని నా అంచనా. 
కడప పార్లమెంటు స్థానం: ఇక్కడ, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్ర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జగన్, తెలుగుదేశం నుంచి మైసూరారెడ్డి బరిలో ఉన్నారు. అధికార పార్టీ, అధికారుల అండదండలు డిఎల్ కు కలిసివచ్చే అంశం. కాకపొతే, ఈయన సాదారణంగా మైదుకూరు నియోజక వర్గానికి పరిమితమైన నాయకుడు. జిల్లా మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనే దానిమీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పిఆర్పి, కాంగ్రెస్ లో విలీనం కావడంవల్ల, ఆ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా కలిసొస్తాయి. ఇక, మైసూరారెడ్డి ది మాత్రం ఎదురీతే. స్వతహాగా, మంచి నాయకుడనే పేరు, ప్రజల్లో సానుభూతి (గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి)ఉంది. అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది వేచిచూడాల్సిన విషయం. 
ఇక జగన్, ఈయన,  తాను సియం అయితే...ఏ ఫైల్ మీద ముందుగా సంతకం పెడతాడో అన్న విషయం పక్కనపెట్టి, ప్రజలకు ఏమిచేస్తాడో చెపితే ఇంకొన్ని ఓట్లు ఎక్కువ రాలే అవకాశం ఉంది.కాంగ్రెస్ పన్నిన పద్మవ్యూహం లో అభిమన్యుడవుతాడో, అర్జునుడవుతాడో మే 13 దాకా వేచిచూడాల్సిందే.  

Bottom Line: జగన్ వర్గం డప్పు కొట్టుకుంటున్నట్లు, మూడులక్షల మెజార్టీ రాదు కానీ, జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువున్నాయి. గతంలో కన్నా మెజార్టీ తగ్గొచ్చు. అయినా, ఎంపి గా పదవీ కాలం ఉన్నప్పుడు, రాజీనామ చేసి, మళ్లీ ఎంపి గా గెలిస్తే మాత్రం ఒరిగేదేముంటుంది (సొంత గుర్తు మీద గెలిచానన్న తుత్తి తప్ప).
రిగ్గింగ్ జరక్కుండా అడ్డుకుని, ప్రజలను స్వేచ్చగా ఓట్లు వేసుకోనిస్తే ఫలితాలు తారుమారైయ్యే అవకాశం ఉంది. కానీ, కడప లో అది సాధ్యమైయ్యే వ్యవహారం కాదు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో. 
ఒకవేళ, రెండు సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి మాత్రం ఖాయం.